అంబానీ, అదానీలకు దేశసంపదను దోచిపెడుతూ కార్పొరేట్ శక్తుల చేతుల్లో ప్రధాని మోదీ కీలుబొమ్మగా మారారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేశారన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని, నల్ల చట్టాలను తీసుకొచ్చి 700మంది అన్నదాతల ప్రాణాలు తీశారని మండిపడ్డారు. తెలంగాణ ధాన్యాన్ని కొనకపోగా, నూకలు తినండంటూ యావత్ తెలంగాణను కేంద్ర మంత్రి పీయూష్గోయల్ కించపరిచారని అన్నారు. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.80కి పడిపోవడం మోదీ పాలనకు నిదర్శనమన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు.
– తూప్రాన్, జూలై 12
తూప్రాన్, జూలై 12: కార్పొరేట్ శక్తుల చేతుల్లో నరేంద్రమోదీ ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందని, దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచి పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నదని రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్(ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తానని చెప్పి తేకుండా దేశ ప్రజలను మోదీ మోసం చేస్తున్నాడని విమర్శించారు.
బ్యాంకులకు వేల కోట్ల రూపాయల కుచ్చుటోపీ పెట్టిన ఆర్థిక నేరగాళ్లు దేశం దాటి పోతున్నా గుడ్లప్పగించి చూడడం తప్ప మోదీ ప్రభుత్వం చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. మోదీ హయాంలో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని, తిరోగమనం దిశగా దేశం పయనిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి కార్పొరేట్ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ప్రధాని హోదాలో ఇతర దేశాల ప్రతినిధులను ఒత్తిడికి గురిచేయడం సిగ్గుచేటన్నారు. నోట్ల రద్దు గొప్ప నిర్ణయమే అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ జీడీపీ వృద్ధ్దిరేటు ఎందుకు తగ్గిందో మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎనిమిదేండ్లుగా కేంద్ర సర్కారు ఎక్సైజ్ సుంకం పెట్రోల్పై 247, డీజిల్పై 793, వంట గ్యాస్పై 170 శాతం పెంచి సామన్యుడి నడ్డి విరిచిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు తగ్గుతుంటే, దేశంలో మాత్రం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఎందుకు పైపైకి పోతున్నాయని ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్లపై పేద, మధ్యతరగతి తరగతి ప్రజలకిచ్చే సబ్సిడీని సైతం ఎత్తేశారన్నారు. సీఎం కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక మోదీ తోకముడిచి పారిపోయాడని ఎద్దేవా చేశారు.
కేంద్ర సర్కారు రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి 700 మంది రైతుల ఉసురుతీసిందన్నారు. తెలంగాణ ధాన్యం కొనకుండా ఇబ్బందులకు గురిచేసిన కేంద్ర సర్కారుకు గుణపాఠం తప్పదన్నారు. ‘అగ్నిపథ్’ ప్రవేశపెట్టి సైనికుల్లో అభద్రతను పెంచి, వారి మనోధైర్యాన్ని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. ప్రభుత్వాలను కూల్చడం మీద ఉన్న శ్రద్ధ, ప్రజా సంక్షేమంపై నరేంద్రమోదీ సర్కారుకు లేదన్నారు. బీజేపీ పాలనలో దేశం గ్రాఫ్ అన్ని విధాలుగా దిగజారిందన్నారు.
దళితబంధు, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సంక్షేమ పాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని చెప్పారు. తెలంగాణ అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శంగా మారిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు దేశానికి ఒరగబెట్టిందేమీ లేదని, రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వాలతో టీఆర్ఎస్ అజేయశక్తిగా అవతరించిందని, మరో 20 ఏండ్లు టీఆర్ఎస్కు ఢోకాలేదన్నారు. సమావేశంలో సర్పంచుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్కుల మహిపాల్రెడ్డి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి కొడిప్యాక నారాయణ గుప్తా ఉన్నారు.