జూమ్ మీటింగ్కు ఆలస్యమవుతోంది. కొద్దిగా కూరగాయలు కోసిపెట్టండని అడిగితే భర్తకు కోపం వచ్చింది. నన్నే కూరగాయలు కొయ్యమంటావా.. నాకన్నా జీతం ఎక్కువగా సంపాదిస్తున్నావనే అహంతో నన్ను ఈ పనులు చేయమంటావా.. నాకు కూడా ఆఫీసు నుంచి మీటింగ్ ఉందంటూ భర్త ఈగోకు పోయి తిట్ల పురాణం అందుకున్నాడు. అంతే పదేండ్ల సంసారం జీవితంలో అలజడి రేగింది. పిల్లలను చూసినా వారి మనస్సు కరగడం లేదు. విడిపోవడాని సై అంటున్నారు.
పిల్లల స్కూల్కు సంబంధించిన పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు కావాలని భర్తను భార్య కోరింది. మొన్ననే కదా ఫీజు కట్టింది.. ఇప్పుడు సర్దుకోలేవా.. నేను ఒక్కడిని సంపాదించాలి. కొద్దిగా ఓపిక పట్టు.. తీసుకువస్తాను.. అని భర్త కొంచెం కోపంతో చెప్పాడు. చేతగానిది పెండ్లి ఎందుకు చేసుకున్నావు. పెండ్లి చేసుకున్నందుకు, పిల్లలను కన్నందుకు అది నీ బాధ్యత.. అంటూ భార్య ఘాటుగా సమాధానం ఇవ్వడంతో 22 ఏండ్ల పెండ్లి జీవితంలో కలకలం రేపింది.
ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆన్లైన్ క్లాసులంటూ నిత్యం ఫోన్తోనే ఎక్కువ సమయం గడుపుతున్నది. ఫోన్ను తీసుకున్నందుకు 11ఏండ్ల విద్యార్థిని తల్లిపై కేకలు పెట్టింది. తినమంటే తినకుండా అలిగింది. దీంతో ఆ తల్లి మనసుకు గాయమైంది.
కరోనా-లాక్డౌన్ సందర్భంలో నెలలు తరబడి ఇంట్లోనే ఉండడం, ఆ తర్వాత వర్క్ఫ్రం హోం పద్ధతి రావడంతో చాలామంది ఉద్యోగస్తులైన భార్యాభర్తలు 24/7 ఎదురెదురు పడ్డారు. అంతకు ముందు ఉద్యోగాలకు వెళ్లడంతో వారు చాలా తక్కువ గంటల పాటు ఇంట్లో ఫేస్ టూ ఫేస్గా ఉండేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య అన్యోన్యత బాగా ఉండేది. తాజాగా అధిక సమయంలో ఎదురు పడడం, ఇంట్లో పనిని షేర్ చేసుకోమనడం, వాట్సాప్ చాటింగ్లు, తదితర అంశాలకు సంబంధించిన వ్యవహారాలను కొత్తగా చూస్తుండడంతో విబేధాలు తలెత్తాయి.
దీనికి తోడు కరోనా దెబ్బతో ఒకరి ఉద్యోగం పోవడం, మరొకరి వేతనంలో కోత పడడం, అప్పటి వరకు అనుభవించిన విలాసవంతానికి ఇబ్బందులు ఎదురు కావడంతో చాలామంది ఉద్యోగులు, వ్యాపారు లే కాకుండా అనేక వర్గాల ప్రజల్లో అసహనం రేపి ఓపికను చంపేసింది. దీంతో ఈ కష్టాలు, సందర్భాలను అధిగమించలేక ప్రేమానురాగాలతో ఏండ్ల తరబడి సంసారాలు చేసిన వారు సైతం కొట్టుకునే స్థాయికి వచ్చారు. ఇద్దరిలో సమన్వయం కొరవడి వాటిని అధిగమిద్దామని ఆలోచించకుండా.. నీవెంత…నీవెంత అంటూ దూరమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ అసహనంతో మద్యానికి బానిసలై వ్యసనపరులుగా మారుస్తుండగా, మరికొందరు అనవసర గొడవలకు దిగి వారి పరిస్ధితిని మరింతగా దిగజార్చుకుంటున్నారు. వాహనం నడిపే సమయంలో తెలియకుండా కోపానికి గురై ఇతర వాహనదారులతో గొడవలకు దిగుతున్నారు.
సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): చిన్నచిన్న సంఘటనలు, ఇష్యూలతో ఇగోలకు పోయి కోపోద్రక్తులై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బంధాలను, అనుబంధాలను తెంపుకొంటున్నారు. అనేక ఇండ్లలో ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుని ఏండ్ల సంసార జీవితాన్ని తెంపేసుకునేందుకు సైతం వెనుకాడడం లేదు. దీనికోసం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పోలీసుస్టేషన్ల మెట్లు ఎక్కుతున్నారు. చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలతో విడిపోవడానికి ఇష్టపడుతున్నారు. మానసికంగా కుంగిపోవడమే కాకుండా అన్నివిధాలుగా చితికిపోతున్నారు. అనవసర మనోవేదనకు గురవుతున్నారు. మనస్సును కకావికలం చేసుకుంటున్నారు.
యాంగ్రీ మేనేజ్మెంట్తో కౌన్సెలింగ్
కరోనా తర్వాత మా దగ్గరకు వచ్చిన 1000 కేసుల్లో భార్యాభర్తల మధ్య అసహనం పెరిగిన విషయాన్ని గమనించాం. ఈ కాలంలో వారికి కలిగిన ఆర్థిక నష్టం, 24/7 కలిసి ఉండడంతో వారి ప్రవర్తనలో మార్పులపై అనవసర అపోహలను పెంచుకుని, ముఖ్యంగా ఉద్యోగులైన భార్యాభర్తల్లో కొట్లాటలు చాలా పెరిగాయి. ఆన్లైన్ క్లాసు లు, చదువులంటూ పిల్లలు ఫోన్లకు అత్తుకుపోవడం వారిలో కోపాన్ని విపరీతంగా పెంచేసేంది. ఈ అసహనానికి ఆన్లైన్లో జూదం, అశ్లీలం, మద్యం తోడవడంతో మనసులను కకావికలం చేసి నెగిటీవ్ ఆలోచనలను పెంచేసింది. ఊహజనిత ఆలోచనలతో మనసుకు గాయమైన వ్యక్తి విచిత్రంగా ఆలోచిస్తుండడంతో మానసిక ధైర్యం కోల్పోతున్నాడు. ఇలా ఇటీవల మా దగ్గరకు వచ్చిన దాదాపు వెయ్యి మందిని పరిశీలించినప్పు డు ఈ అంశాలు కనపడ్డాయి. వారికి 5 నుంచి 8 రౌండ్ల కౌన్సెలింగ్ ఇచ్చినా మార్పు కనపడడం లేదు. మేము ఇచ్చిన కౌన్సెలింగ్తో కేవలం 25 శాతం ఫలితాలను మాత్రమే సాధిం చాం. ఇంకా ప్రయత్నిస్తున్నాం
యాంగ్రీ మేనేజ్మెంట్ అంటే..
తన కోపమే తన శత్రువు అనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి.
అసలు మీరు ఎందుకు కోపాన్ని వ్యక్తం చేస్తున్నారో ఆలోచన చేయాలి.
అనవసర సందర్భాల్లో ఇంట్లో వారిని ఎందుకు దూషిస్తున్నారో ఆలోచించండి.
ఏండ్ల తరబడి సంసార జీవితంలో రాని గొడవలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో గుర్తిం చాలి.
నాలో ఎందుకు అసహనం పెరుగుతున్నది అనే కారణాలను ఎవరికి వారు పసిగట్టాలి.
వాస్తవం కాని ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఎందుకు మనస్సులో పెట్టుకోవాలి. వాటిని విడిచిపెట్టాలి.
పుట్టిన ప్రతి జీవికి చావు తప్పదు.
పుట్టినందుకు మీ బాధ్యతను నిర్వర్తించాలనే బాధ్యతతో వ్యవహరించాలి.
ఇన్నేండ్లు ధైర్యంగా ఉన్నాం. ఇప్పుడెందుకు భయం. ఆ భయాన్ని తొలిగించండి.
అసహనం, కోపం వచ్చినప్పుడు మీకు మీరు ప్రశ్నించుకోండి. ఈ ప్రపంచంలో మిమ్మల్ని మీరే సరిగా అర్థం చేసుకుంటారు.
కాబట్టి బయటి వారితో సంబంధం లేదు. మన నిర్ణయాన్ని ఇతరులు అమలు చేయరు.
మనమే పాటించాలి.