ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానకాలంలో పంటలను కాపాడుకునేందుకు వాతావరణ శాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. పంటల రక్షణ కోసం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.
-జహీరాబాద్, జూలై 30
వరి:
ఇప్పటివరకు నారుమళ్లు వేయకుంటే మరో 2-3 రోజులపాటు వేచిచూడాలి. లేదంటే భారీ వర్షాలకు విత్తనం కుళ్లిపోతుంది. మొలక శాతం తగ్గుతుంది.
ఇప్పటికే నారుమళ్లు వేసుకున్న చోట్ల మడిలో నీరు నిలువకుండా చూడాలి.
వెదజల్లే పద్ధతిలో విత్తుకున్న పొలాలు, మడుల్లో నిలిచిన నీటిని తొలిగించాలి.
చిన్న మొలకలు అధిక నీటి నిలువను తట్టుకోలేవు. ప్రస్తుతం కలుపుమందులు వాడకుండా ఉంటే మంచిది. అధిక వర్షాలతో మందు పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది.
మరో రెండు రోజుల్లో వాతావరణం మామూలు స్థితికి చేరుకుంటుందనే సూచనలు ఉన్నాయి. అప్పుడు సూచించిన మేరకు ఎరువులు, కలుపు మందులను వినియోగించాలి.
వర్షం తగ్గాక వరి నారుమళ్లు పండుబారి పేల వం గా ఉన్నచోట్ల పైపాటుగా యూరియా ఎకరాకు సరిపోయే నారుమడికి 1.5 కిలోలన నుంచి 2 కిలోలు వేయాలి. పిచికారీలో చిలేటెడ్ జింక్ 1గ్రా. లేదా జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మడి నుంచి నారు తీసేటప్పుడు వారం పది రో జుల ముందు తప్పనిసరిగా కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను ఎకరాలకు 800గ్రాములు వేయాలి.
పత్తి:
ప్రస్తుతం లేత దశలో ఉన్న పత్తి నిలువనీటిని తట్టుకోలేదు. మడులకు గండ్లు పెట్టి నీటిని తొలిగించాలి.
ఈ వానలకు కలుపు అధికంగా వచ్చి పంటతో పోటీ పడుతుంది. వర్షం తగ్గిన తర్వాత జాగ్రత్తలను పాటిస్తూ కేవలం కలుపు మొక్కల మీద పడే విధంగా డోమ్ అమర్చి ఫారాక్విట్ క్లోరైడ్ 5ఎంఎల్ లీటర్ నీటితో కలిపి పిచికారీ చేయా లి. తర్వాత దశలో ఫెరిథియోబాక్ సోడి యం, క్విజయోఫాప్ పీ ఇథైల్ కలయిక మందు ‘మాస్టర్ స్ట్రోక్’ 450ఎంఎల్ ఎకరాకు పిచికారీ చేసుకుంటే వెడల్పుటాకు, గడ్డిజాతి కలుపులను అదుపులో ఉంచవచ్చు. కంది అంతరపంటగా ఉంటే ఈ మందును వాడొద్దు.
వర్షాలు తగ్గిన తర్వాత బూస్టర్ డోస్గా ఎకరాకు 25-30కిలోల యూరియాను మొక్కల పక్కన వేయాలి.
పోషకలోపాని నివారించేందుకు 19-19-19 లీటరు నీటికి 7.5 గ్రా., ఫార్ములా-4ను 2 గ్రాము ల చొప్పున స్ప్రెడ్మాక్స్ ఒక ఎంఎల్ కలిపి పిచికారీ చేయాలి.
అక్కడక్కడా 3 లేదా 4 ఆకుల దశలోని పంటలో ఆకులపై రంధ్రాలు కనిపిస్తాయి. ఈ సమస్య ఉన్న పత్తి పంటల్లో క్లోరోఫెరిఫాస్ 20 ఈసీ 2.5ఎంఎల్ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి వాడాలి.
కాండానికి బొట్టుపెట్టే విధానాన్ని ఆచరిస్తూ 30 రోజుల దశలో ఉన్న పత్తిని ఆశించే రసం పీల్చే పురుగులను నియంత్రించవచ్చు. (ఒకపాలు మోనోక్రొటోఫాస్, నాలుగు పాళ్ల నీరు కలిపి లేత కాండం భాగములో ఒక అంగుళం మేర ఒక పక్క అంటిస్తే చాలు)
మొక్కజొన్న:
ఈ పైరులో కూడా నిలువ ఉన్న నీటిని తొలగించాలి.
వర్షం తగ్గిన పిదప బూస్టర్ మోతాదుగా 35 కిలోల యూరియా, 15 కిలోల మురియేట్ ఆఫ్ పొటాష్ వేయాలి.
జింక్, బోరాన్ లోపాలు స్పష్టం కనిపిస్తే.. బోరాన్ 2గ్రాములు చిలేటెడ్ జింక్ 1 గ్రాము చొప్పున 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
కూరగాయలు:
ఈ వర్షాలకు ఆకుమచ్చ, కాండం కుళ్లు తెగుళ్లు ఆశిస్తాయి. కాపర్ ఆక్సిక్లోరైడ్ 30గ్రాములు 10 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి.
పోషకలోప నివారణకు 13-0-45 లీటర్ నీటికి 10గ్రాములు, ఫార్ములా-4ను కలిపి పిచికారీ చేయాలి.