సిద్దిపేట, జూలై 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు, వాగు లు, వంకలకు జలకళ సంతరించుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరో రెండు రోజులపాలు భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు వర్షాలపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్లో పలు సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు.
జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, జడ్పీ చైర్ పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు ప్రశాంత్జీవన్ పాటిల్, హరీశ్, శరత్, జిల్లా అడిషనల్ కలెక్టర్లు జిల్లా వాతవారణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపడుతున్నారు. వాతవారణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
ప్రధానంగా నీటి పారుదల శాఖ అధికారులు, మున్సిపల్, రెవెన్యూ, వైద్యారోగ్య, పోలీస్ తదితరశాఖల అధికారులు ఫీల్డ్లో ఉండి ఎప్పటికప్పుడు సమచారాన్ని జిల్లా కేంద్రానికి చేరవేస్తున్నారు. ఆయా జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేకంగా సెల్ను ఏర్పాటు చేసి వర్షాలపై వివరాలు సేకరిస్తున్నారు. కూలి పోయే ఇండ్లలో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నాలా ల్లో పేరుకుపోయిన మట్టిని ఎప్పటికప్పుడు తీసి వర్షపు నీరు సాఫీగా వెళ్లేటట్లు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అవసరమైన చోట ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యసిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది.
నిండుతున్న జలాశయాలు
ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద వస్తున్నది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి నీరు భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో ఆ ప్రాజెక్టులోకి నిటిమట్టం పెరుగుతున్నది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ఇప్పటి వరకు 20.584 టీఎంసీల నీరు ఉంది. మంగళవారం ఇన్ ఫ్లో 5,955 క్యూసెక్కుల నీరు వచ్చింది. ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటున్నది. దీంతో పాటు సంగారెడ్డి జిల్లాలోని ప్రధాన వాగులకు నీరు వచ్చి చేరుతుండడంతో కొన్ని పొంగి పొర్లుతున్నాయి. జహీరాబాద్ మండలంలోని కొత్తూరులో ఉన్న నారింజ ప్రాజెక్టు, అక్కడ ఉన్న ప్రధాన చెరువులకు వాగులకు నీరు వచ్చి చేరుతున్నది.
నారాయణ్ఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతున్నది. ఈ జిల్లాలోని చెరువులకు, చెక్డ్యాంలకు నీళ్లు వచ్చి చేరుతున్నాయి. మెదక్ జిల్లాలోని హవేళీఘనపూర్ మండలంలోని పోచారం ప్రాజెక్టు, పాపన్నపేట మండలంలోని వనదుర్గా ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలోని చెరువులకు భారీగా నీళ్లు వచ్చి చేరుతుండగా మరి కొన్ని చెరువులు అలుగులు పారుతున్నాయి. ప్రధాన చెక్డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. సిద్దిపేట జిల్లాలోని ప్రధాన వాగులైన కూడవెళ్లివాగు, హల్దీవాగులపై నిర్మించిన చెక్ డ్యాంలు కొన్ని పొంగి పొర్లుతున్నాయి.
మరికొన్ని చెక్ డ్యాంలకు భారీగా నీరు వచ్చి చేరుతున్నది. మంగళవారం కురిసిన వర్షానికి ఈ ప్రధాన వాగులతో పాటుగా జిల్లాలోని చెరువులు, చెక్డ్యాంలకు భారీగా నీరు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి. అక్కడడక్కడ చెరువులు పొంగిపొర్లుతున్నా యి. పెద్దవాగు (మోయతుమ్మెద వాగు) కు నీరు వచ్చి చేరుతుండగా, సిద్దిపేట వాగుపై నిర్మించిన చెక్డ్యాంలకు నీరు వస్తుంది. ఇలా జిల్లాలోని ప్రధాన చెరువులకు నీళ్లు రావడంతో అధికార యంత్రాంగ పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది.