సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 9: సీపీఆర్ నేర్చుకోవడం ద్వారా ఎంతో మంది విలువైన ప్రాణాలు కాపాడొచ్చని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణ శివారులోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో ప్రజాప్రతినిధులు, పోలీస్, పంచాయతీరాజ్ అధికారులకు జరిగిన సీపీఆర్ శిక్షణలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత, ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్తో కలిసి మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్ మంత్రి హరీశ్రావు సమక్షంలో సీపీఆర్ చేశారు. అనంతరం ఇటీవల సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కొండపాక, చిన్నకోడూరు మండలం 108 సిబ్బందిని మంత్రి సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ఆత్మీయులు, కుటుంబ సభ్యులకు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సీపీఆర్ విలువ తెలుస్తుందన్నారు. కొద్దిపాటి శిక్షణ తీసుకుంటే ఎప్పుడైనా అవసరం పడుతుందన్నారు. సడెన్ కార్డియాక్ అరెస్ట్తో దేశంలో ప్రతి సంవత్సరం 15 లక్షల మంది చనిపోతున్నారని, సీపీఆర్ నేర్చుకుంటే కనీసం 50 శాతం మందిని బతికించే అవకాశం ఉంటుందన్నారు. ఓ సర్వే ప్రకారం రోజూ 4 వేల మందికి కార్డియాక్ అరెస్ట్ వస్తే కేవలం ఒక శాతం మంది మాత్రమే బతుకుతున్నారన్నారు. కేవలం 2 శాతం మందికి మాత్రమే సీపీఆర్పై అవగాహన ఉందని.. సీఎం కేసీఆర్ సూచనతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రతి ఒక్కరికీ సీపీఆర్ ట్రైనింగ్ ఇస్తామన్నారు. అందరూ నేర్చుకుంటే విలువైన ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు. త్వరలోనే రూ.15 కోట్లతో ఏఈడీ మిషన్లు కొనుగోలు చేసి ప్రతి పీహెచ్సీ, బస్తీ దవాఖానాల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1826 బ్యాచ్లు 36,500 మందికి సీపీఆర్ ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు. జిల్లాలో కూడా ప్రతి రోజూ ట్రైనింగ్ ఇస్తామన్నారు. ఉద్యోగ సంఘాలు, సెక్యూరిటీ గార్డులు, ఉపాధ్యాయ సంఘాలు, సూపర్ మార్కెట్ సిబ్బంది, అపార్ట్మెంట్ అసోసియేషన్ల ప్రతినిధులు ఇలా ప్రతి ఒక్కరికీ సీపీఆర్పై ట్రైనింగ్ ఇస్తామన్నారు. కొన్ని రోజుల క్రితం వరంగల్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగిన రెండు సంఘటనల్లో సీపీఆర్ చేసి బతికించగలిగామని గుర్తు చేశారు. కొండపాక మండలానికి చెందిన ఓ ఆటో డ్రైవర్, చిన్నకోడూరు మండలానికి చెందిన 23 రోజుల పాపను సీపీఆర్ చేసి 108 సిబ్బంది కాపాడారన్నారు. కార్డియాక్ అరెస్ట్.. హార్ట్ ఎటాక్ రెండూ వేర్వేరు అని వివరించారు. కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే సీపీఆర్ చేయాలన్నారు. దీన్ని ఉద్యమంలా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్ ఇస్తామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పకుండా సీపీఆర్ నేర్చుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి అపార్టుమెంట్లో ఏఈడీ మిషన్ ఉండే విధంగా చట్టం తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు.
త్వరలోనే పోలీసులకు నిర్వహించిన హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఫ్యామిలీ కౌన్సెలింగ్, ట్రీట్మెంట్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. సిద్దిపేట హెల్త్ ప్రొఫైల్ మోడల్తో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఈ నెల 13వ తేదీన సంగారెడ్డి జిల్లాలో కూడా పోలీస్ కన్వెన్షన్ సెంటర్కు శంకుస్థాపన చేస్తామన్నారు. పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పోలీసుల సంక్షేమానికే ఖర్చు చేస్తామన్నారు. హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని సంగారెడ్డి, మెదక్ జిల్లాలో కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ ప్రజల విలువైన ప్రాణాలు కాపాడేందుకు సీపీఆర్ అనేది మంచి ప్రయత్నమన్నారు. ప్రతి వ్యక్తి సీపీఆర్ నేర్చుకోవడం చాలా అవసరమన్నారు. జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ మాట్లాడుతూ సీపీఆర్ నేర్చుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని.. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో సీపీఆర్ ట్రైనింగ్ ఇవ్వడం చాలా మంచి విషయమన్నారు. అంతకుముందు ప్రజాప్రతినిధులు, అధికారులకు సీపీఆర్ ట్రైనింగ్ పై పీపీటీ ద్వారా వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, డీఎంహెచ్వో డాక్టర్ కాశీనాథ్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.