తానెవరిపై వ్యక్తిగత ఆరోపణలు చేయలేదని, తాను చేసిన వ్యాఖ్యను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆపాదించుకొని కార్యకర్తలను రెచ్చగొట్టి హింసను ప్రేరేపిస్తున్నాడని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మంగళవారం ఆయన చేపట్టిన ప్రజాహిత యాత్ర హుస్నాబాద్ పట్టణానికి చేరుకోగా అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన రోడ్షోలో మాట్లాడారు. తల్లి ఎవరికైనా తల్లేనని, తల్లిని అవమానపర్చే విధంగా మాట్లాడే సంస్కార హీనుడిని కాదని అన్నారు. అయోధ్య రామాలయం, రాముడి గురించి మాట్లాడిన వారిని అన్న మాటలను తననే అన్నట్లు సృష్టించుకొని ఈ వంకతో రాష్ట్రంలో సంచలనం సృష్టించాలని పొన్నం ప్రభాకర్ కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. ఇతడి వ్యవహారం చూస్తే సీఎం రేవంత్రెడ్డి పదవికే ఎసరు తెచ్చేలా కనిస్తోందని వ్యాఖ్యానించారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ మంత్రులు కుట్రలు చేస్తున్నారని, ఆరుకు ఆరు గ్యారెంటీలను చెప్పిన సమయంలోపు అమలు చేయకుంటే ప్రజలతో కలిసి బీజేపీ చేబోయే ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ తట్టుకోదన్నారు. కరీంనగర్ ఎంపీగా హుస్నాబాద్ నియోజకవర్గానికి రూ.698 కోట్ల నిధులు తెచ్చామని, ఇందుకు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. దమ్ముంటే కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో తనను ఓడించాలని, ఓడిపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే పొన్నం ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటాడా అని సవాల్ విసిరారు. ఎంపీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ అనేక కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి బొమ్మ శ్రీరామ్చక్రవర్తి, రాష్ట్ర నాయకుడు జన్నపురెడ్డి సురేందర్రెడ్డి, స్థానిక నాయకులు లక్కిరెడ్డి తిరుమల, రాజేంద్రప్రసాద్, దొడ్డి శ్రీనివాస్, బొమ్మగాని సతీశ్, వేణుగోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.