తూప్రాన్ రూరల్, మే 19: తూప్రాన్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయించాలని, త్వరలో పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు జరుపుకునేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ మోహన్, మార్కెటింగ్ శాఖ డీఈ మాధవరెడ్డితో కలిసి బుధవారం ఆయన పట్టణంలో పర్యటించారు. రూ.10.30 కోట్లతో జరుగుతున్న సమీకృత మార్కెట్, రూ.2 కోట్లతో నిర్మిస్తున్న నూతన మున్సిపల్ భవన నిర్మాణం, వైకుంఠధామం, పట్టణ శివారులోని అల్లాపూర్ టోల్ప్లాజా వద్ద రూ.1.60 కోట్లతో నిర్మాణం జరుగుతున్న రైతు మార్కెట్, రూ.2.50 కోట్లతో నిర్మిస్తున్న గ్రేన్ (ధాన్యం), వేసైడ్ మార్కెట్ యార్డు నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించడానికి కారణాలను వారి నుంచి అడిగి తెసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తూప్రాన్ పట్టణంలో అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన, శరవేగంగా కొనసాగించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనులు ముగింపు దశలో ఉన్నందున వాటిని త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైకుంఠధామ నిర్మాణం పనులు నత్తనడకగా జరుగుతున్నందున దీనిపై అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో తప్పకుండా నాణ్యత పాటించి, ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో పీఆర్ ఈఈ రామచంద్రారెడ్డి, డీఈ నర్సింహులు, ఏఈ ప్రసాద్, మార్కెటింగ్ శాఖాధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.