సంగారెడ్డి, మార్చి 23(నమస్తే తెలంగాణ): దేశంలోనే తెలంగాణను అగ్రభాగంలో నిలిపిన కేసీఆర్ విజన్ నిలబడాలన్నా… బీజేపీ మతరాజకీయాలకు, కాంగ్రెస్ మోసపూరిత రాజకీయాలకు చెక్పెట్టాలన్నా మెదక్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ గెలుపు ఎంతైనా అవసరం ఉందని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డికి వచ్చిన ఆయన స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణను కలిశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు సహకరించాల్సిందిగా ఇద్దరిని కోరారు. అనంతరం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడారు.
మెదక్ పార్లమెంట్ మరింత అభివృద్ధి జరగాలన్నా, ప్రజల వాణి పార్లమెంట్లో వినిపించాలన్నా ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించాల్సిన అవసరం ఎంతై నా ఉందన్నారు. బీఆర్ఎస్ ఎంపీగా తనను గెలిపిస్తే పార్లమెంట్లో ప్రజల గొంతకు అవుతానిని స్పష్టం చేశారు. మెదక్ కేసీఆర్ సొంత జిల్లా అని, ఇక్కడ ఓటర్లు ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ వెన్నంటే నడిచారని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. సిద్దిపేట జిల్లాలో కలెక్టర్గా, మెదక్ జిల్లాలో తొమ్మిదినెలలు ఇన్చార్జి కలెక్టర్గా పనిచేశానని గుర్తుచేశారు. ఐఏఎస్ అధికారిగా పనిచేసిన తనకు మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలపై పూర్తి అవగాహన ఉందన్నారు.
ఇక్కడి ప్రజల ఆకాంక్షలు, అవసరాలు తనకు తెలుసన్నారు. కేసీఆర్ సూచనల మేరకు ఎంపీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా శ్రమిస్తానని తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆధ్వర్యంలో 26వ తేదీ నుంచి నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేస్తామన్నారు. మండల కేంద్రాల్లో పార్టీ సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలను దీటుగా ఎదుర్కొని ఎన్నికల్లో ఖంగుతినిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ అయోధ్య, శ్రీరాముడి పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నదని విమర్శించారు. ప్రజలు మత రాజకీయాలను అండగా నిలిచే పరిస్థితి లేదన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోవడం లేదని విమర్శించారు. తప్పుడు హామీలు ఇచ్చి మోసపూరితంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు అర్థమైందని, ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధ్ది చెప్పడం ఖాయమన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి మెదక్ పార్లమెంట్కు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులతో పాటు కేంద్రీయ విద్యా సంస్థలను తీసుకువస్తానని చెప్పారు. నూతన రైల్వేలైన్లతో పాటు మెట్రో రైల్ విస్తరణకు కృషి చేస్తానని వెంకట్రామిరెడ్డి తెలిపారు.