అన్నదాతను అకాల వర్షం ఆగం చేసింది. ఆరుగాలం పంట పండించేందుకు కష్టపడ్డ రైతు ఆశలపై పంట చేతికొచ్చే సమయంలో వడగండ్ల వాన ‘నీళ్లు’చల్లింది. మంగళవారం రాత్రి కురిసిన ఈదురు గాలులు, వడగండ్ల వానతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వరి, మామిడి రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరుగగా, ఇండ్లపై రేకులు ఎగిరిపడిపోయాయి. బుధవారం ఉదయం బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆయా మండలాల్లో అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను, కూలిన ఇండ్లను పరిశీలించి రైతులను, నష్టపోయిన వారిని పరామర్శించారు. అధైర్యపడొద్దు, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
నాకున్న నాలుగు ఎకరాలలో వరి పంట వేశాను. వర్షం కారణంగా చేతికి వచ్చిన వరి పంట నేలపాలైంది. మరో వారంరోజుల్లో కోద్దామనుకున్నాను. ఇంతలోనే వర్షం పడి వరి ధాన్యం నేలరాలింది. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.
– కోడూరి పండరి, గంజిగూడెం (సంగారెడ్డి మండలం)
చేతికివచ్చిన పంట వర్షం పాలైంది
మూడు ఎకరాల్లో వరి సాగు చేశాను. రెండు రోజుల్లో వరి పంట కోద్దామనుకున్నా. ఇంతలోనే వాన పడి వరి ధాన్యం నేలరాలింది. చేతికి వచ్చిందనుకున్న పంట నేలపాలైంది. ప్రభుత్వమే పెద్ద మనస్సు చేసుకుని మమ్మల్ని ఆదుకోవాలి.
– వీరేశం, కల్పగూరు (సంగారెడ్డి మండలం)