మెదక్ : రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు 30 నుంచి 56 శాతం పెరిగాయి. కాన్పుల శాతం మరింత పెరగాలి. అందుకు ఆశాలు బాధ్యత తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్లో రూ. 17 కోట్లతో ఏర్పాటు చేసిన మాతా- శిశు అరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం దళిత బంధు లబ్ధి దారులకు యూనిట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..మెదక్ పట్టణంలో 100 పడకల దవాఖానను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ దవాఖాన మొత్తం కాన్పుల కోసమే. చిన్నారుల కోసం మంచి వైద్యం అందుతుందన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాస్పిటల్ నిర్మాణం కోసం ఎంతో చొరవ చూపారని ఆయన పేర్కొన్నారు.
ఇందులో మెటర్నిటీ వార్డ్, లేబర్ రూం, ఆపరేషన్ థియేటర్, పీడియాట్రిక్ వార్డ్, పీఐసీయూ, ఎస్ఎన్సీయూ, ఆంటి నాటల్ వార్డ్, పోస్ట్ నాటల్ వార్డ్ వంటి సదుపాయాలు ఉన్నాయని మంత్రి వివరించారు. సీఎం కేసీఆర్ సర్కార్ దవాఖానల్లో సకల వసతులు కల్పిస్తున్నారు. ఇందులో ప్రసవాల సంఖ్య మరింతగా పెరిగేలా ఆశాలు బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు.
సాధారణ కాన్పుల కోసం కౌన్సిలింగ్ ఇవ్వాలి. రాబోయే రోజుల్లో సాధారణ ప్రసవాలకు వైద్య సిబ్బందికి ఇన్సెంటివ్ రు. 3,000 ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆశాల పరిధిలో కేసులు ఎక్కువైతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మంచి చేస్తే హైదరాబాద్ పిలిచి సన్మానం చేసినం. కొందరి వల్ల అందరికి చెడ్డ పేరు వస్తుందన్నారు.
కరోనా సమయంలో ఎంతో కష్ట పడ్డారు. ఎంతో చేశారు. కానీ, ఎక్కడైనా చిన్న తప్పు జరిగితే అందరూ పని చేయనట్టు అవుతుందన్నారు. అందుకే ఆ ఒక్కరూ మారాలి.. లేకుంటే చర్యలు తప్పవన్నారు. ప్రతి నెల మూడో తారీఖున ఆశాలతో టెలి కాన్ఫరెన్స్ ఉంటుంది. అందరూ సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.
ఎవరు పని చేయకున్నా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దళిత బంధు ఒక ఉద్యమం. మెదక్లో వంద మంది లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ హేమలత, జిల్లా కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.