నర్సాపూర్ నియోజకవర్గంలో ఐటీహబ్ ఏర్పాటు చేస్తామని, పరిశ్రమలను తెస్తామని, ఈ ప్రాంతాన్ని రాజన్న సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్కు మారుస్తామని ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆదివారం నర్సాపూర్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రోడ్షో నిర్వహించారు. రోడ్షోకు నియోజకవర్గంలోని 8 మండలాల ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పట్టణంలోని చాముండేశ్వరి గార్డెన్ నుంచి ప్రధాన రోడ్డు గుండా నర్సాపూర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చే మూడుగంటల కరెంటు కావాలా.. కేసీఆర్ ఇస్తున్న 24 గంటల కరెంటు కావాలో తెలంగాణ రైతాంగం తేల్చుకోవాలన్నారు. కరెంటు ఉంటే కాంగ్రెస్ ఉండదు.. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదని ఎద్దేవా చేశారు. సునీతాలక్ష్మారెడ్డికి 50వేల మెజార్టీ ఖాయమని ఎమ్మెల్యే మదన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు గుంజుకునేది కాదని, భూములు పంచే ప్రభుత్వమని బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. – నర్సాపూర్/శివ్వంపేట, నవంబర్ 26
నర్సాపూర్/శివ్వంపేట, నవంబర్ 26: బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే నర్సాపూర్ నియోజకవర్గంలో ఐటీహబ్, పరిశ్రమలను స్థాపిస్తామని ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే నర్సాపూర్ పట్టణాన్ని రాజన్న సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్కు మారుస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షో కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రోడ్షోకు నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన 8 మండలాల ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు వేల సంఖ్యలో తరలివచ్చారు. చాముండేశ్వరి గార్డెన్ నుంచి ప్రధాన రోడ్డు గుండా నర్సాపూర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ కొనసాగింది.
రేవంత్రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందని, 24 గంటలు అవసరం లేదని ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు. ఇంకో నాయకుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి తెలంగాణలో కరెంటే కనబడడం లేదని అంటే, ఉత్తమ్ కుమార్రెడ్డి రైతుబంధు దుబారా అని అంటున్నారని, దీన్ని రైతులు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. ఈ నాయకులందరికీ రెండు ఏసీ బస్సుల్లో తీసుకెళ్లి కరెంట్ తీగలను పట్టించాలని, అప్పుడు కరెంట్ ఉందా లేదా అని వారికి తెలుస్తుందని ఎద్దేవా చేశారు. కర్ణాటకకు చెందిన మరో కాంగ్రెస్ నాయకుడు ఐదు గంటల కరెంట్ సరిపోతుందని చెబుతున్నాడని గుర్తుచేశారు. కాంగ్రెస్ వాళ్ల 3 గంటల కరెంటు కావాలా… కేసీఆర్ అందజేస్తున్న 24 గంటల కరెంటు కావాలో తెలంగాణ రైతాంగం తేల్చుకోవాలని సూచించారు. కరెంటు ఉంటే కాంగ్రెస్ ఉండదు. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదని వాఖ్యానించారు. రైతుబంధును రైతులకు ఇస్తే కౌలు రైతుకివ్వనని, కౌలు రైతులకు ఇస్తే అసలు రైతులకు ఇవ్వనని రేవంత్రెడ్డి తన మనసులోని మాట బయటపెట్టాడన్నారు. రైతాంగం జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎద్దు, ఎవుసం తెలియని వాడికి అధికారం ఇస్తే రాష్ట్రం ఆగమవుతుందన్నారు. ధరణి పోర్టల్ను తీసేసి పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అటు కొడంగల్లో, ఇటు కామారెడ్డిలో రేవంత్రెడ్డి ఓడిపోతున్నాడని, మొన్న కొడంగల్ రోడ్షోలో నాకు తెలిసిపోయిందన్నారు.
2014లో ప్రధాని మోదీ జన్ధన్ ఖాతాల్లో రూ.15 లక్షల నగదు వేస్తానని హామీ ఇచ్చి, దాన్ని తుంగలో తొక్కాడని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే సిలిండర్ ధర రూ.800లను ప్రభుత్వం భరించి, రూ.400లకు మాత్రమే అందజేస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామన్నారు. సీఎం కేసీఆర్ భూములు గుంజుకుంటాడని ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసైన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తామన్నారు. ధర్మయుద్ధంలో గెలువలేక కాంగ్రెస్, బీజేపీల నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. వీటిని ప్రజలు నమ్మవద్దని కోరారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి సీఎంకు ఆప్తుడని, ఆయనకు సముచ్చిత స్థానం కల్పిస్తామన్నారు. తెలంగాణలో వెయ్యిశాతం బీఆర్ఎస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.
సునీతాలక్ష్మారెడ్డికి 50 వేల మెజార్టీ ఖాయం
నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి
నర్సాపూర్ నియోజకవర్గంలో 50వేల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి విజయం సాధిస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో బస్సుడిపో, చెక్డ్యామ్లు, ఫోర్లేన్ రోడ్డు తదితర అభివృద్ధి పనులు చేశామన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో ఎంతో బాగుందని, సీఎం కేసీఆర్ మాట తప్పకుండా దాన్ని అమలుచేస్తాడన్న ప్రగాఢ విశ్వాసం మాకు ఉన్నదన్నారు. తెలంగాణలో 70 నుంచి 80 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను యావత్ దేశం తెలంగాణ వైపు చూసేలా చేశాయన్నారు. మంత్రి కేటీఆర్ ఐటీ రంగంలో తెలంగాణ రాష్ర్టాన్ని ప్రథమస్థానంలో నిలిపారన్నారు.
బీఆర్ఎస్ భూములు పంచే ప్రభుత్వం
బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు గుంజుకునే ప్రభుత్వం కాదని, భూములు పంచే ప్రభుత్వమని బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ప్రతిపక్షాలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసైన్డ్ భూముల విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పోడు భూములు, అసైన్డ్ భూములకు పట్టాలు అందిస్తామని సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో పెట్టారని గుర్తుచేశారు. నర్సాపూర్ రాయరావు చెరువును టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాలని, ఐటీ హబ్ను ఏర్పాటు చేయాలని, రాజన్న సిరిసిల్ల జోన్ నుంచి నర్సాపూర్ ప్రాంతాన్ని చార్మినార్ జోన్లో కలుపాలని మంత్రి కేటీఆర్ను ఆమె కోరారు. రోడ్షోకు వచ్చిన ప్రజలు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలిపించి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని కోరారు. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లేబర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకటరాంరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీధర్గుప్తా, అశోక్గౌడ్, గాలి అనిల్కుమార్, సింగాయపల్లి గోపి, జిల్లా ఆర్థిక ప్రణాళికా సంఘం సభ్యులు పబ్బ మహేశ్గుప్తా, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దిన్, బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం, సత్యంగౌడ్, కౌన్సిలర్లు బాల్రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ మండలాల అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గం లోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా పాతడం ఖాయమన్నారు. కాంగ్రెస్ బీజేపీలు మిడిల్ డ్రాప్ కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రోడ్షోకు వచ్చిన జనాలను చూస్తుంటే బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో గెలుపు ఖాయమైనట్టు కనిపిస్తున్నదని వాఖ్యానించారు. ఈ నెల 30న ప్రతిఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి సునీతాలక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 2014కు ముందు కరెంటు పరిస్థితి ఎలా ఉందో ప్రతిఒక్కరికీ తెలుసనని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో ఇంట్లో ఎవరైనా చనిపోతే కరెంటు కోసం లైన్మెన్ను బతిమిలాడేదని, ఇది వాస్తవమా కాదా అని ఉద్ఘాటించారు. కరెంట్ విషయంలో అప్పటికీ, ఇప్పటికీ తేడాను చూసి కాంగ్రెస్ పార్టీకి సిగ్గు రావాలని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకుడు గాలి అనిల్కుమార్కు టికెట్ ఇవ్వకుండా గొంతుకోసిన ఘనత కాంగ్రెస్ పెద్దలకు దక్కుతుందని దుయ్యబట్టారు.