మెదక్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : ‘దశాబ్దాల కల ఈ రోజు నెరవేరింది.. 2004లో నేను ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి జడ్పీటీసీగా ఉన్న సమయంలో ఉమ్మడి మెదక్ జడ్పీ సమావేశంలో జరిగే ప్రతి సమావేశంలో రైల్వేలైన్ గురించి మాట్లాడేవా రం’. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో రేక్పాయింట్ను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, యాదవరెడ్డి, ఫారూక్హుస్సేన్, కలెక్టర్ హరీశ్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మెదక్ రైల్వే స్టేషన్కు గూడ్స్ రైలు రావడంతో పూజలు నిర్వహించి పూలు చల్లి స్వాగతం పలకారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ రేక్ పాయింట్ మెదక్ జిల్లావాసుల దశాబ్దాల పోరాటమని పేర్కొన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్తో సాధ్యం కాలేదని, ఎవరూ పట్టించుకోలేదని, మాటలు ఎక్కువ.. చేతలు తక్కువని ఎద్దేవా చేశారు.
మెదక్కు రైలు వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చు చేసిందన్నారు. గతంలో జిల్లాకు ఎరువులు రావాలంటే సనత్నగర్కు తెచ్చి.. అక్కడ నుంచి తెచ్చేవారని, లారీల సమస్య వల్ల అనేక సందర్భాల్లో ఎరువులు ఆలస్యంగా వచ్చేవని పేర్కొన్నారు. మెదక్కు రైల్వేరేక్ పాయింట్ వచ్చిం ది కాబట్టి భవిష్యత్తులో ఎరువులకు ఇబ్బందులు ఉండవని, అలాగే ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మెదక్ నుంచి యేటా సనత్నగర్ గోదాంలకు పంపించుకోవచ్చని తెలిపారు. మెదక్ జిల్లాలో పండించిన పంటలతో పాటు ఇతర ఉత్పత్తులను దేశంలో ఎక్కడికైనా గూడ్స్ రైలు ద్వారా పంపుకునే వీలుందన్నారు. మెదక్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావడంతో రోడ్లు చాలా ఆందంగా ఉన్నాయని, బటర్ఫ్లై లైట్లు, తాగునీటి సమస్య పరిష్కారమైందని తెలిపారు. జిల్లా ప్రజల కలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. ఘణాపూర్ కాలువ ఆధునీకరణ ద్వారా చివరి ఆయకట్టుకు నీరు వెళ్తున్నదని, సింగూరు జలాలు మెదక్ జిల్లాకే దక్కాలన్న నినాదాన్ని నిజం చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
పదవులకు రాజీనామా చేసి ఉద్యమాలు చేశాం..
‘బీజేపీ నాయకులు ఉపఎన్నిక తెస్తామంటున్నారు..ఎందుకు’? అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ‘పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమాలు చేశాం.. ఆ నాటి త్యాగాలే ఇప్పటి ఫలితాలు’.. అని అన్నారు. ఈ రాష్ర్టానికి ఏమైనా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తరా? లేక జాతీయ హోదా ఇస్తరా? అని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు చేసి త్యాగాలు చేసిన పార్టీ టీఆర్ఎస్ అని గుర్తు చేశారు. కేంద్ర సర్కారు ఉన్న ఐటీఆర్ను రద్దు చేసిందని, వరంగల్కు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని ఆరోపించారు. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులకు కోత పెట్టి ఉపాధి హామీ పథకాన్ని సైతం ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నదని, కూలీల పొట్టకొడుతున్న బీజేపీని ఎవరూ నమ్మరన్నారు. గ్యాస్ ధరలు పెంచిందని, సబ్సిడీ ఎత్తేసిందని, ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నదని రాష్ర్టానికి బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి మేం రాజీనామాలు చేశామని.. మీ రాజీనామాలు అధికారం, రాజకీయం కోసం చేశారన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ హేమలత, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఫారూక్హుస్సేన్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్రావు, ఆగ్రోస్ ఎండీ రాములు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, మెదక్ కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, మార్క్ఫెడ్ డీఎం బాలకృష్ణ, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి పరశురాంనాయక్, ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందింది..:వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
దశాబ్దాల రైల్వేలైన్ కలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను దృష్టిలో పెట్టుకొని మెదక్లో రేక్ పాయింట్ను ఏర్పాటు చేశాం. గూడ్స్రాకతో లక్షల టన్నుల ఎరువుల కోసం రేక్ పాయింట్ ఉపయోగపడుతుంది. దేశంలోనే రైతులకు ఎక్కువ పథకాలు అందిస్తున్న పార్టీ టీఆర్ఎస్. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు.తెలంగాణలో రైతులకు ఇచ్చే పథకాలను చూసి కర్ణాటక, మహారాష్ర్టాల్లో కొందరు ప్రజాప్రతినిధులు తమను తెలంగాణలో కలపమంటున్నారు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో ఫసల్బీమా ఎందుకు అమలు చేయడంలేదు. సమగ్ర వ్యవసాయ, బీమా పాలసీలను కేంద్రం ప్రకటించాలి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత కేంద్రానిదే.
