నారాయణరావుపేట, ఫిబ్రవరి 10 : ‘సకాలంలో ప్రోత్సాహం అందించే బాధ్యత నాది.. అంతర పంటలు వేసి కొత్త పద్ధతులు పాటించేలా రైతులు ముందు రావాలి’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. మీ మేలు కోసమే ప్రభుత్వం తాపత్రయపడుతున్నదన్నారు. డ్రిప్, స్ప్రింక్లర్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. గురువారం నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది 124, సికింద్లాపూర్ గ్రామస్తులకు 21 స్ప్రింక్లర్ల సెట్లను మంత్రి హరీశ్రావు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచడం తప్ప రైతులకు చేసిందేమీ లేదన్నారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు కాగానే డీజిల్, పెట్రో ధరలను పెంచుతుందని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం చేసే ప్రతీ పని రైతులకు వ్యతిరేకంగా ఉందని, మొన్న పార్లమెంట్లో పెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపి, రైతులపై బీజేపీ భారం వేసిందని మండిపడ్డారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వేల కోట్లతో నిరంతరం ఉచిత కరెంట్ సరఫరా, ఇప్పటివరకు 10 లక్షల పేదింటి ఆడపిల్లల పెండ్లిళ్లకు ఆర్థిక సాయం అందించిందని తెలిపారు. నియోజకవర్గంలోనే మొదటి సారి ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటున్న ఈ గ్రామానికి అత్యధిక స్ప్రింక్లర్ల సెట్లను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మంలోని సత్తుపల్లి రైతులు అంతర పంటలు వేసి రెండింతలు సంపాదిస్తున్నారని మీరు కూడా సత్తుపల్లి వెళతామంటే.. ఏర్పాట్లు చేయించి పంపిస్తామని, అక్కడికి వెళ్లి చూసి నేర్చుకొని ఆయిల్ పామ్ సాగు చేయాలని రైతులను కోరారు. ఆయిల్ పామ్ సాగు చేస్తే పాడి బర్రెల్లా ఎప్పుడూ.. ఏడాదంతా చేతినిండా సంపాదన ఉంటుందని.. భవిష్యత్తులో ఆయిల్ పామ్ రైతులు ఇబ్బందులు పడకుండా నంగునూరు మండలంలోని నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సైతం ఏర్పాటవుతుందని వివరించారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 3 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని, అలాగే చంద్లాపూర్లో 350 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్పామ్, మల్బరీ సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నదని మంత్రి అన్నారు. గుర్రాలగొంది, సికింద్లాపూర్ గ్రామస్తులకు సబ్సిడీపై ఇస్తున్న డ్రిప్, స్ప్రింక్లర్ల సెట్ల పైపులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
చౌడాలమ్మ దయతో కరోనా తగ్గింది
త్వరలోనే గుర్రాలగొంది గ్రామానికి నాలుగు లేన్ల రహదారి వస్తుందని మంత్రి హరీశ్రావు చెప్పారు. గుర్రాలగొందిలో చౌడాలమ్మ దేవాలయ ప్రథమ వార్షికోత్సవాల్లో మంత్రి హరీశ్రావు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చౌడాలమ్మ దయతో కరోనా తగ్గిందన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులను పొందిన గుర్రాలగొంది గ్రామం ఆదర్శమన్నారు. గ్రామంలో అన్ని పనులు చేసుకుంటున్నామని, ఉగాది తరువాత సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకునే వారి కోసం ప్రభుత్వ సాయం చేస్తుందన్నారు. త్వరలోనే నాలుగు లేన్ల రహదారి ఈ గ్రామం మీదుగా వస్తుందని, డివైడర్లు, బట్టర్ ఫ్లై వీధి దీపాలు వస్తాయని, ఇప్పటికే సిద్దిపేట నుంచి రామంచ వరకూ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీలు ఒగ్గు బాలకృష్ణ, కూర మాణిక్యరెడ్డి, సర్పంచ్ శాతరాజుపల్లి ఆంజనేయులు, ఎంపీటీసీ ఆకుల హరీశ్, హార్టికల్చర్ డీడీ రామలక్ష్మి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.