సిద్దిపేట, మే 6: సద్ది తిన్న రేవు తలవాలని, మీరు కబ్జాలో ఉన్న భూమిపై సర్వ హక్కులు కల్పించిన సీఎం కేసీఆర్, పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ‘ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా జరగని పనిని పూర్తి చేయించి, మిమ్మల్ని ఇంటికి పిలిపించి మీ చేతికి పట్టా అందించి పంపిస్తున్నామ’న్నారు. సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి పలువురు హక్కుదారులకు స్థలాలకు సంబంధించిన పట్టాలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ..
తెలిసీ తెలియక అసైన్డ్ భూమి కొన్నవారు, భూమి కాస్తులో ఉన్నవారు రోజుల తరబడి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగి వేసారిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మోక్షం కల్పించిందన్నారు. ‘రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేయించడంతో ఇక ఇవాల్టి నుంచి మీ భూమికి సర్వ హక్కులు చేకూరాయని, మీరు హక్కుదారులుగా మారారని, భూమి పట్టా చేసి మంజూరు పత్రాలు అందజేస్తున్నామ’ని మంత్రి తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ తదితర ఎన్నో సంక్షేమ పథకాలు అందించి పేద ప్రజానీకానికి సీఎం కేసీఆర్ అండగా నిలిచారని చెప్పారు. ఈ సందర్భంగా బుస్సాపూర్ గౌడ కులస్తులు మంత్రి హరీశ్రావును గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎవరెవరికి, ఏమేం పంపిణీ చేశారంటే..?
పీవోటీ భూ సమస్య పరిష్కారానికి నోచుకొని స్థల ధ్రువీకరణ పత్రాలు పొందినవారిలో సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్కు చెందిన 18 మంది, నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్ వాసులు 12 మంది, గుర్రాలగొంది గ్రామస్తులు 8 మంది ఉన్నారు. బుస్సాపూర్ గౌడ సంఘ, వెంకటాపూర్ హమాలీ సంఘ భవనాలకు కేటాయించిన స్థల హక్కుదారు ధ్రువీకరణ పత్రాలను సైతం మంత్రి హరీశ్రావు పంపిణీ చేశారు. గుర్రాలగొంది గ్రామానికి చెందిన ఖాత రాములు విద్యుత్ షాక్తో మృతి చెందగా, ఆయన భార్య పోచవ్వకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా బాండ్ అందజేశారు. సిద్దిపేట రూరల్ మండల వాసులు 22 మందికి, నారాయణరావుపేట మండలానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు.. మొత్తం 26 మందికి రూ.26,03,061 విలుగ గల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఇర్కోడు గ్రామంలో ఒకరికి 59 జీవో కింద క్రమబద్ధీకరణ ప్రొసీడింగ్ కాపీ అందజేశారు. పలువురు లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారుల రాక తో మంత్రి క్యాంపు కార్యాలయం శనివారం పగలంతా సందడిగా మారింది.