మెదక్లో తొలి రైలు పరుగులు తీసింది. అక్కన్నపేట నుంచి మెదక్ మధ్య నిర్మించిన కొత్త రైల్వేలైన్తో పాటు మెదక్ -కాచిగూడ ప్యాసింజర్ రైలును శుక్రవారం కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైలు మార్గం అందుబాటులోకి రావడంతో రైతులు, వ్యాపారులు తమ ఉత్పత్తులను తరలించేందుకు సులువవుతుందన్నారు. మెదక్ చర్చి, ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ మార్గాన్ని సికింద్రాబాద్-ముంబై ట్రాక్కు కనెక్ట్ చేస్తామన్నారు. రైల్వేలైన్ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు.
మెదక్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : మెతుకు సీమ ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ నూతన మార్గంతో పాటు మెదక్-కాచిగూడ ప్యాసింజర్ రైలును శుక్రవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరున్కుమార్ జైన్తో కలిసి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. దీంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 2014లో మెదక్లో రైల్వేలైన్ కోసం శంకుస్థాపన చేశారు. మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ 17.2 కిలోమీటర్ల మేర ఈ లైన్ నిర్మించారు.
రూ. 205కోట్లతో రైల్వేలైన్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా మెదక్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. మెదక్ జిల్లా ప్రజలు అనేక ఏండ్ల నుంచి రైల్వేలైన్ కోసం పోరాటం చేశారని, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పటి నుంచి ఇక్కడి ప్రజలు పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అక్కన్నపేట-మెదక్ నూతన రైల్వేలైన్ను జాతికి అంకితం చేయడం సం తోషంగా ఉందన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మెదక్ రైల్వేలైన్ పూర్తికోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. మెదక్ రైల్వేస్టేషన్లో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ రైతులకు ఉపయోగపడే విధంగా ట్రాక్ తయారు చేసినట్లు తెలిపారు.
దీనిని సికింద్రాబాద్-ముంబై ట్రాక్కు కనెక్ట్ చేస్తామన్నారు. దీంతో ఎక్కడికైనా ప్రయాణించవచ్చని తెలిపారు. ముఖ్యంగా మెదక్ జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చితో పాటు ఏడుపాయల వనదుర్గా భవానీమాత చూడడానికి దేశ వ్యాప్తంగా భక్తు లు, పర్యాటకులు వస్తుంటారని, రైల్వే మార్గం అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. రైతు లు, వ్యాపారులు తమ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి సులువుగా ఉంటుందన్నారు. మెదక్ నుంచి కాచిగూడ వరకు ఒక ప్యాసింజర్ రైలుతో పాటు మహబూబ్నగర్ నుంచి కాచిగూడ మీదుగా మెదక్కు మరో ప్యాసింజర్ రైలును దక్షిణ మధ్య రైల్వే నడపనుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు.
మెదక్ జిల్లా మాసాయిపేటలో గతంలో రైల్వే ప్రమాదంలో విద్యార్థులు మృతిచెందారని, దానిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రమాదాల నివారణకు ప్రత్యకంగా కృషి చేస్తున్నదని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంటలో రైల్వే టిక్కెట్ కౌంటర్ ఏర్పా టు చేయాలని ఎమ్మెల్యే రఘునందన్రావు కోరగా, ఏర్పాటుకు అక్కడే ఉన్న జీఎం అరుణ్కుమార్ జైన్ను కేంద్రమంత్రి ఆదేశించారు. రైల్వేస్టేషన్లో ప్ర యాణికుల కోసం వైఫై సేవలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలని, రైల్వేలైన్ ఏర్పాటులో దశాబ్దాల నిర్లక్ష్యం జరిగిందన్నారు. దశల వారీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. మెదక్ పట్టణానికి జాతీయ రహదారిని నర్సాపూర్ మీదుగా వేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తున్నదని తెలిపారు. మెదక్ రైల్వేలైన్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సెల్యూట్ చేస్తున్నానని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, టూరి జం ద్వారా అన్ని రకాలుగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు.
