సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 16: సంగారెడ్డి జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై విద్య, పోలీస్, ఆర్టీసీ, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 118 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. పరీక్షా సమయంలో నిరంతరంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా హాలులోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్లు అనుమతించవద్దని స్పష్టం చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను మూసేయాలని ఆదేశించారు.
జిల్లాలో 118 పది పరీక్షా కేంద్రాలు
జిల్లాలో 118 పరీక్షా కేంద్రాలు, 26 స్టోరేజీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐదుగురు ఫ్లయింగ్ స్కాడ్, 18 రూట్ అధికారులు, 118 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 118 మంది డిపార్ట్మెంటల్ అధికారులు (డీవో), ఒక అదనపు డీఏవో, 1100 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు వివరించారు. పరీక్షలకు 21,389 మంది రెగ్యులర్, 24 మంది ప్రైవేట్, 1131 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరు కానున్నట్టు వెల్లడించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేశ్, ఏడీ విజయ, అసిస్టెంట్ ఎగ్జామినర్ మణిదీప్, డీసీఈబీ సెక్రటరీ లింబాజీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పదిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి
అనంతరం ఉన్నత పాఠశాలల హెచ్ఎంలతో కలెక్టర్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఆయా సబ్జెక్టు టీచర్లు, హెచ్ఎంలు యూనిట్గా కృషి చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. పరీక్షలు పూర్తయ్యేవరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఈవో రాజేశ్, ఏడీ విజయ, ఎంఈవోలు, హెచ్ఎంలు పాల్గొన్నారు.