సాయిచంద్ ఆటాపాటా..
రైల్వే స్టేషన్లో రేక్ పాయింట్ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర
గిడ్డంగుల సంస్థ చైర్మన్
సాయిచంద్ ఆటా పాటలతో సభికులను ఉర్రూతలూగించారు. జై తెలంగాణ..
జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ నృత్యాలు చేశారు. కళాకారుల డప్పు వాయిద్యాలతో సభా ప్రాంగణం దద్ధరిల్లింది. ఈ సందర్భంగా సభలో పాల్గొన్న యువకులు, వృద్ధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆడిపాడారు.
రైలు రానే వచ్చింది…
మెదక్లో ఈరోజు రైలు కూత వినిపిస్తుందంటే రైతులకు పండుగలా ఉంది. ఈ విషయంలో మంత్రు లు హరీశ్రావు, ని రంజన్రెడ్డి, ఎమ్మె ల్యే పద్మాదేవేందర్రెడ్డి ఎంతో కృషి చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుల ప్రత్యేక చొరవతోనే మెదక్కు రైల్వేలైన్ మంజూరైంది. మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ను మరింత పొడిగిస్తాం. రూ.18వేల కోట్లతో ముంబై వరకు డీపీఆర్ తయారైంది. వచ్చే బడ్జెట్లో జహీరాబాద్ నుంచి ముంబై వరకు కలుపుతాం.
– మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది
ఏండ్ల నాటి కల నెరవేరిం ది.. సీఎం కేసీఆర్ ఆశీస్సు లు, మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి, ఎంపీ ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల కృషితో మెదక్ ప్రజల సహాయ, సహకారాలతో మెదక్కు రై ల్వేలైన్ వచ్చింది. ఉద్యమం సమయంలో మెదక్కు రైలు కూత వినిపించాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేశా రు. అందుకనుగుణంగానే అక్కన్నపేట నుం చి మెదక్కు రైల్వేలైన్ను మంజూరు చేసి నిధు లు ఇచ్చారు. భూములిచ్చిన 900 మంది రైతులకు ధన్యవాదాలు. మెదక్కు గూడ్స్ రైలు రావడంతో మెదక్ ప్రజలతో పాటు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.
– మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
సీఎం కేసీఆర్ కృషితోనే రైలు
టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోంది. సీఎం కేసీఆర్ కృషితో మెదక్కు రైలు కూత వినిపిస్తోంది. ఇది ఎంతో సంతోషకరం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించి ఆచరణ చేసే ప్రభుత్వం. ఇందుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పథకాలే నిదర్శనం. మెదక్ పట్టణ ప్రజలకు రేక్పాయింట్ వరం. జిల్లా కావడం కూడా అదృష్టం. రైల్వే స్టేషన్లో రేక్ పాయింట్ను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది.
– నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి
గొప్ప సుదినం
మెదక్ ప్రజలు ఎన్నో ఏండ్లుగా కన్న కల నెరవేరింది. ఈ రోజు గొప్ప సుదినం. ఎన్నో ఉద్యమాల ఫలితం.. ఎంతో మంది కృషితో మెదక్కు రైల్వేలైన్ వచ్చింది. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద నిధులు మంజూరు చేశారు. అక్కన్నపేట-మెదక్ నుంచి మనోహరాబాద్ వరకు రైల్వేలైన్ను కలిపితే మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
– ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి