నారాయణరావుపేట, ఫిబ్రవరి 6 : దళితులు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని, వారికి రూ.10లక్షలు అందించి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దళితబంధు పథకం ఆమలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట నియోజకవర్గం నారాయణరావుపేట మండలం బంజరుపల్లిలో దళితబంధు అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు గ్రామంలో బొడ్రాయి, సారుగమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బంజరుపల్లిలో మొదట విడుతగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి పొందాలన్నారు. వ్యాపారం చేసుకునేందుకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. గ్రామంలో 21 దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. గ్రామంలోని ఇంటింటికీ వచ్చి అధికారులు సర్వే చేస్తారని, సర్వేకు గ్రామస్తులు సహకరించాలని మంత్రి కోరారు.రాష్ట్రంలోనే మొదటి సోలార్ గ్రామం బంజరుపల్లి అని, ఐక్యతకు ఈ గ్రామం నిదర్శమని ప్రశంసించారు. గ్రామాన్ని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామన్నారు. గ్రామంలో ఉగాది పండుగ తర్వాత ఇంటి అడుగు స్థలం ఉన్న వారికి ఇండ్లు కట్టిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్ల్లిష్ మీడియం విద్యను అందించేందుకు రూ.7300 కోట్లతో ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తామన్నారు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ, దవాఖాన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేటలో 900 పడకల దవాఖానను ఏర్పాటు చేసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో లేని విధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 సాయం అందిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ కిట్టుతో రూ.12,000 ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేన్నారు. అనంతరం సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎంపీపీ బాలకృష్ణ, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, జడ్పీటిసీ కుంబాల లక్ష్మి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో అనంతరెడ్డి, సర్పంచ్ శంకర్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.