నేటి నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం
గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రత, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి నాల్గోవిడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని 10రోజుల పాటు చేపట్టనున్నది. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంత్రి హరీశ్ గజ్వేల్ మహంతి ఆడిటోరియంలో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్ అధ్యక్షతన జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు పల్లె, పట్టణ ప్రగతిపై దిశానిర్దేశం చేశారు. ఈ పది రోజుల్లో అన్ని గ్రామాల్లో పట్టణాల్లో ముఖ్యంగా పారిశుధ్యం, ఆరోగ్యం, హరితహారం, విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పచ్చదనం పెంచేందుకు ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను పంపిణీ చేస్తారు. ఆ మొక్కలను నాటించి సంరక్షించే బాధ్యత వారికే అప్పగిస్తారు. గ్రామాలు, పట్టణాల్లో భారీగా మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. నాటిన ప్రతీ మొక్క బతికేలా చర్యలు చేపట్టనున్నారు. రెండు రోజుల పాటు దళితుల సాధికారిత కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పల్లెప్రగతి కార్యక్రమ టీమ్ ఆధ్వర్యంలో ప్రతి దళితవాడల్లో మౌలిక సదుపాయాల స్థితిగతులను చూసి, వాటిని అంచనా వేసి నివేదికన తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రతి మండల కేంద్రంలో ఒక పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయనున్నారు. ఈ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి, ఎంపీ నుంచి గ్రామ వార్డు సభ్యుడి వరకు, జిల్లాస్థాయి అధికారి నుంచి క్షేత్రస్థాయి అధికారి వరకు ఈ మహాక్రతువులో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. పల్లెల్లో పచ్చదనం.. పటణాల్లో పరిశుభ్రత వెల్లివిరిసేలా చేయడం.. నిధుల సద్వినియోగం.. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి..
నేటి నుంచి ప్రారంభమయ్యే రెండో విడుత పట్టణ ప్రగతి పకడ్బందీగా అమలు చేసేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాం. పట్టణంలోని అన్ని వార్డుల్లో పట్టణ ప్రగతి అమలుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. అలాగే ఏడో హరితహారం కార్యక్రమానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొక్కలు నాటేందుకు గుర్తించిన స్థలాల్లో గుంతలు తవ్వించి సిద్ధంగా ఉంచాం.
శ్రీహరి, మున్సిపల్ కమిషనర్
అభివృద్ధి కోసమే పట్టణ ప్రగతి
పట్టణ ప్రగతి నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. జూలై 10 తేదీ వరకు పట్టణంలో వార్డుల వారీగా వార్డు కమిటీ సభ్యులతో వార్డుల్లోని సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరిస్తాం. హరితహారం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో గుర్తించిన స్థలాల్లో మొక్కలు నాటడంతో పాటు ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు అందజేస్తాం. పట్టణంలోని ప్రభుత్వ స్థలాలు, రోడ్డుకు ఇరువైపులా, పాఠశాల, కళాశాలల ఆవరణలో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.