ఈ ఎన్నికలు దుబ్బాకకు ఎంతో కీలకమైనవని, ఈసారి ఇక్కడ తప్పకుండా గులాబీజెండా ఎగరాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దౌల్తాబాద్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ యువగర్జన సభలో బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి
కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించుకుని కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఉప ఎన్నిక సమయంలో మాయమాటలతో ప్రజలను మోసగించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావును దుబ్బాక ప్రజలు డిపాజిట్ రాకుండా ఇంటికి పంపించాలన్నారు. ఎన్నికల్లో పొరపాటు చేస్తే చీకటి రోజులు తప్పవని హెచ్చరించారు. తెలంగాణపై దండయాత్రకు ఢిల్లీ గద్దలు తరలివస్త్తున్నాయని, వారి మాయమాటలు నమ్మిమోసపోవద్దన్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని కోరారు.
దుబ్బాక/రాయపోల్ నవంబర్ 21: “తెలంగాణను .. ఢిల్లీ గద్దల నుంచి కాపాడుకోవాలి, ఎన్నికల్లో పొరపాటు చేస్తే మరో 50 ఏండ్లు వెనక్కి పోతాం” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ యువగర్జన సభలో దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించుకుని కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేసుకుందామన్నారు. తెలంగాణపై దండయాత్రకు ఢిల్లీ గద్దలు తరలివస్త్తున్నాయని, వారి మాయమాటలు నమ్మిమోసపోవద్దన్నారు.
బీఆర్ఎస్కు ప్రజలే బలం బలగమని మంత్రి అన్నారు. సింహం ఎపుడూ సింగల్గానే వస్తుందన్నారు. అలిగినా గులిగినా.. గుద్దుడు మాత్రం కారు గుర్తుకే ఓటు వేయాలన్నారు. దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకరన్న గెలుసుడు వందశాతం ఖాయమైందన్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిని గెలిపించాలన్నారు.కాంగ్రెస్ నాయకుడు ప్రభాకరన్నను కత్తితో పొడిచాడని, మనం కత్తితో కాదని, ఓటు అనే వజ్రాయుధంతో కాంగ్రెస్, బీజేపీకి బుద్ధిచెప్పాలన్నారు. దుబ్బాకలో ఓట్ల డబ్బాలు తెరిస్తే ..దుమ్ము దుమ్ము లేవాలని సూచించారు. దుబ్బాకలో ప్రభాకరన్నను గెలిపించి, కేసీఆర్ను ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ సీఎం చేసుకుందామన్నారు.
ఉప ఎన్నికల్లో మాయమాటలతో మోసగించిన బీజేపీ రఘునందన్రావును దుబ్బాక ప్రజలు డిపాజిట్ రాకుండా ఇంటికి పంపించుడు ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. గత ఉప ఎన్నికలో రఘునంద్న్రావు మ్యానిఫెస్లోను అసెంబ్లీలో చదివి ప్రశ్నించిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఇప్పుడు అందులో ఒక్కటైనా నెరవేర్చాడా అంటూ ప్రశ్నించాడు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాటలతో ఆగమాగం చేస్తారని నోట్లకు అంగడి సరుకులుగా మారొద్దని సూచించారు. ఆలోచించి ఓటేవేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మనోహర్రావు, వెంకట నర్సింహారెడ్డి, సతీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్ పాల్గొన్నారు.
