తపస్సులా చదివి ఉద్యోగం సాధించాలి
అందివచ్చిన అవకాశాన్ని చేజారనీయకండి
ఉద్యోగ సాధన లక్ష్యంగా ముందుకు సాగాలి
మెదక్ జిల్లా ఎస్పీ రోహిణిప్రియదర్శిని
పట్టణంలో ఉచిత పోలీసు శిక్షణ శిబిరం సందర్శన
మెదక్, మే 13 (నమస్తే తెలంగాణ): మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.. అందివచ్చిన అవకాశాన్ని చేజారనీయకండి.. ఒక తపస్సులా చదవి ఉద్యోగం సాధించాలి.. ఉద్యోగ సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలి అని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలో పోలీసు నియామకాలకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణా శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజుకు 10 నుంచి 16 గంటలు తప్పకుండా చదువుకోవాలన్నారు. ఇంత మంచి అవకాశం మళ్లీ రాకపోవచ్చని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సెల్ఫోన్లు, చాటింగ్, సినిమాలు, షికార్లకు దూరంగా ఉండాలని తెలిపారు. కష్టపడి, ఇష్టపడి చదివితే విజయం తప్పకుండా వరిస్తుందన్నారు. విజయ సాధనకు అభ్యర్థులకు సూచనలు, సలహాలు అందజేశారు. ప్రతిఒక్కరూ మ్యాథ్స్ నేర్చుకుని పట్టు సాధించాలని, క్లాసులు విని ఇంటికెళ్లిన తర్వాత ఒకటికి రెండు లేదా మూడు సార్లు ప్రాక్టీస్ చేయాలని సూచించారు. అభ్యర్థులు రోజూ ఉదయం 9 గంటల లోపు శిక్షణా కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సహకారంతో శిక్షణ ఇస్తున్నామని, క్రమ శిక్షణతో ఉద్యోగం సాధించాలని సూచించారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ సైదులు, పట్టణ సీఐ మధు, రూరల్ సీఐ విజయ్, ఉచిత శిక్షణ అధ్యాపకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.