పాపన్నపేట, ఏప్రిల్ 15: మెదక్ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పాపన్నపేట మండల పరిధిలోని యూసూఫ్పేటలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి స్వగృహంలో నిర్వహించిన బీఆర్ఎస్ పాపన్నపేట మండల స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో మెదక్ మినహా అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం తీవ్రంగా కృషి చేసి ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలన్నారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసే వెంకట్రామిరెడ్డి ఎంపీ అభ్యర్థిగా నిలబడడం నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని వెల్లడించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి కలెక్టర్గా అపారమైన అనుభవం ఉందని, ప్రజాసేవ చేయాలన్న ఏకైక సంకల్పంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారని, అలాంటి వ్యక్తిని ఎంపీగా గెలిపించాల్సిన అవశ్యకత మనందరిపై ఉన్నదని ఆయన ముఖ్య కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో పాపన్నపేట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, నాయకులు సోములు, గడీల శ్రీనివాస్రెడ్డి, ఎలక్షన్ మండల ఇన్చార్జి గోసుల శ్రీనివాస్ యాదవ్, ఏడుపాయల దేవస్థానం చైర్మన్ బాలాగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు కుమ్మరి జగన్, మాజీ సర్పంచ్ ఏర్పుల దాసయ్య, ఎంపీటీసీ జ్యోతీసాయిలు, మం డల పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటేశం, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, ప్రస్తుత ఎంపీటీసీలు, ఆయా గ్రామాల అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.