పాపన్నపేట, జూన్ 5: పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు అందజేసి వారికండ్లల్లో డబుల్ ఆనందం నింపేది కేసీఅర్ ప్రభుత్వమేనని ఆర్థిక, వైద్యాశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామంలో డబుల్బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజార్షిషాతో కలసి మాట్లాడారు. గతంలో పెద్దలు ఇల్లు కట్టిచూడు పెండ్లి చేసి చూడు అనే సామెత ఊరికనే అనలేదని అన్నారు. ఎంతో కష్టం, ఎంతో ప్రయాసపడితే తప్ప ఇల్లు కట్టలేమని, అలాంటిది రూపాయి ఖర్చు కాకుండా, చెమట చుక్క చిందించకుండా మీకు అన్ని సౌకర్యాలతో పేదలకు ఇల్లు కట్టి ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమని అన్నారు. పైరవీకారులతో పనిలేకుండా నిజమైన లబ్ధిదారులకు ఇల్లు అందేలాగా కలెక్టర్తో ఇల్లు మంజూరు చేయించామని మంత్రి హరీశ్రావు వివరించారు. ఈ నెలాఖరులోగా జాగా ఉన్న వారికి గృహలక్మి పథకం కింద ఇల్లు కట్టుకునేందుకు ఆర్థికసాయం అందిస్తామని, డబ్బులు కూడా నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమఅవుతాయని మంత్రి తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బోరు బాయికాడ మీటర్ పెట్ట్టి రైతులకు బిల్లు పంపించాలని తెలంగాణపై ఒత్తిడి తెచ్చిందని వెల్లడించారు. రైతు బోర్ల వద్ద మీటర్ పెట్టనందుకు రూ.30వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఆపిందని సభా ముఖంగా వివరించారు. అయితే నా గొంతులో ప్రాణమున్నంత వరకు మీటర్ పేట్టేది లేదని తేల్చి చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని మంత్రి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలన తెస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పాలన అంటే ఏంటిదో తెలుసా.. నీళ్లకు కష్టం, కరెంటుకు కష్టం, పెన్షన్కి కష్టం అని హరీశ్రావు వివరించారు. ఎంత కష్టమైనా గింజపోకుండా వడ్లను మన కేసీఆర్ కొన్నాడు. ఢిల్లీ ప్రభుత్వం కొనమన్నా కేసీఆర్ ముందుండి కొన్నాడని వెల్లడించారు. గతంలో కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు కష్టమొచ్చినా రైతులకు కష్టం లేకుండా సీఎం కేసీఆర్ చూసుకున్నాడు. మెదక్ నియోజకవర్గంలో వంద పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మించాం. ఆరోగ్య సమస్యలు వస్తే హైదరాబాద్కు పోయే అవసరం లేకుండా మీ వద్దకే వైద్య సేవలు తెచ్చాం. కంటివెలుగు ద్వారా ప్రతి పల్లెకెళ్లి కంటి పరీక్షలు చేశామని తెలిపారు. ఈనెల 16 నుంచి ప్రారంభించబోయే న్యూట్రిషన్ కిట్లు గర్భిణుల ఆరోగ్యం కోసం ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలను అందిస్తున్నారన్నారు. బిడ్డ పెండ్లి చేస్తే కళ్యాణలక్మి, బిడ్డ గర్భం దాలిస్తే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, ఆడబిడ్డ పురుడు పోస్తే కేసీఆర్ కిట్టు, ముసలోళ్లకు ఆసరా పింఛన్, రైతుకు రైతుబంధు ఇలా అన్ని వర్గాలను ఆదుకుంటున్న నాయకుడు సీఎం కేసీఆరే అని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు అధిష్టానం ప్రజలేనని అన్నారు. 2014 ముందు తర్వాత రాష్ట్ర అభివృద్ధి చూస్తే అర్థమవుతుందని వెల్లడించారు. ఎంకంపల్లి బ్రిడ్జి, ఫార్మేషన్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని దీంతో చాలా మండలాలకు లబ్దిచేకూరుతాయని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లారు. రామతీర్థంలో మినీఫంక్షన్హాల్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రిని కోరారు. అంతకుమందు మంత్రి హరీశ్రావు పాపన్నపేటలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజతోపాటు, పశువైద్యశాల, లింగాయపల్లిలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.
యాగశాల ప్రారంభం…
ఏడుపాయల్లో నూతనంగా నిర్మించిన యాగశాలను మంత్రి హరీశ్రావు, మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి ప్రారంభించారు. ముందుగా ఏడుపాయలకు చేరుకున్న మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు వనదుర్గాభవానీమాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన యాగశాలకు చేరుకుని వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య యాగశాలను ప్రారంభించారు. గణపతి హోమం, దుర్గాహోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజార్షిషాతోపాటు వివిధ శాఖల అధికారులతోపాటు పాపన్నపేట మండల సర్పంఛ్ల ఫోరం అధ్యక్షుడు కుమ్మరి జగన్, పార్టీ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు గడీల శ్రీనివాస్రెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్ బాలాగౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్లు గురుమూర్తిగౌడ్, లింగారెడ్డి, లక్ష్మీఆటోని, స్రవంతీశ్రీనివాస్, పాపన్నపేట ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు రంగపేట శ్రీనివాస్, రామతీర్థం బాబాగౌడ్, దోమకొండ కిషన్రెడ్డి పాల్గొన్నారు.