కులాలు, మతాల పేరిట కొన్ని శక్తులు ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తున్నాయని, రాజకీయాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందేందుకు చూస్తున్నాయని, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన ఫ్రీడం ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 75 వసంతాల స్వతంత్ర వేడుకలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. నాడు తిండిలేక ప్రజలు అలమటించారని, నేడు అన్నంపెట్టే స్థాయికి మనం ఎదిగినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్నిరంగాల్లో ముందు వరుసలో ఉన్నామని, అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతున్నట్లు తెలిపారు. సంక్షేమ పాలన కొనసాగుతున్నదన్నారు. వేలకోట్ల రూపాయలతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్య్ర స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.
సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 13: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో అద్భుత పురోగతి సాధిస్తూ దేశంలో నంబర్వన్ స్థానంలో ఉందని, రాష్ట్రంలో ఈ మధ్య కొన్ని విచ్ఛిన్నకర శక్తులు కులాలు, మతాలను విడదీసి రాజకీయం చేస్తున్నాయని, వారితో జాగ్రత్తగా ఉండాలని, తమ రాజకీయ స్వార్థం కోసం ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి హరీశ్రావు ఆరోపించారు. విచ్ఛిన్నకర శక్తులతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ కుల మతాలకు అతీతంగా అన్నివర్గాల అభివృద్ధ్ది, సంక్షేమానికి పాటుపడుతున్నట్లు చెప్పా రు.
దేశంలో సంక్షేమ పాలన ఒక్క తెలంగాణలోనే ఉందన్నారు. తెలంగాణ దేశంలోనే ఆహార ఉత్పత్తిలో ప్రథమ స్థానం లో ఉందని చెప్పారు. ఆదాయ వనరుల వృద్ధ్దిరేటులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రం 11.5 వృద్ధ్దిరేటుతో దేశంలో ప్రథమ స్థానం లో ఉందన్నారు. తెలంగాణ తర్వాత 9.7 శాతంతో ఒడిశా, 9.2 శాతంతో హర్యానా మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ప్రతి పౌరుడి తలసరి ఆదాయం 1.24 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.2.78 లక్షలకు చేరుకున్నదన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం రాష్ట్ర బడ్జెట్ రూ.62 వేలు కోట్లు కాగా, గతేడాది బడ్జెట్ రూ.1.24 లక్షల కోట్లకు చేరుకున్నట్లు తెలిపారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణలో సాకారమైందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు అభివృద్ధి దిశలో పయనిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సంసద్ ఆదర్శ గ్రామ యోజనలో ప్రకటించిన 20 అవార్డుల్లో 19 అవార్డులు తెలంగాణకు వచ్చినట్లు తెలిపారు. గాంధీతోపాటు ఎంతోమంది మహానుభావుల త్యాగాలతోనే దేశానికి స్వాతంత్య్రం సిద్ధ్దించినట్లు మంత్రి హరీశ్రావు చెప్పారు.
స్వాతంత్య్ర ఫలాలు పేదలకు దక్కాలంటే పేదలే ఎజెండాగా ప్రభుత్వాలు పని చేయాలన్నారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి పాల్గొన్నారు.