వంట గ్యాస్ ధరల పెంపుపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు తెలిపారు. ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో డీసీఎంఎస్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు ప్రధానీ మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ తీసి, రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. సంగారెడ్డిలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నారాయణఖేడ్లో రాజీవ్చౌక్ వద్ద ధర్నాలో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పాల్గొన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, టీఆర్ఎస్ నాయకులు ఆర్అండ్బీ అతిథి గృహం ఎదుట నిరసన తెలిపారు.
సంగారెడ్డి అర్బన్, జూలై 7: రానున్న రోజుల్లో మోదీ ప్రభుత్వాన్ని బొందపెట్టడం ఖాయమని సంగారెడ్డి మాజీ మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నాడని విమర్శించారు. పెంచిన గ్యాస్ ధరలను వ్యతిరేకిస్తూ గురువారం సంగారెడ్డి పాత బస్టాండ్ ఎదుట టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రాస్తారోకో, ధర్నా చేశారు. సంగారెడ్డిలోని డీసీఎంఎస్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. మహిళలు ప్రధాన రహదారిపై కట్టెల పొయ్యితో వంటా వార్పు చేశారు.
పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చింతా ప్రభాకర్ చేశారు. బడా బాబులకు ఊడిగం చేస్తున్న ప్రధాని గొప్పలు చెప్పుకోవడం తప్పా ప్రజలకు చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిల్వేరి ప్రభాకర్, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణాగౌడ్, మాజీ జడ్పీటీసీ మనోహర్గౌడ్, కంది మండల జెడ్పీటీసీ కొండల్రెడ్డి, టీఆర్ఎస్ సంగారెడ్డి, కంది మండలాల అధ్యక్షులు చక్రపాణి, మధుసూదన్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జయరాజు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలను నిరసిస్తూ సంగారెడ్డిలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. వంట గ్యాస్ ధర రూ.400 నుంచి రూ.1100లకు పెంచిన పాపం మోదీ ప్రభుత్వానిదేనని జయరాజు విమర్శించారు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తానని అధికారంలోకి వచ్చిన 8ఏండ్లలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచారని మండిపడ్డారు. అంబానీ, అదానీలకు రాయితీలు ఇస్తూ సామాన్యుల జేబులు ఖాళీ చేయడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో నాయకులు మాణిక్యం, నర్సింహరెడ్డి, ప్రవీణ్, పాండురంగారెడ్డి, నాగేశ్వర్రావు, బాబురావు, నాగభూషణం, రాజిరెడ్డి, మల్లేశ్, నర్సింహులు, దత్తు, సాయిలు పాల్గొన్నారు.
నారాయణఖేడ్లో..
నారాయణఖేడ్, జూలై7: కేంద్రంలోని బీజేపీ పాలనలో ప్రజలకు పస్తులుండే గతి పట్టిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ధ్వజమెత్తారు. పెంచిన వంటగ్యాస్ ధరలకు వ్యతిరేకంగా నారాయణఖేడ్లోని రాజీవ్చౌక్ వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ హయాంలో వంట గ్యాస్ ధర రూ.400లు ఉండగా మోదీ అధికారం చేపట్టిన ఎనిమిదేండ్లలో రూ.1105లకు పెంచారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడికి అందని స్థాయిలో పెరిగిపోయాయన్నారు.
నల్లచట్టాలు తెచ్చి రైతుల నడ్డివిరిచే ప్రయత్నం చేసిన మోదీ ప్రభుత్వ కుట్రను వీరోచితంగా పోరాడి అన్నదాతలు అడ్డుకున్నారన్నారు. రాష్ట్రంలో ధాన్యం విషయంలోనూ మోసపూరిత విధానాలతో రైతులను నష్టపరిచే చర్యలను సహించబోమని, రైతులను ఆదుకునే దిశగా కేసీఆర్ ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.
కేంద్రం డీజిల్ను ఆర్టీసీకి రూ.5లు ఎక్కువకు ఇస్తూ ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నదన్నారు. ఏ ఒక్క వర్గానికి మేలు చేయని ప్రజాకంటక పాలనను సాగిస్తున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పరమేశ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సత్యపాల్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ విజయ్ బుజ్జి, మున్సిపల్ వైస్ చైర్మన్ పరశురామ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేశ్, నాయకులు ప్రభాకర్, రవీందర్నాయక్, రమేశ్చౌహాన్, అభిషేక్శెట్కార్ పాల్గొన్నారు.
సదాశివపేటలో..
సదాశివపేట, జూలై 7: గ్యాస్ ధరలకు నిరసనగా సదాశివపేట మండలంలోని టీఆర్ఎస్ నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. డౌన్ డౌన్ బీజేపీ హఠావో దేశ్కో బచావో అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్తగొల్ల ఆంజనేయులు, కార్యదర్శి అరిఫోద్దిన్, ఎంపీటీసీలు సత్యనారాయణ, సుధాకర్, సంతోష్, సొసైటీ చైర్మన్ రత్నాకర్డ్డ్రి, వైస్ చైర్మన్ పాండునాయక్, సర్పంచ్లు నవీన్, హన్మంతరెడ్డి, రమేశ్, అశోక్, శేఖర్, సలావోద్దిన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్లో..
జహీరాబాద్, జూలై 7: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలండర్ ధరలను వెంటనే తగ్గించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు డిమాండ్ చేశారు. జహీరాబాద్ ఆర్అండ్బీ గృహం ఎదుట ప్రధాన రోడ్డుపై గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యలపై భారం వేసిందన్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు భారీగా పెరిగాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దేశంలో ఉన్న కంపెనీలు, ఎల్ఐసీని ప్రైవేట్ పరం చేసిందన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ మం డల, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు ఎంజీ. రాములు, సయ్యద్ మోహినోద్దీన్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
కోహీర్లో..
కోహీర్, జూలై7: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా కోహీర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మండల టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ధరలు పెంచుతూ పోతే ఎలా బతకాలి: రాహుల్కిరణ్
అందోల్, జూలై7: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్తో పాటు నిత్యావసర సరుకుల ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డివిరుస్తున్నదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చంటి రాహుల్ కిరణ్ అన్నారు. ధరలు పెంచుతూ పోతే సామాన్యులు ఎలా బతకాలని ప్రశ్నించారు. గ్యాస్, ఇతర ధరల పెరుగుదలకు నిరసనగా జోగిపేటలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రధాన రహదారిపై కట్టెలపొయ్యిపై వంట చేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్, ఏఎంసీ మాజీ చైర్మన్లు నారాయణ, నాగభూషణం, నాయకులు లింగాగౌడ్, శివశేఖర్, సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్కు మోడి వచ్చే గ్యాస్ ధరలు పెంచి పాయే
ఝరాసంగం, జూలై7: మూడు రోజుల క్రితం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన ప్రధాని మోదీ గ్యాస్ సిలిండర్ల ధర పెంచడానికి వచ్చాడని టీఆర్ఎస్ అధ్యక్షుడు రాచయ్యస్వామి ఆరోపించారు. ఝరాసంగంలోని ప్రధాన రోడ్డుపై రాస్తారోకో చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను మోదీ ప్రభుత్వం కాపీ కొడుతున్నదన్నారు. తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సోయి తెచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొగ్గుల జగదీశ్వర్, మేదపల్లి సర్పంచ్ పరమేశ్వర్, సొసైటీ చైర్మన్ గౌసోద్దీన్, నాయకులు ప్రవీణ్పటేల్, బసిరెడ్డి పాల్గొన్నారు.