తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పురుడు పోసుకుంది. సరిగ్గా 21ఏండ్ల తర్వాత అదే పార్టీ ‘భారత రాష్ట్ర సమితి’ జాతీయ పార్టీగా రూపాంతరం చెంది మరో ప్రస్థానానికి నాంది పలికింది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పోరు సల్పి.. సీమాంధ్ర నాయకుల ఎత్తులను చిత్తుచేసి.. సమస్త తెలంగాణ ప్రజలను ఏకంచేసి.. ప్రాణాలను పణంగా పెట్టి స్వరాష్ట్రం సాధించారు కేసీఆర్. ఇప్పుడు జాతీయ స్థాయిలో సత్తాచాటేందుకు బీఆర్ఎస్తో మరో ముందడుగు వేశారు కేసీఆర్. ఉమ్మడి మెదక్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోట. ఆది నుంచి జిల్లా ప్రజలు ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ను ఆదరించారు. ప్రతి ఎన్నికల్లోనూ గులాబీ పార్టీకి మంచి విజయాన్ని కట్టబెట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్నూ అక్కున చేర్చుకుని దీవెనలు అందించేందుకు సిద్ధమయ్యారు.
– సిద్దిపేట, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
బీఆర్ఎస్తో దేశంలో వినూత్న మార్పులు
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వినూత్నమార్పులు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీకి శ్రీకారం చుట్టారు. దేశరాజకీయాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్. ఇతర జాతీయ పార్టీలకు కాలం చెల్లింది. ఇక బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి)తోనే దేశంలో బడుగు, బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుంది.
రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నట్లుగానే రాబోయే రోజుల్లో దేశాన్ని సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగల సత్తా కేవలం సీఎం కేసీఆర్కే ఉంది. ఇప్పటికే కేంద్రం ప్రభుత్వ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక మహానేత జాతీయ స్థాయికి ఎదగడం మనందరికీ గర్వకారణం. కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్తో సహా అనేక రాష్ర్టాల ప్రజలు బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నారు. అన్ని వర్గాలను కలుపుకొని దేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలబెడతారని నమ్మకముంది.
– గ్యారల మల్లేశ్ముదిరాజ్, బొంతపల్లి, గుమ్మడిదల మండలం
సిద్దిపేట, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించగా.. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఆ పార్టీ శ్రేణుల సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచి, సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. “జైకేసీఆర్.. జైజై కేసీఆర్..”, “జై భారత రాష్ట్ర సమితి.. జైజై బీఆర్ఎస్” అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించడంతో నవశకానికి నాంది పలికింది. ఈ ఆవిర్భావ కార్యక్రమానికి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్రెడ్డి, పద్మాదేవేందర్రెడ్డి, చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కార్యవర్గ సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నేతలు హాజరయ్యారు.
టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుకు జిల్లానే నాంది…
1985 నుంచి టీడీపీ తరఫున ఓటమి ఎరుగకుండా సిద్దిపేట నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్.. రాష్ట్ర మంత్రిగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పలు పదవులు, బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన జన్మభూమి పథకం రూపకల్పనలో ఆయన పాత్ర ముఖ్యమైంది. జన్మభూమి స్ఫూర్తితో తన స్వగ్రామం సిద్దిపేట మండలం చింతమడకలోని సొంతింటిని ప్రభుత్వ పాఠశాల కోసం అప్పట్లో ఆయన విరాళంగా ఇచ్చారు. దానిని ఆనుకొని ఉన్న సుమారు మూడెకరాల స్థలాన్ని గ్రామంలోని వెనుకబడిన తరగతుల వారి ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా అందించారు.
1999లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్కు అప్పటి ముఖ్యమంత్రి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు అప్పగించారు. ఓవైపు డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే అప్పటి సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తప్పుబట్టారు. విద్యుత్ చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు. డిప్యూటీ స్పీకర్గా ఉండి సీఎం చంద్రబాబును నిలదీస్తూ బహిరంగ లేఖ రాశారు. అదే సమయంలో చంద్రబాబును విబేధించి తన వైఖరిని వెల్లడించారు.
తెలంగాణ ప్రాంత ప్రజలకు వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాయంపై పిడికిలెత్తారు. ఆయన చొరవకు తెలంగాణ వ్యాప్తంగా అన్నివర్గాల నుంచి మద్దతు లభించింది. అధికార పార్టీలో ఉండి పోరాటం చేయడం కన్నా ఎదురునిలిచి ఉద్యమించాలని నిర్ణయించి సిద్దిపేట నుంచి బయలుదేరి వెళ్లి 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని స్థాపించారు.
