నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ క్షణం తీరిక లేకుండా మారుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత పనుల నిమిత్తం ఎక్కడికి వెళ్లాలన్నా, ఎవరిని కలవాలన్నా సొంత వాహనం తప్పనిసరైంది. దీంతో ఇంట్లో కారు, బైక్ ఉన్నప్పటికీ చాలా మంది మరొక తేలికపాటి ద్విచక్ర వాహనం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సెల్ఫ్స్టార్ట్, మాటిమాటికి గేర్లు మార్చే అవసరం లేకపోవడం, నడిపేందుకు సులువుగా ఉండడంతో వీటిని వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువతకు ఈ లైట్ వెయిట్ వాహనాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. కంపెనీలు కూడా వీటి తయారీలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ మరింత సౌకర్యవంతంగా అందుబాటులోకి తెస్తున్నాయి. స్కూటీలు ఇంటిల్లిపాదికి ఉపయోగపడుతుండడంతో కొనుగోలుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.
కొండపాక, జనవరి 29 : పల్లెలు, పట్టణాల్లో ప్రస్తుతం ఇంటికి ఒకటో, రెండో ద్విచక్రవాహనాలు ఉంటున్నాయి. పురుషులతో సమానంగా మహిళలు సైతం వాహనాలు నడిపిస్తుండడంతో వారి కోసం ప్రత్యేకంగా కంపెనీలు లైట్ వెయిట్ (తక్కువ బరువు) మోడళ్లను అందుబాటులోకి తెస్తున్నాయి. వీటిని మహిళా ఉద్యోగులు, విద్యార్థినులతో పాటు గృహిణులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. బజారుకు వెళ్లి కూరగాయలు తేవడం, పిల్లలను స్కూల్లో దించడం.. తీసుకురావడం, కాలేజీలకు వెళ్లడానికి ఇవి అనుకూలంగా ఉంటాయి. అలాగే, ట్రాఫిక్ సమస్య నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. నడిపేందుకు సులువు, బరువు తక్కువ, గేర్లు మార్చే అవసరం లేకుండా, సెల్ఫ్స్టార్ట్ సదుపాయం లాంటి సౌకర్యాలు ఉండడంతో ఈ వాహనాలను కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.
యువత, వృద్ధులకు కూడా..
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ద్విచక్ర వాహనాలు తక్కువ ధరల్లో, అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానం వంటి సౌకర్యాలతో పాటు అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉండడంతో చాలామంది కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువగా కళాశాలలకు వెళ్లే విద్యార్థినులు, ఉద్యోగం చేసే యువతులు, మహిళలు మధ్య వయస్సు మగవాళ్లతోపాటు వృద్ధులు స్కూటీలను ఇష్టపడుతున్నారు. అలాగే, పాఠశాలలకు తమ పిల్లలను దించేందుకు, వ్యాపార అవసరాల కోసం వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు.
పెరుగుతున్న అమ్మకాలు…
తేలికపాటి వాహనాలు వినియోగించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. రకరకాల మోడళ్ల అనేక బ్రాండ్లు అందుబాటులో ఉండడంతో ఈ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నది. నగర, పట్టణ ప్రజలే కాకుండా పల్లెవాసులు కూడా లైట్ వెయిట్ వాహనాలను కొంటున్నారు. రోజుకు సగటున 20 నుంచి 30 వరకు వాహనాలను విక్రయిస్తున్నామని షోరూం యజమానులు పేర్కొంటున్నారు.
కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి…
వాహనాలు నడిపే విద్యార్థినులు, మహిళలు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి. చాలా సందర్భాల్లో చున్నీలు, చీరలు బండి చక్రాలకు చుట్టుకుపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. పట్టణాల్లో రద్దీ రహదారుల్లో 20 కి.మీల వేగం మించకుండా చూసుకోవాలి. ప్రధాన రహదారులపై 40 నుంచి 45 కి.మీల వేగంతో మాత్రమే ప్రయాణించడం మంచిది. వర్షాకాలంలో అయితే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఎవరైనా సులువుగా నడుపవచ్చు..
నేను ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లేందుకు ఈ వాహనాన్ని ఉపయోగిస్తా. ప్రస్తుత పరిస్థితుల్లో పనిమీద బయటకు వెళ్లాలన్నా.. పనులు త్వరగా పూర్తి కావాలన్నా వాహనాల వినియోగం తప్పనిసరి అయింది. నా వద్ద లైట్ వెయిట్ వాహనం ఉంది. దీన్ని సులభంగా నడపగలుగుతున్నాను. మా కుటుంబ సభ్యులంతా దీనిపై ప్రయాణిస్తూ పనులను చకచకా పూర్తి చేసుకుంటున్నారు. పెద్ద వాహనాలు డ్రైవింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది.
మహిళలకు ఉపయోగకరం
ఇంట్లో చిన్నపాటి వాహనం ఉంటే విద్యార్థినులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇతరులపై ఆధారపడకుండా బస్సుల కోసం ఎదురుచూడకుండా కళాశాలకు వెళ్లవచ్చు. తేలికపాటి వాహనం నడుపుతుంటే ఎలాంటి భయం ఉండదు. చిన్న వాహనం అయితే ట్రాఫిక్ నుంచి త్వరగా బయటపడవచ్చు.
-కోల సద్గుణ రవీందర్, మాజీ ఎంపీటీసీ, కుకునూరుపల్లి (సిద్దిపేట జిల్లా)