చేర్యాల, మార్చి 24: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. దీంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. బ్రహ్మోత్సవాల 10వ ఆదివారం 50వేల మంది భక్తులు వచ్చారు. ఉదయం నుంచే క్యూలో గంటల పాటు వేచి ఉండి స్వామిని దర్శించుకున్నారు. పట్నాలు వేసి, బోనాలు తీసి, ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈవో బాలాజీ, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, ఏఈవోలు గంగా శ్రీనివాస్, బుద్ది శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, కమిటీ సభ్యులు, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు. హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
ప్రజలందరిపై కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని తాను స్వామివారికి మొక్కినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ తెలిపారు. ఆదివారం కుటుంబ సభ్యులతో ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహామండపంలో పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి క్షేత్రంలోని గెస్ట్హౌస్లో విలేకరులతో మంత్రి మాట్లాడారు. ఎన్నికల ముందు స్వామిని దర్శించుకున్నానని, ఇప్పుడు కుటుంబ సభ్యులతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని మల్లన్నను వేడుకున్నట్లు తెలిపారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగంగౌడ్, మల్లన్న ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు లింగంపల్లి శ్రీనివాస్, ముస్త్యాల దామోదర్, కమిటీ సభ్యులు, కొమురవెల్లి మండల గౌడ సంఘం నాయకులు ఉన్నారు.
మల్లికార్జున స్వామి నిత్యాన్నదాన సత్రానికి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూరుకు చెందిన ఈనుకొండ మల్లారెడ్డి, రాధ దంపతులు రూ.50,116 విరాళం అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి విరాళానికి సంబంధించిన రసీదును ఆ దంపతులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్ ఉన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ స్వామివారి దర్శనానికి రావడంతో గంట పాటు దర్శనాల క్యూలైన్లు నిలిపివేయడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఎండకాలం కావడంతో ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో మంత్రి కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో దర్శనానికి రావడంతో ఆలయ వర్గాలు క్యూలైన్లు నిలిపివేయడంతో క్యూలైన్లు, మహామండపంలో భక్తులు గంటకుపైగా వేచి ఉన్నారు.