ప్రభాకరన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుని దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దుబ్బాకకు ఇటు పక్కన నేను, అటు పక్కన హరీశ్ అన్న ఉన్నామని, ప్రభాకరన్నకు మేమిద్దరం (హరీశ్, నేను) అన్నదమ్ములుగా ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. దుబ్బాకలో పరిశ్రమలు, దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధితో పాటు, చేగుంట, మిరుదొడ్డిలో డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డామో అందరికీ తెలుసన్నారు. కాలిపోయే మోటర్లు… పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అర్ధరాత్రి వచ్చే కరెంట్ కోసం బాయికాడికి పోయేదని కాంగ్రెస్పై మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కేసీఆర్ సర్కారులో నిరంతర కరెంట్తో రైతులు రెండు పంటలు పండించుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు రేవంత్రెడ్డి , కోమటి వెంకట్రెడ్డి కరెంట్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారన్నారు. జీవితాంతం సతాయించినోళ్లు ఇప్పుడు గ్రామాలకు వచ్చి ఒక్క సారి అవకాశం ఇవ్వండి అనడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో మూడు ఎకరాల్లోపు పేద రైతులున్నారని, ఇక్కడ మూడు గంటల కరెంట్ చాలని, 10 హెచ్పీ మోటరుతో మూడు ఎకరాలు పారుతుందందని రేవంత్ అనడం సిగ్గుచేటన్నారు. రాహుల్గాంధీ, రేవంత్రెడ్డిలకు ఎద్దు తెల్వదు.. ఎవుసం తెల్వదన్నారు. వాళ్లకు క్లబ్లు, పబ్లు, విందులు మాత్రమే తెలుసన్నారు. మరీ ఆ సన్నాసులకు రాష్ర్టాన్ని అప్పగిద్దమా అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి కరెంట్ వద్దంటడు.. ఉత్తమ్కుమార్ రైతుబంధు దుబారా అంటడు. మరో వ్యక్తి బట్టి విక్రమార్క ధరణీ వద్దు మళ్లీ పట్వారీ వ్యవస్థ తెస్తామంటున్నాడని ధ్వజమెత్తారు.
రాయపోల్, నవంబర్ 21: ఆదరణ చూసి ఓర్వలేక ఇబ్బందులు పెడుతున్నారని, అయినప్పటికీ దుబ్బాక నియోజకవర్గ ప్రజల దీవెలనతో బతికి మళ్లీ మీ ముందుకు వచ్చానని బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దుబ్బాక ప్రజలకు సేవ చేసి రుణం తీర్చుకుంటానన్నారు. గ్రామాల్లో యువకులు బీఆర్ఎస్ వైపే ఉన్నారని రోడ్షో ద్వారా తెలిసిపోయిందన్నారు. యువకులు భారీ సంఖ్యలో తరలివచ్చినందుకు పాదాభివందనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్,హరీశ్రావు సహకారం వల్ల నేడు అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మొద్దన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు చేసిందేమీలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరిచి గెలిపించి సీఎం కేసీఆర్కు కనుకగా ఇవ్వాలన్నారు. దుబ్బాక ప్రజల దీవెనలతో గెలుపొందడం ఖాయమైందన్నారు.
రాయపోల్, నవంబర్ 21: దౌల్తాబాద్లో మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ రోడ్షోకు భారీ స్పందన లభించింది. నియోజకవర్గ నలుమూలల నుంచి యువకులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో యువతలో కొత్త జోష్ నింపింది. మధ్యాహ్నం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, మనోహర్రావు, బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, న్యాయవాది చంద్రశేఖర్రెడ్డి,ప్రభాకర్రెడ్డి తనయుడు కొత్త ప్రథ్వీరెడ్డి, రాష్ట్ర నాయకులు రాధాకృష్ణశర్మ, సోలిపేట సతీశ్రెడ్డి, మామిడి మోహన్రెడ్డి, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు రహిమొద్దీన్, బీఆర్ఎస్ దౌల్తాబాద్ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్గౌడ్ మంత్రి కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. యువతకు మంత్రి అభివాదం చేపి ప్రచార రథం ఎక్కడంతో కేరింతలు కొట్టారు. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్, దుబ్బాక ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్రెడ్డి పక్కా అంటూ నినాదాలు చేశారు. వివిధ పాటలతో యువకులు డ్యాన్స్ చేశారు. పిడికిలి బిగించి జై తెలంగాణ అనడంతో యువతలో జోష్ నింపింది. కేటీఆర్ రోడ్షోకు నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, రాయపోల్, దౌల్తాబాద్, చేగుంట, నర్సింగ్, అక్బర్పేట భూంపల్లి మండలాల్లోని ఆయా గ్రామాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. ఎటు చూసినా దారులన్నీ గులాబీమయంగా మారాయి.