ఖైరతాబాద్, ఫిబ్రవరి 7 : ‘రాజ్యాంగ మార్పుపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి….సీఎం కేసీఆర్ ఏం సందర్భంలో అన్నారో గ్రహించాలి…ఆయన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకోవద్దు’.. అని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. బీజేపీ కేంద్ర మంత్రి, కర్నాటక మంత్రులు రాజ్యాంగాన్ని మార్చాలని బహిరంగంగా ప్రకటించారని, ప్రధాని నరేంద్రమోడీ దగ్గరి వ్యక్తులు సైతం ఇదే వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ లక్డీకాపూల్లోని హోటల్ సెంట్రల్ కోర్ట్టులో సోమవారం ఆయన మీడియా సమావేశంలో బీజేపీ నేతల వ్యాఖ్యలు, వారి తీరుపై నిప్పులు చెరిగారు. రాజ్యాంగాన్ని మార్చే అధికారం ముఖ్యమంత్రులకు ఉండదన్న వాస్తవం బీజేపీ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. నేడు రాజ్యాంగంపై దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైందంటే అది సీఎం కేసీఆర్ మాట్లాడడంతోనని, దీనిని లోతుగా పరిశీలిస్తే వాస్తవాలు, బీజేపీ కుట్రలు బయటపడుతాయన్నారు. బీజేపీ నేతలు ఆ వ్యాఖ్యలు తప్పుపడుతున్నారన్నారు. కానీ, దేశంలో ఎన్నోసార్లు సవరణలు చేశారని, అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలే చేశాయని, బీజేపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒక్కటై సీఎం కేసీఆర్ ఏదో మాట్లాడినట్లు పిచ్చిపిచ్చిగా అర్థాలు తీస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం మార్చే కుట్రకు కేంద్రమే తెరలేపిందన్నారు. రాజ్యాంగం ఎవరి కోసం అన్న ఆలోచన చేయాలని, రాజ్యాంగం మార్పు చేస్తే అంబేద్కర్ను అవమానించినట్లవుతుందని అంటున్నారని, అలాంటిది కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలు దళితులకు ఏం చేశారని, 2014 నుంచి సవరణలు చేస్తూనే ఉన్నారన్నారు.
అందులో భాగంగానే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని, నేడు సింగరేణిని కూడా ప్రైవేట్కు అప్పగించే యోచనలో ఉన్నారన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై లైంగికదాడులు, దౌర్జన్యాలు, దాడులు పెరిగాయన్నారు. దళిత వ్యతిరేక సర్కారు బీజేపీది అని , వారికి చిత్తశుద్ది ఉంటే దళితులపై దాడులను అరికట్టాలన్నారు. 40 కోట్ల దళితులకు బడ్జెట్లోనూ అన్యాయం చేశారని విమర్శించారు. దళితులకు కేంద్రం ఏం చేసిందో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. 6వేల మంది దళిత బిడ్డలను చంపితే నోరు విప్పని ఆ పార్టీ నేతలు, నేడు సిగ్గులేకుండా భీం దీక్షలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. ఆ పార్టీ నేతలకు జై భీమ్ అనే అర్హత లేదని, ఎన్ని కోసమే ఈ నినాదం ఎత్తుకున్నారని ఆరోపించారు. యూపీలో యోగి పాలనలో దళితులపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయని, ఆయన కేబినెట్లో ఉన్న మంత్రి, పలువురు బహుజన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారన్నారు. దీనిని బట్టి ఆ పార్టీతో దళిత, గిరిజనులకు ఒరిగేదేమి లేదన్నారు. రాజ్యాంగంపై చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అంటే తప్పేందని, బడ్జెట్లో రాష్ర్టాలకు అన్యాయం చేశారని సీఎం నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత గిరిజనులకు అన్ని రకాలుగా న్యాయం చేసిందన్నారు. వారి సంక్షేమానికి పాటుపడుతున్నదని తెలిపారు. రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నారన్నారు. దీనిపై తాము కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో బి.సురేందర్ సన్ని, కొమ్ము తిరుపతి, నర్సయ్య, సంతోష్ కుమార్, బాలరాజు, వెంకటేశ్, మల్లేశ్, సుమలత, సుద్దాల లక్ష్మణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.