‘తెలంగాణ ఆచరిస్తుంది. దేశం అనుసరిస్తుంది. సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి పల్లె అభివృద్ధి పథంలో పయనిస్తున్నది’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని 72 మంది పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తూ ఉద్యోగ నియామక పత్రాలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డితో కలిసి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగం ఇచ్చింది… వాటిని రెగ్యులరైజ్ చేసింది ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు. దేశంలో ఏ రాష్ర్టానికి వెళ్లినా తెలంగాణ పల్లెల్లాంటి గ్రామాలు ఎక్కడా కనిపించవన్నారు. ట్యాంకర్, ట్రాలీ, ట్రాక్టర్, వైకుంఠధామం, నర్సరీ, డంపింగ్యార్డు, ఇంటింటికీ చెత్తసేకరణ, హరితహారం ప్లాంటేషన్ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఎక్కడా లేవన్నారు. అంతకుముందు నూతన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ నెల 19న సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పనులన్నీ పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలన్నారు. మెదక్ సీఎస్ఐ చర్చి గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఉంటుందని, పెద్ద ఎత్తున బీఆర్ఎస్శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
– మెదక్ (నమస్తే తెలంగాణ), ఆగస్టు 14
మెదక్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : ఒకప్పుడు బెంగాల్ ఆచరిస్తుంది..దేశం అనుసరిస్తుంది అన్న నానుడి 40 ఏండ్లు దేశంలో నడిచింది. ఇప్పుడు తెలంగాణ ఆచరిస్తుంది. దేశం అనుసరిస్తుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ వల్ల సాధ్యమైందని మంత్రి తెలిపారు. కల్మషం లేని ప్రేమ కేసీఆర్దని.. పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగం ఇచ్చింది…ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసింది కేసీఆరేనని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని 72 మంది పంచాయతీ కార్యదర్శిలకు రెగ్యులరైజ్ చేస్తూ ఉద్యోగ నియామక పత్రాలను మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇక నుంచి మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులేనని, మరింత ఉత్సాహంతో కష్టపడి పనిచేయాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్లినా, ఏ రాష్ట్రంలోని గ్రామాలకు వెళ్లినా తెలంగాణ పల్లెలాంటి పల్లెలు చాలా అరుదుగా కనబడుతాయని పేర్కొన్నారు.
ప్రతి పల్లెలో ట్యాంకర్, ట్రాలీ, ట్రాక్టర్, వైకుంఠధామం, నర్సరీ, డంపుయార్డు, ఇంటింటికీ ప్రతిరోజూ చెత్తసేకరణ, పచ్చని చెట్లతో ప్లాంటేషన్ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు దేశంలో చాలా తక్కువగా ఉంటాయన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఊరిలో ట్రాక్టర్, ట్రాలీ, నర్సరీ, డంపు యార్డు, వైకుంఠధామాలతో విజయవంతంగా పల్లెలను పరిశుభ్రంగా కాపాడుకుంటున్నామని తెలిపారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా క్రమం తప్పకుండా ప్రతినెలా నిధులు ఇస్తున్నారని గుర్తు చేశారు. వానకాలం వచ్చిందంటే పాత రోజుల్లో రోగాలతో ఊర్లు వణికిపోతున్నాయనే వార్తలు చూసేవాళ్లమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో వానకాలం వచ్చిందంటే అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాకుండా మిషన్ భగీరథ, పల్లె ప్రగతి వల్ల ఆ పరిస్థితి లేదన్నారు. పల్లెల్లో అంటువ్యాధులు నిర్మూలిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 4 వేల నుంచి 5వేల కొత్త పంచాయతీలను ఏర్పాటు చేశామని, గతంలో రెండు, మూడు మండలాలకు ఒక పంచాయతీ కార్యదర్శులు ఉండేవారని, ఇప్పుడు ప్రతి పల్లెకూ పంచాయతీ కార్యదర్శిని నియమించామని పేర్కొన్నారు. ప్రతి తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకొని కొత ్తపంచాయతీలో సెక్రటరీ ఉండాలని సీఎం కేసీఆర్ కొత్తగా పదివేల పోస్టులను భర్తీ చేశారని గుర్తు చేశారు.
మూడు శాతం జనాభా ఉన్న తెలంగాణకు 38శాతం అవార్డులు
దేశంలో మూడుశాతం జనాభా ఉన్న తెలంగాణకు 38శాతం అవార్డులు గ్రామ పంచాయతీలకు వస్తున్నాయంటే సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే సాధ్యమవుతుందని మంత్రి హరీశ్రావు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 80వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నదని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
ఈనెల 19న మెదక్ జిల్లాకు సీఎం కేసీఆర్
ఈనెల 19న మెదక్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి సీఎం కేసీఆర్ రానున్నారు. సోమవారం మెదక్ పర్యటన ఏర్పాట్లపై మంత్రి హరీశ్రావు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మెదక్ సీఎస్ఐ చర్చి గ్రౌండ్లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు జిల్లా నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నామని చెప్పారు. మెదక్ పట్టణం కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని, అన్ని వైపులా నాలుగు లేన్ల రోడ్లు, జాతీయ రహదారి పనులు వంటి అన్ని కార్యక్రమాలు వేగంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ హేమలత, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణిప్రియదర్శిని, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గొర్రెల కాపరులకు నాలుగింతల లాభం
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం గొర్రెల కాపరులకు ఎంతో మేలు చేస్తున్నది. పంపిణీ చేసిన గొర్రెలను లబ్ధిదారులు పెంచుకుంటూ ఇప్పటివరకు నాలుగింతల లాభాన్ని పొందారు. అలాగే ప్రతి ఆరునెలలకు గొర్రెలను విక్రయించి రూ.50వేల చొప్పున ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం రెండోవిడుత గొర్రెల పంపిణీలో భాగంగా ఒక్కో గ్రామంలో లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తున్నాం. దీని వల్ల మరింత మంది గొర్రెలకాపరులు లబ్ధి పొందనున్నారు.
– డాక్టర్ రమేశ్బాబు, పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, గజ్వేల్
మంద పెరిగినకొద్దీ సొమ్ము చేసుకుంటున్నం…
మేము కొండపాక మండలంలో ఉన్నప్పుడు సీఎం సారు వచ్చి మాకు 21 గొర్రెలు పంచిండు. అందులో రెండుమూడు సచ్చిపోయినా మిగతావాటిని పెంచుకున్నాం. మందలో గొర్రెలు పెరిగిన కొద్దీ అమ్ముకుంటూ డబ్బులు సంపాదించుకున్నాం. ఇప్పుడు కూడా 30 గొర్రెలు ఉన్నాయి.
– మారెబోయిన చిన్న నర్సయ్య, ఆర్అండ్ఆర్ కాలనీ ఎర్రవల్లి, గజ్వేల్
నా కుటుంబానికి 80 గొర్రెలు ఇచ్చారు..
సీఎం కేసీఆర్ సారు గొర్రెలు పంపిణీ చేసినప్పుడు నాకు, నా కుమారులకు 80 గొర్రెలు ఇచ్చారు. అందరికీ పంచేశాను. అప్పుడప్పుడు పెరిగిన గొర్రెలను అమ్ముకుని బతుకు వెళ్లదీస్తున్నాం. ఉపాధికి రందిలేకుండా పోయింది. ఇప్పుడు 25 గొర్రెలు ఉన్నాయి. మా సుట్టాలాయనతోటి కలిసి గజ్వేల్లో మందను మేపుతున్నాను. ఇప్పుడు సంతోషంగా ఉన్నాం.
– దామరమైన నర్సింహులు, అనంతరావుపల్లి