చేర్యాల, నవంబర్ 25: ‘అప్పుడే పుట్టిన బిడ్డను తల్లి ఏ విధంగా భద్రంగా చూసుకుంటుందో, సీఎం కేసీఆర్ చేతుల్లో తెలంగాణను ఉంటేనే అన్ని విధాలుగా బాగుంటుంది’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మద్దూరు మండల కేంద్రంలో శనివారం జరిగిన రోడ్షోకు మంత్రి హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జనగామ నియోజకవర్గ ప్రజలు ఇదే ఊపు, ఇదే ఉత్సాహం కొనసాగించాలని, ఈనెల ర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయించాలన్నారు. మార్పురావాలని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఇక నట్టేట మునగడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దని, కాంగ్రెస్ వద్దు, రిస్క్ వద్దని కారు గుర్తుకు ఓట్లు గుద్దాలన్నారు. జనగామ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ పల్లా రాజేశ్వర్రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిపారని, పల్లన్న గెలవాలే మద్దూరు, చేర్యాల, కొమురవెల్లి,ధూళిమిట్ట మండలాల్లోని పల్లెల్లో ప్రగతి పరుగులు పెట్టాలన్నారు. సీఎం కేసీఆర్ నమ్మిన వ్యక్తి పల్లా జనగామ, చేర్యాల ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని, గజ్వేల్, సిద్దిపేట సరసన ఈ ప్రాంతాన్ని నిలుపుతారన్నారు. సిద్దిపేటకు ఆనుకుని ఉన్న చేర్యాల, జనగామ ప్రాంతాలకు తాను అండగా నిలిచి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.తెలంగాణ వచ్చిన అనంతరం మద్దూరు, ధూళిమిట్ట మండలాలు అభివృద్ధి చెందుతున్నాయో ప్రజలు ఒకసారి ఆలోచించాలని, కండ్లముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను ఆదరించాలన్నారు.
ఒకప్పుడు 400ఫీట్లు బోరు వేస్తే నీటి చుక్క రాకపోయేదని, ఇదే ప్రాంతంలో ఇప్పుడు 40 ఫీట్లలోపే నీళ్లు వస్తున్నాయన్నారు. ఇప్పుడు మండుటెండుల్లో చెరువులు మత్తడి పోస్తున్నాయన్నారు.మద్దూరు ప్రాంతంలో ఒకప్పుడు ప్రజలకు కూలీ చేసేందుకు పని దొరికేది కాదని, సీఎం కేసీఆర్ పాలనలో ఇతర రాష్ర్టాల కూలీలు వచ్చి ఇక్కడ పనులు చేస్తున్నారన్నారు. మద్దూరు మండల కేంద్రంలోని అన్ని వర్గాలకు ఇంటి స్థలాలు ఇస్తామని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.కాంగ్రెస్ పార్టీ చేసే అసత్య ప్రచారాలను నమ్మవద్దని,వారివి ఝూఠా మాటలని, ఉచిత కరెంట్ను ఉత్త కరెంట్ చేశారని,ఇప్పుడు మార్పురావాలంటూ ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మార్పు అంటే 24గంటల కరెంట్ను 3గంటలు ఇవ్వడమా అన్ని ప్రశ్నించారు. సుతి లేని సంసారం చేయలేమని, గతి లేని సంసారం చేయవచ్చని, కాంగ్రెస్ పార్టీది సుతిలేని సంసారంగా అభివర్ణించారు, కేసీఆర్ అంటే ఒక నమ్మకమని,తెలంగాణను నెంబర్ వన్గా చేయడమే ఆయన లక్ష్యమన్నారు.ఎన్నికల సభల్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు చెప్పడమే కాకుండా మూడోసారి అధికారంలోకి రాగానే చేసే పనులు చెబుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు,టీఎస్ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రైతుబంధు రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, శాసన మండలి మాజీ చీఫ్ విఫ్ వెంకటేశ్వర్లు, ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు, రాష్ట్ర నాయకులు జల్లి సిద్ధయ్య, బక్క నాగరాజుయాదవ్ పాల్గొన్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), నవంబర్25: మద్దూరులో శనివారం ఏర్పాటు చేసిన రోడ్ షో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. మద్దూరు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రోడ్ షో కొనసాగింది. మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు మద్దూరుకు తరలివచ్చారు. ఒగ్గు డోళ్ల చప్పుళ్లు, డప్పుల దరువుల మధ్య ప్రజలు ఊరేగింపుగా మద్దూరుకు చేరుకున్నారు. మహిళలు బతుకమ్మ, బోనాలను నెత్తిన ఎత్తుకొని ఊరేగింపుగా రోడ్షోకు వచ్చారు. మంత్రి రాకకు ముందు మహిళలు బతుకమ్మ ఆటలతో సందడి చేశారు. గులాబీల జెండాలే రామక్క అనే పాటకు బీఆర్ఎస్ శ్రేణులు డ్యాన్స్ చేశారు. యువతీయువకులు ఈలలతో కేరింతలు కొట్టారు. గిరిజన మహిళలు తమ సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. ముస్లిం, మైనార్టీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒగ్గు కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మంత్రి హరీశ్రావు ప్రసంగాన్ని వినేందుకు యువకులు ఓవర్హెడ్ ట్యాంకులతో పాటు భవనాలు ఎక్కారు. మంత్రి హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావులకు బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. మద్దూరు ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి గజమాలతో మంత్రి హరీశ్రావును
సన్మానించారు.