సిద్దిపేట, ఆగస్టు 14: సిద్దిపేటలో 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే వేడుకలకు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 11గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం 11.15 నిమిషాల నుంచి 11.30 నిమిషాల వరకు జిల్లా అభివృద్ధి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై మంత్రి ప్రసంగించనున్నారు. 11.30 నుంచి 11.45 గంటల వరకు స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులను సన్మానించనున్నారు. 11.45 నుంచి 12.00 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీపీ
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను సిద్దిపేట సీపీ శ్వేతతో కలిసి సోమవారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసుల వందనం, పరేడ్, స్వాతంత్య్ర సమరయోధులు,ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు కూర్చునేలా షామియానాలు, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్ణీత సమయానికి వేడుకలు ఘనంగా నిర్వహించేలా అన్నిశాఖల అధికారులను సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీవో రమేశ్, ఏసీపీ సురేందర్రెడ్డి, విద్యుత్ ఎస్ఈ మహేశ్, తహసీల్దారు దిలీప్ పాల్గొన్నారు.