సంగారెడ్డి, జూలై 27 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో గురువారం మోస్తరు నుంచి జోరుగా వర్షాలు కురిశాయి. వాతావరణ శాఖ గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రి హరీశ్ రావు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలతో ఎక్కడా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ రమణ కుమార్తో కలిసి జిల్లా, మండలస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అధికారులు చూడాలని ఆదేశించారు. జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, పటాన్చెరు, అందోలు నియోజకవర్గాల్లో మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిశాయి. జిల్లాలో 507.1 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. 19 మండలాల్లో అత్యధిక వర్షం నమోదు కాగా ఏడు మండలాల్లో సాధారణకంటే ఎక్కువ వర్షం కురిసింది. రెండు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రామచంద్రాపురం మండలంలో అత్యధికంగా 40.7 మి.మీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా కంగ్టి మండలంలో 21.4 మి.మీటర్ల వర్షం కురిసింది. జిన్నారం మండలంలో 40.6, గుమ్మడిదలలో 40.5, సంగారెడ్డిలో 38.9, అమీన్పూర్లో 38.4, పుల్కల్లో 35.6 మి.మీటర్ల వర్షం కురిసింది. కంది మండలంలో 34.6, పటాన్చెరులో 34.4, నిజాంపేటలో 32.3, మొగుడంపల్లిలో 30.4, జహీరాబాద్లో 30.2 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మిగితా మండలాల్లో 10 నుంచి 29 మి. మీటర్ల లోపు వర్షం కురిసింది.
వర్షాలతో సింగూరు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతున్నది. సింగూరు ప్రాజెక్టులోకి 13,611 క్యూసెక్కుల వరద చేరింది. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీ కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 22.343 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. వర్షాలతో సింగూరు ప్రాజెక్టులోకి వరద వస్తుండటంతో త్వరలోనే సింగూరు ప్రాజెక్టు నిండే అవకాశం ఉన్నది. సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు పూర్తిగా నిండి ప్రవహిస్తున్నది. నల్లవాగు ప్రాజెక్టు సామర్థ్యం 746.13 ఎంసీఎఫ్టీ కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిగా నిండి ఉన్నది. ప్రాజెక్టులోకి గురువారం 2767 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు నిండటంతో దివగుకు జలాలను వదులుతున్నారు. జిల్లాలోని నారింజ ప్రాజెక్టు సైతం నీటితో నిండుకున్నది.
జిల్లాలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. జిల్లాలో 159 చెరువులు అలుగు పారుతున్నాయి. సంగారెడ్డి ఇరిగేషన్ డివిజన్ పరిధిలో 124, జహీరాబాద్ డివిజన్లో 14, నారాయణఖేడ్ డివిజన్లో 21 చెరువులు అలుగు పారుతున్నాయి. జిల్లాలోని 134 చెరువులు నీటితో పూర్తిగా నిండగా, 783 చెరువుల్లోకి 75 శాతం నీళ్లు వచ్చాయి. సంగారెడ్డి మండలం చిద్రుప్పలోని పెద్ద చెరువులో కృష్ణ అనే పశువులకాపరి పడి మృతి చెందాడు.
వర్షాలతో కూలుతున్న ఇండ్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పాత ఇండ్లు కూలిపోతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు పాక్షికంగా 300 ఇండ్లు దెబ్బతినగా 10 ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అందోలు మున్సిపాలిటీ పరిధిలో రెండు ఇండ్లు కూలిపోయాయి. ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సూచన మేరకు మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కమిషనర్ తిరుపతి జోగిపేట మున్సిపాలిటీలో పర్యటించా కూలిపోయిన ఇండ్లను పరిశీలించారు. బాధితులను పరామర్శించి, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పారిశుద్ధ్యం పనులను పరిశీలించి సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు.
వర్షాలతో సంగారెడ్డి జిల్లాలో పంటలు నీట మునుగుతున్నాయి. జిల్లాలో గురువారం కోహీర్ మండలంలో అత్యధికంగా 130 ఎకరాల్లో పత్తి, కంది, సోయాబీన్ పంటలు నీట మునిగాయి. సిర్గాపూర్ మండలంలోని వాసర్, వందల్ గ్రామా ల్లో సైతం పంటలు నీట మునిగాయి. జిల్లాలో ఇప్పటి వరకు 883 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.
జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. మంత్రి హరీశ్రావు జిల్లాలోని ఎమ్మెల్యేలు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్లో గురువారం మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎమ్మెల్యేలు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ శరత్ జిల్లా, మండల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఎక్కడా ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అధికారులు ఎవ్వరూ హెడ్క్వార్టర్ వదలి వెళ్లవద్దని ఆదేశించారు. ఇదిలా ఉంటే కలెక్టర్ కంది మండలంలోని కిషన్సాగర్ చెరువును సందర్శించారు. చెరువు గండి పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.