మెదక్ జిల్లా ప్రజలకు రైలు ప్రయాణ సౌకర్యంతో పాటు రైతులు, వ్యాపారులు, రైస్మిల్లర్ల కోసం గూడ్స్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం రేక్పాయింట్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. మరో నెలరోజుల్లో పనులు ప్రారంభించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గోదాముల నిర్మాణానికి సుమారు 30 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించగా, వీటి నిర్మాణాలను ప్రభుత్వం పౌరసరఫరాల శాఖకు అప్పగించింది. రేక్పాయింట్ పూర్తైతే జిల్లా నుంచి ప్రతి సంవత్సరం 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం చర్లపల్లి, సనత్నగర్కు తరలించే అవకాశం ఉంది. దశాబ్దాల కల నెరవేరుతుండడంతో ఇటు సాధారణ ప్రజలతో పాటు రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గూడ్స్ సేవలు వినియోగించుకుని పంటలు, సరుకులను అతి తక్కువ ఖర్చుతో ఎగుమతులు, దిగుమతులు చేసుకోవచ్చని, దళారుల బెడద తప్పుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ఓ వైపు మెదక్కు రైలు కూత వినిపిస్తున్న నేపథ్యంలో మరోవైపు ర్యాక్ పాయింట్ ఏర్పాటుతో జిల్లాలో రైతులు పండించిన ఉత్పత్తులను ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి, దిగుమతి సులభతరం కానున్నది. ఇప్పటికే సిద్దిపేట జిల్లా గజ్వేల్ రైల్వేస్టేషన్లో ర్యాక్ పాయింట్ ఏర్పాటు కాగా, మెదక్లో కూడా ర్యాక్ పాయింట్ ఏర్పాటుకు రైల్వేశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. మెదక్లో ర్యాక్ పాయింట్ పూర్తయితే మెదక్ జిల్లాలో రైతులు పండించిన పంటలు దేశంలో ఎక్కడైనా విక్రయించే అవకాశం ఉంటుంది. అక్కన్నపేట-మెదక్కు రూ.205 కోట్లతో 17.2 కిలోమీటర్ల పొడువున రైల్వేలైన్ నిర్మించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.102 కోట్లు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.70 కోట్లను వెచ్చించింది. అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ మార్గంలో మూడు స్టేషన్లను ఏర్పాటు చేశారు. రామాయంపేట మండలం లక్ష్మాపూర్, హవేళీఘణాపూర్ మండలం శమ్నాపూర్తో పాటు మెదక్లో రైల్వేస్టేషన్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ లైన్తో మెదక్ నుంచి అక్కన్నపేట, మిర్జాపల్లి మీదుగా సికింద్రాబాద్ రైల్వేలైన్కు అనుసంధానం కానున్నది.
మెదక్ జిల్లా ప్రజలకు ఓ వరం..
మెదక్ ర్యాక్ పాయింట్ జిల్లా ప్రజలకు ఓ వరం. ఇప్పటికే అక్కన్నపేట-మెదక్కు రైల్వేలైన్ ఏర్పాటు కావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో నెల రోజుల్లో సంబంధిత పనులు ప్రారంభం కానుండగా, త్వరలో రైలు కూత కూడా పెట్టనున్నది. ఈ ప్రాంతంలో పండించిన పంటలు దళారులను ఆశ్రయించకుండా నేరుగా రైతు స్వయంగా విక్రయించి లాభాలు పొందవచ్చు. అంతేకాదు ఈ ప్రాంతానికి చెందిన వ్యాపారులు వస్తువులు అతి తక్కువ ఖర్చుతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడానికి వీలు ఉంటుంది. మెదక్ జిల్లా నుంచి ప్రతి సంవత్సరం 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం చర్లపల్లి, సనత్నగర్లకు తరలించుకోవచ్చు.
ఏటా ధాన్యం తరలింపు..
మెదక్లో ర్యాక్ పాయింట్ ఏర్పాటు వల్ల రైస్ మిల్లర్లకు, ఎరువులు, రసాయనాలు, స్టీల్ ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ వారికి, పత్తి ఎగుమతి వారికి ఎంతో అనుకూలం. త్వరలో మెదక్లో ర్యాక్ పాయింట్ ఏర్పాటు చేయనున్నారు. తద్వారా లోడింగ్, అన్లోడింగ్ వారికి కూడా ఉపాధి లభించనున్నది. ఇదిలావుండగా, మెదక్లో గోదాముల నిర్మాణానికి సుమారు 30 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. ఈ గోదాముల నిర్మాణానికి పౌర సరఫరాలశాఖకు అప్పగించనున్నారు. దీంతో రైస్మిల్లర్లకు, రైతులకు, పారిశ్రామిక వేత్తలకు ఎంతో ఉపయోగపడనున్నది.
త్వరలోనే ర్యాక్ పాయింట్ పనులు
– పద్మాదేవేందర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే
నెల రోజుల్లో మెదక్లో ర్యాక్ పాయింట్ పనులు ప్రారంభిస్తాం. ఇప్పటికే మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ నిర్మాణం పూర్తయింది. త్వరలో మెదక్కు రైలు కూత వినిపించనున్నది. మెదక్, గజ్వేల్ ఎరువుల దిగుమతికి ప్రత్యేక గూడ్స్ రైలు వేయాలని కేంద్ర రైల్వేశాఖకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఇటీవల విజ్ఞప్తి చేయగా, వెంటనే మెదక్తో పాటు గజ్వేల్కు రైల్వేస్టేషన్లకు ర్యాక్ పాయింట్లు మంజూరయ్యాయి. మెదక్లో ర్యాక్ పాయింట్ ఏర్పాటైతే ఈ ప్రాంతంలో రైతులు పండించిన పంటలు ఇతర దేశాలకు తరలించవచ్చు. ఇప్పటికే మెదక్ అభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తూ మరోవైపు అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్ పూర్తి చేశామని, ఇప్పుడు ర్యాక్ పాయింట్తో మెదక్ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోనున్నది.