నిజాంపేట, ఫిబ్రవరి 6 : ఆరోగ్యపరిరక్షణ, నాణ్యమైన ఆహారంపై ప్రజల్లో రోజురోజుకూ అవగాహన పెరుగుతున్నది. ముఖ్యంగా మాంసాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని, బలం వస్తుందని వైద్యులు, ఆరోగ్యనిపుణులు సూచిస్తుండడంతో చికెన్, మటన్, చేపలతో పాటు నాటు కోళ్లు, కడక్నాథ్ కోళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రధానంగా కడక్నాథ్ మాంసం తీసుకునేందుకు అనేకమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కోళ్లు సాధారణ కోళ్లలాగా కాకుండా నల్లగా ఉంటాయి. వీటి మాంసం, గుడ్డు సైతం నలుపు రంగులోనే ఉంటాయి. ఈ కోళ్లలో ‘మెలనిన్’ అనే హార్మోన్ అధికంగా ఉండడంతో ఇవి నల్ల రంగులో ఉంటాయి. రుచి, పోషక విలువలు అధికంగా ఉండడం కారణంగా మాంసప్రియులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో, ప్రస్తుత మార్కెట్లో కడక్నాథ్కోళ్లకు డిమాండ్ అధికంగా ఉంది. లైవ్ కడక్నాథ్ కోడి కిలోకు రూ 600, ఒక్కో గుడ్డు రూ.40 వరకు ధర ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఖర్చును సైతం లెక్కచేయకుండా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రైతులు కడక్నాథ్ కోళ్లను పెంచి విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు. ఇదే తరహాలో మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన యువ రైతు బాబు వ్యవసాయం చేస్తూనే అదనపు ఆదాయ వనరుగా నాలుగు సంవత్సరాల నుంచి తన వ్యవసాయక్షేత్రంలో చిన్న ఫామ్ను ఏర్పాటు చేసి కడక్నాథ్ కోళ్లతో పాటు నాటు కోళ్లను పెంచుతున్నాడు. డిగ్రీ వరకు చదువుకున్న బాబు పౌల్ట్రీ రంగంలో మెళకువలు తెలుసుకొని, స్వయం ఉపాధే లక్ష్యంగా కోళ్లను పెంచాలని నిర్ణయించుకున్నాడు.ఇందుకోసం తన వ్యవసాయ భూమిలో ఓ వైపు నాటు కోళ్లు, మరో వైపు కడక్నాథ్ కోళ్లను వేర్వేరుగా ఏర్పాటు చేసిన షెడ్లలో పెంచుతూ అదనపు ఆదాయం పొందుతున్నాడు.
కడక్నాథ్ కోళ్లలో ఔషధ గుణాలు భేష్..
కడక్నాథ్ కోళ్లలో అధిక ప్రోటీన్లు, తక్కువ కొలెస్ట్రాల్ ఉంటాయి. ఈ మాంసం తింటే ఊబకాయం వంటి సమస్యలతో పాటు శ్వాస సంబంధ వ్యాధులు రావు. హిమోగ్లోబిన్ శాతం పెరిగి ఆరోగ్యవంతంగా ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు వ్యక్తిగత శుభ్రత, రోగ నిరోధక శక్తి పెంచుకోవడంపై శ్రద్ధ వహిస్తున్నారు. దీంతో ఈ కోళ్లకు డిమాండ్ పెరిగింది.
తక్కువ ఖర్చు అధిక ఆదాయం
మాది వ్యవసాయ కుటుం బం. వ్యవసాయం చేస్తూనే అదనంగా ఆదాయం పొందే మార్గాల గురించి ఆలోచించాను. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటైన కోళ్ల పరిశ్రమపై మక్కువతో కడక్నాథ్, నాటు కోళ్ల పెంపకాన్ని ఎంచుకున్నాను. నాలుగు సంవత్సరాలుగా కడక్నాథ్ కోళ్లను ప్రత్యేకంగా వేసిన ఫామ్లలో పెంచుతున్నాను. మొదట్లో కొన్ని ఇబ్బందులు వచ్చినా.. మెళకువలు తెలుసుకొని, ప్రస్తుతం 100 కోళ్ల వరకు పెంచుతున్నాను. వీటికి ఆహారంగా దానాతో పాటు ఆకుకూరలు, రాగులు, సజ్జలు, నీళ్లను మూడు పూటలా అందిస్తాను. ఈ కోళ్లకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ కాబట్టి ఏ వ్యాధీ రాదు. దీంతో తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం వస్తుంది.
-గడీల బాబు, రైతు, నిజాంపేట