మెదక్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిచడంతో పాటు ఆధార్ కార్డుకు అనుసంధానం చెయ్యాలని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్లో స్వీప్ ద్వారా చేపడుతున్న వార్షిక కార్యాచరణ ప్రణాళికను అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి సమీక్షించారు. ఇప్పటి వరకు జిల్లాలో 43 శాతం ఓటరు కార్డులను ఆధార్తో అనుసంధానం చేసి రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచామన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడం, ఆధార్ కార్డుకు అనుసంధానం చేయడంలో వివిధ శాఖాధికారులకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆయా తేదీల్లో పూర్తి చేసి రాష్ట్రంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. 2004 జనవరి ఒకటి నుంచి 31 డిసెంబర్ వరకు జన్మించిన వారి వివరాలు, స్థానిక పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి సేకరించి నూతన ఓటరుగా నమోదు చేయాలన్నారు. సంవత్సర కాలంలో మరణించిన వారి వివరాలు సేకరించాలని సూచించారు. జాబితా ప్రకారం బూత్స్థాయి అధికారుల పరిధి నిర్దేశించి బాధ్యతలు అప్పగించాలని, నూతన ఓటరు నమోదు, మరణించిన వారి ఓటును తొలిగించే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.
పాల్గొన్న ఆయా శాఖల అధికారులు
సెప్టెంబర్ 9 వరకు జిల్లాలో ఉన్న స్వశక్తి మహిళా సంఘాలతో బూత్ లెవల్స్థాయి అధికారులతో ఆధార్ లింకేజీ ఇతర అంశాలపై సమావేశాలు నిర్వహించి, ఫారం 60బీ పై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఉన్న ప్రతి పోలింగ్ బూత్ కవర్ అయ్యేలా సమావేశాలు నిర్వహించాలని డీఆర్డీవో, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లకు సూచించారు. ఈ నెల 12 నుంచి 16 వరకు అధికారులతో ఇంటింటి సర్వే నిర్వహించి జిల్లాలో ఉన్న గర్భిణులు, బాలింతలను ఓటరు జాబితాలో నమోదు చేయడంపై శ్రద్ధ వహించాలని, ఇందుకు అంగన్వాడీ టీచర్లు, సహాయకులను వినియోగించుకోవాలని మహిళా శిశు సంక్షేమాధికారికి సూచించారు. జిల్లాలో ఉన్న కళాశాలల నుంచి ఒక్కో కళాశాల నుంచి నలుగురు క్యాంపస్ అంబాసిడర్లను ఎంపిక చేసి ఈ నెల 13న ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు క్యాంపస్ కార్యక్రమాలు నిర్వహించి విద్యా సంస్థల్లో చదువుతున్న 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని జిల్లా ఇంటర్మీడియేట్ అధికారికి సూచించారు. జిల్లాలో ఉన్న ప్రాథమిక, ఏరియా దవాఖానల్లో ప్రచార సామగ్రి డిస్ప్లే చేస్తూ ఆశ వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా, ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, యువజన సర్వీసులశాఖల వారు స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఎస్ఎస్ వలంటీర్ల సహకారంతో ఓటరు నమోదు, ఆధార్ లింకేజీపై అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. జిల్లాలో ఉన్న వ్యాపారులతో చర్చించి వారి సంస్థలలో పనిచేస్తున్న వారందరికీ ఓటు హక్కు కల్పించాలని సూచించారు. జిల్లాలో ఉన్న దివ్యాంగుల జాబితా సదరం క్యాంపు నుంచి సేకరించి వారి వివరాలను ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. సమావేశంలో స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, జడ్పీ సీఈవో శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఇందిర, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్, డీఎస్వో శ్రీనివాస్, మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ, జిల్లా ఇంటర్మీడియేట్ అధికారి సత్యనారాయణ, ఆర్డీవో సాయిరాం తదితరులు పాల్గొన్నారు.