మెదక్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ)/ మునిపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్పు చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. పలుచోట్ల బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి, స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణాధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు.
మునిపల్లి మండల పరిధిలోని తాటిపల్లిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం, మేళసంగంలో దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మెదక్ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మారెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మెదక్ ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ పురం వెంకటనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు జయరాజ్, సమియొద్దీన్, పట్టణ కార్యదర్శి గడ్డమీద కృష్ణాగౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, నాయకులు శివరామకృష్ణ, మునిపల్లి మండలంలో నిర్వహించిన సంబురాల్లో రాయికోడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు కుత్భోద్దీన్, కో-ఆప్షన్ సభ్యులు సలావోద్దీన్, నాయకులు పాల్గొన్నారు.
దేశం కోసం కదిలిన సిద్దిపేట బిడ్డ…
బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి బయలు దేరుతున్నారు. జాతీయ పార్టీని ప్రారంభించి దేశం కోసం కదలడానికి సిద్ధ్దమవుతున్న సిద్దిపేట ముద్దుబిడ్డ సీఎం కేసీఆర్కు సబ్బండ వర్గాల ప్రజలు తమ సంపూర్ణ మద్దతును తెలుపుతున్నారు. ఇప్పటికే దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వీర జవాన్ల కుటుంబాలకు, రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచి ఆర్థిక సాయం చేయడంపై యావత్తు దేశ ప్రజల దృష్టి సీఎం కేసీఆర్పై పడింది. ఇలాంటి నేత దేశానికి కావాలంటూ అనేక రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారు. మన యాసలో మనసుకు హత్తుకునేలా ఆపాయ్యంగా పలికరింపులు.. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం సీఎం కేసీఆర్ సొంతం. కేసీఆర్ పాఠశాల స్థాయి నుంచే రాజకీయాల్లో ఆసక్తి చూపారు. అప్పట్లో విద్యార్థి సంఘాల ఎన్నికల్లో పా ల్గొని విజయాలు సాధించారు. ఓటమెరుగని యోధుడిగా ఆయనకు పేరుం ది. కేసీఆర్ విద్యార్థి దశలోనే 15 నుంచి 20 మంది మిత్రులను వెంటబెట్టుకుని లీడర్షిప్ చేశారు. ఎక్కడికి వెళ్లినా కాసేపు విశ్రాంతి దొరికిందంటే వివిధ అంశాలపై తోటి స్నేహితులతో లోతుగా విశ్లేషించేవారు.
ఉద్యమ పార్టీకి ఉమ్మడి మెదక్ జిల్లా కంచుకోట…
టీఆర్ఎప్ పార్టీ ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొన్నది. అయినా దేనిని లెక్కచేయకుండా ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఉద్యమం చేపట్టిన నాయకుడే పాలనా పగ్గాలు చేతబట్టాడు. తొలుత 2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించిన తొలినాళ్లలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు టీఆర్ఎస్పై అవాకులు, చెవాకులు పేల్చారు. మూడొద్దులకే పార్టీ మూసుకుపోతుందని ఎన్నో రకాలుగా హేళన మాటలు మాట్లాడారు. అయినా ఎక్కడా కేసీఆర్ వెనకడుగు వేయకుండా ఉద్యమ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కృతకృత్యులయ్యారు. ఆయనకు చేదోడుగా సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావుతో జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులు పార్టీని నడిపించడంలో అండదండగా నిలిచారు.
పార్టీని ప్రారంభించిన సమయంలో వెంటనే స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ తన సత్తాను చాటింది. వివిధ జిల్లాల నుంచి గెలుపొందిన స్థానిక ప్రజాప్రతినిధులతో సిద్దిపేటలో కేసీఆర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఇలా ఎన్నికల్లో వరుస విజయాలను సొంతం చేసుకుంటూ వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉంది. సీఎం కేసీఆర్ అందిస్తున్న పాలనతో అన్నివర్గాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అధికారం అప్పగించారు. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి తీసుకువచ్చారు.
2018 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలకు 9 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. సిద్దిపేట జిల్లాలో కలిసిన హుస్నాబాద్, జనగామ శాసనసభ స్థానాల్లో సైతం టీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. ఏ ఎన్నికల్లో ఎవరికి రాని మెజార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వచ్చింది. సిద్దిపేట నుంచి పోటీచేసిన మంత్రి తన్నీరు హరీశ్రావు 1.18 లక్షల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. వెనువెంటనే వచ్చిన పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ తన సత్తాను చాటింది. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. పంచాయతీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకొని మూడు జడ్పీ పీఠాలు, ఎంపీపీ పీఠాలపై గులాబీ జెండా ఎగురవేసింది.