మెదక్ అర్బన్, ఫిబ్రవరి27: అర్జీదారుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 105 మంది అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన 15 వినతులు, భూ సమస్యలకు సంబంధించి 62 వినతులు స్వీకరించారు. ఆయా శాఖల అధికారులు వీటిని పరిష్కరించాలని సూచించారు. కారక్రమంలో జిల్లా అధికారులు విజయశేఖర్ రెడ్డి, కమలాకర్, రజాక్, రాధాకిషన్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్లో..
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని రెవెన్యూ డివిజనల్ అధికారి నగేశ్ తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 36 ఫిర్యాదులు అందాయి. అర్జీలు స్వీకరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పెట్టుకున్న అర్జీలు పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయరాదని కోరారు. అన్ని శాఖల అధికారులు ప్రజావాణిలో తమ శాఖకు సంబంధించి వచ్చిన అర్జీలు, పరిష్కరించినవి, పెండింగ్లో ఉన్న వివరాలను సంబంధిత రిజిస్టర్లలో అప్డేట్ చేయాలని సూచించారు. ప్రజావాణికి సంబంధించిన రిజిష్టర్లను తప్పనిసరిగా నిర్వహించాలని వివరించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.