మెదక్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : నర్సాపూర్ అంటే గులాబీ జెండా అడ్డా… 2001 నుంచి ఎప్పుడైనా తెలంగాణ కోసం నడుం బిగించిన గడ్డ నర్సాపూర్ అడ్డా.. ఈ సారి నర్సాపూర్లో సునీతమ్మను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందో మీరు రోజూ టీవీల్లో చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ధరణి దండగంటున్నది.. కరెంటు వద్దంటున్నారు… రైతుబంధు ఎందుకంటున్నారు.. అధికారం మాత్రం కావాలంటున్నారు… ఇద్దామా.. ధరణి వద్దన్నోన్ని బంగాళాఖాతంలో కలపాలి… రైతుబంధు ఎందుకన్నోన్ని బొందపెట్టాల్సిన అవసరం ఉంది.. 3 గంటల కరెంటు చాలు అన్నోన్ని నర్సాపూర్ పొలిమేరలు దాటేంత వరకు తరిమికొట్టాలి.. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు అని ఉత్త కరెంటు చేసింది..రేవంత్రెడ్డి 10 హెచ్పీ పెట్టుకుంటే 3 గంటల్లో పారుతుంది’..అని అంటున్నాడని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నాడు.
మెదక్ జిల్లా నర్సాపూర్లో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ‘ఎవరికైనా 10హెచ్పీ మోటార్ ఉం దా అన్నారు. రైతులకు ఉండేదే 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటార్లు ఉంటాయని, కర్ణాటకలో అనేక కరెంటు కష్టాలు నెలకొన్నట్లు తెలిపారు. అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాగ్రెస్కు ఓటు వేస్తే అంధకారమే అని అన్నారు. ప్రతిపక్షాలకు ఎజెండా లేక బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణకు దిశ, దశ అందించే నాయకులు కావాలని, బూతులు మాట్లాడే నాయకులు మనకు ఎందుకు అన్నారు. అన్నివర్గాల ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారని తెలిపారు. సాగు నీళ్లు వచ్చాయని, రెండు పంటలు పండుతున్నాయని, కాంటాలు పెట్టి ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు.
సీఎం కేసీఆర్ 9 ఏండ్ల పాలనలో కరువు లేదని.. కర్ఫ్యూ లేదని మంత్రి హరీశ్రావు అన్నారు. గత ప్రభుత్వాలు రైతు నుంచి డబ్బులు వసూలు చేస్తే కేసీఆర్ రైతుబంధు ద్వారా రైతులకు ఇస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు, వ్యవసాయాన్ని అవమానించిన పీసీసీ అధ్యక్షుడు రేవంతరెడ్డికి ఓటుతో బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. మిగిలిన పంట రుణమాఫీని పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ అనుమతి కోరామని, అనుమతి వస్తే వారంలో రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపారు. లేదంటే వచ్చేది మన ప్రభుత్వమే అని, డిసెంబర్ 3 తర్వాత చేసుకుందామని చెప్పారు. ఈ ఎన్నికల్లో మంచి మేనిఫెస్టో సీఎం కేసీఆర్ రూపొందించారని, మేనిఫెస్టోలో రూపొందించిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కర్ణాటక ప్రజలు ఎందుకు కాంగ్రెస్కు ఓటు వేశామని బాధపడుతున్నట్లు చెప్పారు.
సోనియాగాంధీని బలిదేవత అన్న రేవంత్రెడ్డి ఇప్పుడు మాట మార్చి కుర్చీ కోసం పాకులాడుతున్నాడని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తాడు. బ్రిటీష్ వాడు దేశానికి స్వాతంత్య్రం ఇచ్చిండు అంటామా.. దేశ ప్రజలు పోరాటం చేసి బ్రిటీష్ వారి మెడలు వంచి సాధించారని అంటామని, అలాగే తెలంగాణలో 14 ఏండ్లు కేసీఆర్ సారథ్యంలో ఉద్యమం చేసి తెలంగాణ సాధించినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు.