రాయపోల్, నవంబర్ 17 : ముచ్చటగా మూడోసారి ఆశీర్వదించాలని ఆర్థిక, వైద్యా రోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రజలను కోరారు. కాంగ్రెస్పార్టికి ఓటువేస్తే కరెంట్ కష్టాలు వస్తాయని, బీజేపీకి వేస్తే మోటర్లకు మీటర్లు తప్పవన్నారు. శుక్రవారం సాయంత్రం రాయపోల్ మం డల కేంద్రంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ కారుగుర్తుకు ఓటు వేసి మంచి మనిషి కొత్త ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు మోసపోయి గోస పడ్డారని, ఓటు ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. ఉప ఎన్నికల్లో రఘునందన్రావు గెలిచిన తర్వాత పేదలకు చేసిందేమీలేదని విమర్శించారు.రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయమని, బీజేపీ,కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మిమోసపోకుండా కొత్త ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో సంక్షేమ పథకాలు ఎందుకు అమలు కావడంలేదని, తెలంగాణలో మూడు గంటల కరెంట్ ఇస్తామన్న పార్టీని భూస్థాపితం చేయాలన్నారు. 60 ఏండ్లలో జరగని అభివృద్ధి తొమ్మిదేండ్లలో చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని, ఉమ్మడి మెదక్ జిల్లాలోని పదికి పది సీట్లు బీఆర్ఎస్ను గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామన్నారు. కాంగ్రెస్,బీజేపీలకు ఓట్లు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని, ప్రజలకు అండగా ఉంటున్న బీఆర్ఎస్ను ఆశీర్వదిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు పేదలకు అందించే అవకాశం ఉంటుందన్నారు.ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేయడంతో నెంబర్వన్ రాష్ట్రంగా గుర్తింపుపొందిందన్నారు.పేదల అసైన్డ్ భూములకు పట్టాలు అందించి పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన మ్యానిఫెస్టోను చూస్తే 420లాగా ఉందని విమర్శించారు.
కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ర్టాల్లో లేనిపథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని గుర్తుచేశారు.కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రవేశపెట్టిందని ప్రజలు ఆపార్టీని తిరస్కరించడం ఖాయమన్నారు.కొత్తగా ఏర్పడిన రాయపోల్ మండలాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేసుకుందామని, కొత్త ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీలో గెలిపించాలని కోరారు. రాయపోల్ మండలంలోని అన్ని గ్రామాలను ఆదర్శంగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి తనయుడు పృథ్వీకృష్ణారెడ్డి, జడ్పీటీసీ యాదగిరి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మామిడి మోహన్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరశర్మ, రైతు బంధు సమితి అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యుడు పర్వేజ్, ఏఎంసీ చైర్పర్సన్ ఇప్పలక్ష్మి, రాష్ట్ర యువజన నాయకులు రాజిరెడ్డి, ఇప్ప దయాకర్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు.