తెలంగాణ చీకట్లను చీల్చుకుంటూ ఉషోదయపు వెలుగులా.. ఒక్కడై.. అనంతుడై.. ముందుకు సాగి ‘ప్రత్యేక’ రాష్ర్టాన్ని సాధించాడు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఉక్కు సంకల్పంతో నెరవేర్చిండు. ఈ క్రమంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ధీరోదాత్తుడు. స్వరాష్ట్రంలో ప్రజల జీవితాల్లో కాంతులు నింపాడు. రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టి, దేశంలోనే కొత్త ఒరవడి సృష్టించాడు. సబ్బండవర్ణాల సంక్షేమంతో దేశ దృష్టిని మరల్చాడు. దేశంలో తెలంగాణ పేరు మారుమోగేలా చేశాడు. సీఎం కేసీఆర్లాంటి నేత తమకు కావాలని దేశం కోరుకుంటున్నది. ఆయన సేవలు అవసరమని భావిస్తోంది. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు యోచిస్తుండగా, అంతటా హర్షం వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నది.
– సిద్దిపేట, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆరు దశాబ్దలుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు.. ఆంధ్ర నాయకుల ఎత్తులను చిత్తుచేసి, సమస్త తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఉక్కు సంకల్పంతో ఒక్కడుగా కదిలి, అందరినీ ఏకం చేసి.. ప్రాణాలను సైతం పణంగా పెట్టి, స్వరాష్ట్రం సాధించిన ధీరోదాత్తుడు సీఎం కేసీఆర్. అంతటి మహా నాయకుడు నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి బయలు దేరుతున్నారు. జాతీయ పార్టీని ప్రారంభించి, దేశం కోసం కదలడానికి సిద్ధమవుతున్న సిద్దిపేట ముద్దుబిడ్డ సీఎం కేసీఆర్కు అన్నివర్గాల ప్రజలు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి.
సీఎం కేసీఆర్ వెంట నడవడానికి సబ్బండ వర్గాల ప్రజలు సిద్ధమవుతున్నారు. దేశ రాజకీయాల్లో అడుగుపెడుతున్న సమయంలో ఆయా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వీరజవాన్ల కుటుంబాలు, రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచి, ఆర్థిక సాయం చేయడంపై యావత్తు దేశ ప్రజల దృష్టి సీఎం కేసీఆర్పై పడింది. ఇలాంటి నేత దేశానికి కావాలంటూ అనేక రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తూ, అన్నివర్గాల ప్రజల నుంచి మన్ననలు పొందుతున్నారు. వరుసగా రెండు పర్యాయాలు తెలంగాణ ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేశారు. ఇవాళ దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వ పథకాలు మారాయి. ఇక్కడి పథకాలను చూసి ఇతర రాష్ర్టాల్లో అమలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రారంభించి దేశ రాజకీయాల్లోకి వెళ్తే, దేశం అబ్బురపరిచేలా పాలనను అందిస్తారని ఇక్కడి ప్రజలు ఘంటాపథంగా చెబుతున్నారు.
కేసీఆర్ వైపు యావత్ దేశం చూపు…
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అవలంబిస్తున్న విధానాలతో దేశ ప్రజలు ఆ పార్టీపై విసుగు చెందారు. ప్రత్యామ్నాయ నేతలు, పార్టీల కోసం దేశం చూస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ వారికి ఆశాకిరణంలా మారారు. వారి ఆకాంక్షలను నిజం చేస్తూ జాతీయ పార్టీని ప్రారంభిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో యావత్తు దేశం తెలంగాణ వైపు చూస్తున్నది. ఇటీవల దేశంలోని వివిధ రాష్ర్టాల్లో సీఎం కేసీఆర్ పర్యటించినప్పుడు అనూహ్య స్పందన వచ్చింది. అక్కడి ప్రజలు, నేతలు దేశం కోసం కేసీఆర్ ముందుకు రావాలని ఆకాంక్షించారు.
వివిధ రాష్ర్టాలకు చెందిన రైతు సంఘాల నాయకులు తెలంగాణకు వచ్చి, ఇక్కడ నిర్మించిన ప్రాజెక్టులు, అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తమ రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు, అభివృద్ధి ఉంటే ఎంత బాగుండు! ఇలాంటి నేత మాకు ముఖ్యమంత్రిగా ఉంటే మా రాష్ట్రం కూడా ఇలా అభివృద్ధిలో అగ్రగామిగా ఉంటుండే! అని రైతు సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాల్లోకి రావాలని స్వయంగా సీఎం కేసీఆర్ను రైతు సంఘాల నేతలు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఎన్నడూ లేనంతగా ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాలో గుంట జాగ లేకుండా రైతులు ప్రతిగుంట అచ్చుకట్టి సాగుచేశారు.
ప్రభుత్వం అందిస్తున్న ఉచిత, రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలతో చేయూత ఇవ్వడంతోనే ఇది సాధ్యమైంది. దేశంలో సైతం ఇలాంటి మార్పు రావాలంటే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపించాలని ప్రజలు కోరుతున్నారు. రాదు అనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా దేశం అబ్బురపరిచేలా పాలనను అందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచారు సీఎం కేసీఆర్. తెలంగాణ పథకాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపీ కొట్టింది. మిషన్ భగీరథ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్రంలో ‘హర్ ఘర్ జల్’ రైతుబంధును ‘పీఎం కిసాన్ యోజన’గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇలా చెప్పుకుంటుపోతే, ఎన్నో పథకాలు కేంద్రం కాపీ కొట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో కేసీఆర్ లాంటి నేత కావాలని దేశం ఎదురు చూస్తున్నది.
నదికి కొత్త నడక నేర్పిన సీఎం కేసీఆర్
‘ఈ నడిగడ్డ ప్రాంతంలో రిజర్వాయర్ వస్తే మొత్తం తెలంగాణ బాగుపడ్తది’ అని ఈ ప్రాంతంలో సీఎం కేసీఆర్ ఇక్కడ రూపకల్పన చేశారు. ఒకప్పుడు తాగు, సాగు నీళ్లు లేక కరువు, కాటకాలకు నిలయం సిద్దిపేట ప్రాంతం. కానీ, నేడు గోదావరి నీళ్లను తెచ్చి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన నాయకుడు సీఎం కేసీఆర్. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడిగా, వందేళ్లు ముందు ఆలోచించి, నది లేని చోట రిజర్వాయర్ను ఏర్పాటు చేసిన నాయకుడు. నదికి కొత్త నడక నేర్పిన వ్యక్తి సీఎం కేసీఆర్. మూడున్నరేండ్ల తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయింది. హల్దీ, కూడవెల్లి వాగుల్లో గోదావరి జలాలు వదిలితే, వందల కోట్ల రూపాయల ధాన్యం పండింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతుల నూతనోత్తేజం వచ్చింది. సాగునీరు లేక రైతులు ఇన్నాళ్లు అల్లాడిపోయారు.
ఎక్కడో పుట్టిన గోదారమ్మను అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ మీదుగా ఎంతో ఎత్తులో ఉన్న కొండపోచమ్మ వరకు నీళ్లు తెచ్చిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్. ఇన్నాళ్లు రైతుల కోసం ఎవరూ ఆలోచించలేదు. రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను ప్రవేశపెట్టి రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచారు. నీళ్లు లేక పడావు ఉన్న భూముల్లో సిరుల పంటలు పండిస్తున్నారు. రెండు, మూడేండ్లుగా భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయి. ఇన్నాళ్లూ నీళ్లు లేక పడావు పెట్టి బతుకు కోసం వలసపోయిన రైతులు కాళేశ్వరం జలాలు రావడంతో ఆ రైతులంతా సొంతూర్లకు చేరుకొని చేతినిండా పనిచేసుకుంటున్నారు. గోదావరి జలాలు చూసి సంబురంలో తేలియాడుతున్నారు.
కాల్వల ద్వారా సాగు చేయడంతో మంచి పంటలు పండుతున్నాయి. గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు చేతినిండా పని దొరికింది. సమైక్య రాష్ట్రంలో భూములు ఉన్నప్పటికీ నీళ్లు లేక యువత ఖాళీగా ఉండేవారు. నేడు గోదావరి జలాలు రావడంతో యువత వారికున్న టెక్నాలజీతో వ్యవసాయాన్ని వినూత్నంగా చేపడుతున్నారు. పల్లె ప్రజలకు చేతినిండా పని ఉండడంతో పల్లెలు ప్రశాంత వాతావరణంలో జీవనం కొనసాగిస్తున్నాయి. ఇటీవల 24 రాష్ర్టాలకు చెందిన రైతు సంఘాల నాయకులు స్వయంగా మల్లన్నసాగర్కు వచ్చి రిజర్వాయర్లను చూశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం అని కితాబు నిచ్చారు. సీఎం కేసీఆర్లాంటి నేత మాకూ కావాలని ఆకాంక్షించారు.
దేశ భవిష్యత్ కేసీఆర్తోనే మారుతుంది
దేశ రాజకీయాలకు సీఎం కేసీఆర్ వెళ్లాలి. ఎందుకంటే దేశంలో పరిపాలించేటోళ్లు అందరూ కుమ్మక్రై నీచ రాజకీయాలు చేస్తుండ్రు. వారికి అడ్డుకట్ట వేయాలటే కేసీఆర్తోనే సాధ్యం. దేశంలో ఒకే పాలన జరుగాలని రైతులం చూస్తున్నం. నేను పాలమ్ముకుని బతికెటోన్ని. నాకు నా పాలమీద కూడా కేంద్రం కుట్రలు పన్ని జీఎస్టీ వసూలు చేస్తున్నది. ఇంతకంటే అధ్వానమైన దేశ పాలన ఉందా అనిపిస్తుంది.
– తెనుగు నర్సింహులు, రైతు, రామాయంపేట
దేశాభివృద్ధికి కేసీఆర్ సేవలు అవసరం
ప్రస్తుత పరిస్థితుల్లో దేశాభివృద్ధికి సీఎం కేసీఆర్ సేవలు అవసరం. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాననే ఆయన నిర్ణయం శుభపరిణామం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్తో అన్ని విధాల అభివృద్ధి చెందింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో ఇక్కడి పథకాలు అమలుచేస్తే దేశం త్వరితగతిన ప్రగతిని సాధిస్తుంది.
– గుండం మోహన్రెడ్డి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు, నర్సాపూర్
తెలంగాణ పరిపాలన దేశం అంతటా ఉండాలి
తెలంగాణ కొనసాగుతున్న పాలన దేశంలో మొత్తంలో ఉండాలి. దేశంలోని రైతులందరికీ రైతుబంధు, రైతు ఇన్సూరెన్సు ఉండాలి. దేశంలో ఉన్న రాష్ర్టాల ముఖ్యమంత్రులు మా తెలంగాణ సీఎంను చూసి నేర్చుకోండి. మా సీఎం దళిత వర్గాలకు దళిత బంధు ఇస్తుండు. ఇతర వర్గాలకు సబ్సిడీ లోన్లు కూడా బ్యాంకు ద్వారా మంజూరు చేస్తున్నడు. ఇతర రాష్ర్టాల్లో కూడా ఇట్లగే చెయ్యాలి.
– అంబాడి లత, రైతు కూలీ, కోనాపూర్ గిరిజన తండా, రామాయంపేట
పేద ప్రజల బతుకులు మారుతాయి..
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే పేదల బతుకులు మారుతాయి. ఎన్నో రాష్ర్టాల్లో పేదలు దుర్భర పరిస్థితుల్లో బతుకుతుండ్రు. బీజేపీ కేవలం మతతత్వాన్ని రెచ్చగొడుతోంది. ఇదివరకే కాంగ్రెస్ పాలనను మనం చూశాం. ఇప్పుడు కేంద్రంలో ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉన్నది. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం శుభసూచికం.
– కేబుల్ కృష్ణ, మ్యాక్సొసైటీ, ఆర్సీపురం
దేశాన్ని సమర్థవంతంగా నడిపించేది కేసీఆర్ ఒక్కరే..
దేశాన్నీ సమర్ధవంతంగా నడిపించే సత్తాగల మహానేత సీఎం కేసీఆర్ ఒక్కరే. దేశంలో ఏరాష్ట్రంలో కూడా ఇలాంటి నాయకుడు కనిపిస్త లేడు. ప్రస్తుత సమయంలో దేశరాజకీయాలను గాడిలో పెట్టగల మహానేత మన ముఖ్యమంత్రి. జాతీయస్థాయిలో రాజకీయ పార్టీ పెట్టడం వల్ల బీజేపీ రహిత పార్టీగా ఎదగడం ఖాయం. దేశ ప్రజలు మన రాష్ట్రం వైపు, మన ముఖ్యమంత్రి వైపు చూస్తున్నారు. ఇలాంటి మహానాయకుడు కావాలని కోరుకుంటున్నారు.
– సద్దిప్రవీణ, గుమ్మడిదల ఎంపీపీ
దేశ రాజకీయాల్లోకి రావాలి
సీఎం కేసీఆర్ సార్ దేశ రాజకీయాల్లోకి రావాలి. తెలంగాణలో లాగానే దేశంలోని రైతులకు రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇవ్వాలి. సీఎం కేసీఆర్తోనే తెలంగాణలో వ్యవసాయం ఎంతో ముందుకు సాగుతున్నది. దేశంలో సైతం వ్యవసాయం ముందుకెళ్లాలంటే కేసీఆర్లాంటి నాయకుడు జాతీయస్థాయి రాజకీయాల్లోకి రావడం ఎంతో అవసరం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదు.
– నగేశ్, రైతు నాయకుడు, మెదక్ మున్సిపాలిటీ
రాజకీయ దురంధరుడు
దేశంలోనే రాజకీయ దురంధరుడు, సత్తాగల ధైర్యవంతుడైన నాయకుడు సీఎం కేసీఆర్. అంతకుమించిన నాయకుడు ఎవ్వరూ దేశంలో జల్లెడ పట్టినా దొరకరు. తెలంగాణలో పథకాలు వినూత్నంగా రూపొందిస్తూ దేశంలోనే అత్యంత మహాశక్తిగా ఎదిగాడు. ఆయనకు మించిన నాయకుడే దేశంలో లేడు. కేసీఆర్తోనే దేశం బాగుపడుతుంది.
– రామకిష్టయ్య మాజీ సర్పంచ్, బొక్కల వైద్యుడు రామాయంపేట
దేశం బాగుపడుతుంది..
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే దేశం బాగుపడుతుంది. ముఖ్యంగా పేదలకు మేలు జరుగుతుంది. ఎన్నో సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ని చూసి కేంద్రం కాపీ కొడుతున్నది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఎనిమిది ఏండ్లల్లోనే సీఎం అరవై ఏండ్ల అభివృద్ధిని చూపించారు. దేశ ప్రజలు కూడా సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు మాకు కావాలే అంటుండ్రు. సార్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే పెను మార్పులు వస్తాయి.
– రవికుమార్, స్టీల్ షాప్ వ్యాపారి, ఆర్సీపురం