కోట్లాది రూపాయలతో పల్లెలు, పట్టణాలను ఇంతలా అభివృద్ధి చేసుకుంటున్నామంటే ఇదంతా సీఎం కేసీఆర్ సహాయ, సహకారాలే కారణమని ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.రంగనాయక సాగర్ నుంచి పొలాలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రోడ్లను అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ పెరుగుతున్న దృష్ట్యా ప్రజల సౌకర్యార్ధం కోట్లాది రూపాయలతో సిద్దిపేట ఎల్లమ్మ ఆలయం నుంచి ఇల్లంతకుంట వరకు నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ నెలలోనే సిద్దిపేట-హన్మకొండ, మెదక్- సిద్దిపేట రహదారి విస్తరణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. రాబోయే రోజుల్లో రంగనాయక సాగర్ను బ్రహ్మాండమైన పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు వరం అని, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎకరం భూమికి నీరు పారుతలేదని కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
సిద్దిపేట, జనవరి 24( నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ సహకారంతోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుంటున్నామని, ప్రతి ఎకరాకు నీరందించుకుంటున్నామని ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట ఎల్లమ్మ దేవాలయం నుంచి చిన్నకోడూరు వరకు (0.0 కి.మీటరు నుంచి 10/0 కి.మీ వరకు రూ .66 కోట్లతో నాలుగు వరుసల రహదారి) నిర్మాణానికి జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మంజులారాజనర్సు, స్థానిక కౌన్సిలర్లు విజేందర్రెడ్డి, బర్ల మల్లిఖార్జున్తో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం రంగనాయక సాగర్ నుంచి చిన్నకోడూరు, నారాయణరావుపేట మండలాల చెరువులు నింపడానికి ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ సిద్దిపేటకు నలుదిక్కులా నాలుగు వరుసల రహదారులను నిర్మాణం చేసుకుంటున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ పెరుగుతున్న దృష్ట్యా ప్రజల సౌకర్యార్థం సిద్దిపేట ఎల్లమ్మ ఆలయం నుంచి ఇల్లంతకుంట వరకు నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని తెలిపారు.
ఈ నెలలోనే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం
ఈ నెలలోనే సిద్దిపేట-హన్మకొండ, మెదక్- సిద్దిపేట రహదారి విస్తరణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. సిద్దిపేట పట్టణ పరిధిలో ప్రజల సౌకర్యాలకు అనుగుణంగా అన్నివైపులా రహదారులను విస్తరిస్తూ బట్టర్ ఫ్లైలైట్లు, పుట్పాత్లతో రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతోనే ఇందంతా సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసి కొత్త కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, మెడికల్ కళాళాలలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నాలుగు వరుసల రహదారుల నిర్మాణంతో పట్టణం మరింత అభివృద్ధి చెందనుందన్నారు. తద్వారా భూముల ధరలు పెరుగుతాయన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఒక రహదారికి నిధులు మంజూరు కావాలంటే ఏండ్లు పట్టేదని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తుండడంతో అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. రహదారులు విస్తరణతో ఇటు ప్రజలకు, అటు రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఎల్లమ్మ దేవాలయానికి చాలామంది భక్తులు, రంగనాయక సాగర్కు వేలాది మంది పర్యాటకులు వస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో రంగనాయక సాగర్ బ్రహ్మాండమైన పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసుకోబోతున్నట్లు మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
కాళేశ్వరం వరం..
జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు వరం అని మంత్రి హరీశ్రావు అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. నారాయణరావుపేట, చిన్నకోడూరు మండలాల రైతుల విజ్ఞప్తి మేరకు రంగనాయక సాగర్ నుంచి సాగునీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఎక్కడా గుంట జాగ లేకుండా రైతులు నాట్లు వేశారన్నారు. రైతుల పంట పొలాలు ఎండవద్దని నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఎడమ కాలువ ద్వారా మొదటి విడుత 100 క్యూసెక్కులు, రెండో విడుత 300 క్యూసెక్కులు, నారాయణరావుపేట, చిన్నకోడూడరు మండలాల్లోని పలు గ్రామాలను కలుపుకొని మొత్తం 512 క్యూసెక్కుల నీటిని చెరువులు, కుంటలు, వాగులు, వంకల్లోకి విడుదల చేస్తామని తెలిపారు. చెరువుల్లోకి నీరు చేరడంతో నారాయణరావుపేట మండల పరిధిలోని 4 గ్రామాల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. నారాయణరావుపేట మండల పరిధిలో 41 వాటర్ బాడీస్లలోని చెరువులు, చెక్డ్యామ్లు, కుంటలు, వాగులు, వంకల ద్వారా 2,840 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నదన్నారు. రంగనాయకసాగర్ ఎడమ కాలువ కింద నారాయణరావుపేట, చిన్నకోడూరు మండలాలు కలుపుకొని ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పూర్తయినట్లు, మైనర్ కెనాల్, సబ్ మైనర్ కెనాల్, పంట కాలువల ద్వారా మొత్తం 70 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీకి కండ్లమంట…
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎకరం భూమికి నీరు పారుతలేదని కాంగ్రెస్, బీజేపీలు మాట్లాడున్నాయని, వారిని ఏమనలో అర్థం కావడం లేదని మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. రైతుల పంట పొలాల్లో కాళేశ్వరం నీళ్లు పారుతుంటే, ప్రతిపక్ష నేతల కండ్లల్లో కన్నీళ్లు వస్తున్నాయని విమర్శించారు. వాళ్ల కండ్లు ఎర్రబడుతున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేసి ఎక్కడో ఉన్నా గోదావరి నీళ్లను మన పొలాలకు పారిస్తున్నారన్నారు. ఎప్పుడు అంటే అప్పుడు నీటిని తీసుకుపోయి చెరువులు, చెక్డ్యాంలు నింపుకొంటున్నట్లు చెప్పారు. పొలాలకు గోదావరి జలాలను తరలించి బంగారు పంటలు పండించుకుంటున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయకపోతే కొన్ని వేల ఎకరాల్లో పంటలు నష్టపోతాయని చెప్పారు. రంగనాయక సాగర్ నుంచి గేట్లు ఎత్తి నీటిని విడదల చేశామన్నారు. ఈ నీళ్లు వదలడంతోనే వేల ఎకరాల్లో పంటలు దక్కుతాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగానే తెలంగాణలో నీటి లభ్యత పెరిగిందన్నారు. నీటి విడుదలకు అంగీకరించిన సీఎం కేసీఆర్కు రైతులు పక్షాన మంత్రి హరీశ్రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, రైతులు పాల్లొన్నారు.