సిద్దిపేట, డిసెంబర్ 27: సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా బీఎస్సీ పారామెడికల్ వైద్య, విద్యాకోర్సులు మంజూరైనట్లు ఆర్థిక, వైద్యారోగ్యశాఖలమంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ సిద్దిపేటలో ఒక వైపు ఉన్నత సాంకేతిక విద్య, మరోవైపు వైద్య విద్యను ప్రోత్సహించే దిశగా ఆడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సిద్దిపేటలో నాలుగు పాలిటెక్నిక్ కాలేజీలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బా పాఠశాలలు, పీజీ కాలేజీ, ఐటీఐ కాలేజీ, కేంద్రీయ విద్యాలయం, డిగ్రీ కాలేజీ, మహిళా డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ వైద్య కళాశాల, ఫార్మసీ కాలేజీ ఏర్పాటు చేసుకొని సిద్దిపేటను విద్యాక్షేత్రంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.
సిద్దిపేట మెడికల్ కాలేజీకి అనుబంధంగా 50 సీట్లతో బీఎస్సీ పారా మెడికల్ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మంజూరైన ఐదు కోర్సుల్లో ఒక్కో కోర్సుకు 10 సీట్ల చొప్పున 50 సీట్లతో ఈ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయన్నారు. ఆప్తామాలజీలో (ఎస్సీ ఆప్తోమెట్రిక్ టెక్నాలజీలో) 10సీట్లు, అనస్థిషియాలో10 సీట్లు(బీఎస్సీ అనస్థిషియా టెక్నాలజీ), బీఎస్సీ అనస్థిషియాలో (ఆపరేషన్ థియేటర్) 10 సీట్లు, అనస్థిషియా(బీఎస్సీ క్రిటికల్ టెక్నాలజీ)లో 10 సీట్లు, బీఎస్సీ రెడియోలజీలో 10 సీట్లు మొత్తంగా 50 సీట్లు ముంజూరైట్లు మంత్రి తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని మెడికల్ కాలేజీ డైరెక్టర్, అధికారులను మంత్రి ఆదేశించారు.