ఎన్నో ఏండ్ల కలసాకారం
మెదక్ అర్బన్, సెప్టెంబర్ 23 : మెదక్ ప్రజల 60 సంవత్సరాల కల సాకారం కావడంతో సంతోషానికి అవదుల్లేవని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతోమంది ఎలక్షన్లలో హామీలు ఇచ్చిపోయినారు. కాని మెదక్ ప్రాంతవాసుల కలసాకారం కాలేదు. అప్పుడు ఉన్న యూపీఏ ప్రభుత్వం 2012లో ఈ ప్రాజెక్ట్ను మంజూరు చేసింది. తరువాత కేంద్ర ప్రభుత్వం రాష్ర్ట ప్రభుత్వం కలిపి రూ. 202 కోట్లతో ప్రాజెక్ట్ను చేపట్టారు. కేంద్ర ప్రభుత్వంతో సమానంగా రాష్ట్రప్రభుత్వం కూడా రూ. 102కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. మెదక్-అక్కన్నపేట్ రైల్వేలైన్ కోసం రైతుల నుంచి 375 ఎకరాలు సేకరించారు. ఇందులో 25 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి. రైతుల నుంచి సేకరించిన భూమికి రాష్ట్ర ప్రభుత్వమే రూ. 17కోట్ల చెల్లించిదన్నారు.
భూమి ఇచ్చిన రైతులకు ఎమ్మెల్యే ధన్యవాదలు తెలిపారు. గంగాపురం, శమ్నాపూర్ బ్రిడ్జిల వద్ద ఇబ్బందికరంగా ఉందని, ఆ బ్రిడ్జిల వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కిషన్రెడ్డి కోరారు. అదే విధంగా మెదక్లో ఏడుపాయలు, పోచారం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి ఉన్నందున టూరిజం డెవలప్మెంట్ కింద రూ. 200కోట్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం అన్ని రకాల సహాయసహకారలు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రా వు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికి కృతజ్ఙతలు తెలిపారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల కలసాకారం అయిందన్నారు. ఒకప్పుడు మారుమూల గ్రామంగా ఉండే మెదక్ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. ప్రత్యేక జిల్లాగా ఏర్పడటంతో మెదక్లో సమీకృత కలెక్టరేట్, జాతీయ రహదారులు నిర్మించడంతో పాటు నూతనంగా మెదక్కు రైల్వేలైన్ రావడం అదృష్టం అన్నారు. మెదక్ నుంచి జోగిపేట, సంగారెడ్డి, ఈదులనాగులపల్లి, బొంబాయి రైల్వేలైన్లకు లింక్అప్ చేయాలని కేంద్రమంత్రిని కోరారు.
రైల్వే లైన్ రావడం అదృష్టం
మెదక్కు రైల్వేలైన్ ఏర్పాటు కావడం చాలా అదృష్టం. ఎన్నో సంవత్సరాల కల నేటితో నేరవేరింది. ప్రభుత్వాలు మారినా రైల్వేలైన్ ప్రాజెక్టు మాత్రం ముందుకు పోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకనే పెండింగ్ పనులు చకచకా పూర్తి అయ్యాయి. మెదక్- అక్కన్నపేట్ రైలు ప్రారంభించడంతో హైదరాబాద్ వెళ్లడానికి సులువుగా ఉంటుంది.
– రవీందర్గౌడ్, మెదక్
కలసాకారం అయింది
మెదక్ రైలు ప్రారంభించడంతో మెదక్ వాసుల ఎన్నో సంవత్సరాల కలసాకారం అయ్యింది. రైలులో హైదరాబాద్ వెళ్లాలం టే అక్కన్నపేట్ మీదుగా హైదరాబాద్ వెళ్లా ల్సి వచ్చేది. కానీ మెదక్-అక్కన్నపేట్ రైల్వేలైన్ ఏర్పాటు చేయడంతో మెదక్ రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్కు నేరుగా వెళ్లవచ్చు.
– అశ్రఫ్, మెదక్