సిద్దిపేట, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 25న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని, ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురవేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు జిల్లా ప్రజాప్రతినిధులకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో 22 ఏండ్ల పార్టీ ఆవిర్భావం, తొమ్మిదేండ్ల ప్రగతి ప్రస్థానం నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. దేశంలో గుణాత్మక మార్పు తెచ్చేలా ఇప్పటికే వివిధ రాష్ర్టాల నుంచి బీఆర్ఎస్కు ప్రజాదరణ, మద్దతు వస్తుందన్నారు. నాడు పార్టీ ఆవిర్భావం చేసి, అనతి కాలంలోనే దేశంలో ఏ ప్రభుత్వం చేయని ఎన్నో సంక్షేమ పథకాలు నేడు ప్రజలకు అందిస్తున్నామన్నారు. పేదలకు, రైతులకు అమలు చేస్తున్న పథకాలు గొప్పవని, సీఎం కేసీఆర్లాంటి నాయకుడు దేశానికి అవసరమని, దేశ ప్రజలు నేడు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆ దిశగానే జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భావం చేసుకున్నామన్నారు.
22 ఏండ్ల ప్రాంతీయ పార్టీ నేడు జాతీయ పార్టీగా ఆవిర్భావ వేడుకలు జరుపుకోబోతున్నామని, ఈ నెల 25న ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మూడు వేల మందితో నియోజకవర్గస్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలన్నారు. మూడు జిల్లాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి పదవులు ఉన్నవారు, సీనియర్ నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అట్టహాసంగా, ఆత్మీయంగా, ఆడంబరంగా ప్లీనరీ వేడుకలు నిర్వహించాలని మంత్రి సూచించారు. అదేరోజు ఉదయం ప్రతి గ్రామంలో, పట్టణంలోని ప్రతి వార్డుల్లో పార్టీ జెండా ఎగురవేయాలని చెప్పారు. పల్లె పల్లెనా పండుగల జెండా ఆవిష్కరించాలన్నారు. నియోజకవర్గ ప్లీనరీ వేడుకలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. 22 ఏండ్ల పోరాటం, తొమ్మిదేండ్ల ప్రగతిపై ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని, కార్యకర్తల ఆత్మీయ వేడుక ఈ ప్లీనరీ అని మంత్రి తెలిపారు. ఈ టెలీకాన్ఫరెన్స్లో ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.