పర్యావరణానికి పెనుభూతంగా మారిన, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ అమ్మకుండా, కొనుగోలు చేయకుండా, వినియోగించకుండా నిషేధం అమలు కానుంది. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇది అమలులోకి రానున్నది. నిబంధనలు అతిక్రమించిన వ్యాపారులకు భారీ జరిమానా విధించనున్నారు. అంతేకాకుండా వాడి పారేసిన వారికి సైతం జరిమానా వేస్తారు. దీని కోసం టాస్క్ఫోర్స్ కమిటీలు పని చేస్తాయి. నేటి నుంచి 16 రకాల వస్తువులు నిషేధిత జాబితాలోకి వెళ్లనున్నాయి. ప్రత్యామ్నాయంగా క్లాత్, పేపర్, జ్యూట్ వస్తువులను వినియోగించేలా చైతన్యపరుస్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు.
సదాశివపేట/మెదక్ మున్సిపాలిటీ, జూన్ 30 : ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రధ్ధ తీసుకుంటున్నాయి. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ వాడకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ కమిషనర్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ (సీడీఎంఏ) ఇదివరకే మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ సైతం 571(బీ) జీవోను గతేడాది జారీచేసింది. నిబంధనలు అతిక్రమించిన వ్యాపారులకు భారీ జరిమానా విధించాలని ఉత్తర్వులో పేర్కొన్నది.
ఇందుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్లకు అధికారాలను సైతం ప్రభుత్వం కట్టబెట్టింది. ప్లాస్టిక్ కవర్లతో పాటు క్యారీ బ్యాగులు, డిస్పోజల్ గ్లాసులు, ప్లేట్లు అమ్మకాలు చేయవద్దని ఈపాటికే మున్సిపల్ కమిషనర్లు వ్యాపారులకు ఆదేశాలు జారీచేశారు. ఆదేశాలను పక్కనపెట్టి ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే జరిమానాలు విధించనున్నారు. జూలై ఒకటో తేదీ (నేటినుంచి) ఒకసారి వాడి పరేసే పల్చటి(120 మైక్రాన్ల కంటే తక్కువ మందం) ప్లాస్టిక్ను నిషేధాన్ని అన్ని మున్సిపాలిటీల్లో అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ ఈనెల 23న మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. సరఫరా, విక్రయం, వినియోగంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణే లక్ష్యం..
రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ప్లాస్టిక్ కవర్లకు బదులు బట్టల బ్యాగుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నది. అన్ని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, పటాన్చెరు, సదాశివపేట, అమీన్పూర్, బొల్లారం, తెల్లాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్ జిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.
ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషిచేద్దాం..
ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధ్దులు కావాలి. ఒకేసారి ఉపయోగించి పారవేసే తక్కువ మందం గల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో ప్రత్యామ్నాయంగా జ్యూట్, కాటన్, నాన్ ఓపెన్ ఫ్య్రాబ్రిక్ బ్యాగులు వాడాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధిస్తూ ఫ్రీ జోన్లుగా ప్రకటించాలి. విద్యాసంస్థలు, దవాఖానలు, అన్ని ప్రార్థనా స్థలాలు, బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు తదితర ప్రాంతాల్లో ప్లాస్టిక్ క్యారీబ్యాగుల వినియోగాన్ని తగ్గించి, వాటి వాడకంతో అనర్ధాలపై ప్రజల్లో అవగాహన కలిగించాలి. ఈ విషయంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి
-ప్రతిమాసింగ్, మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్
16 రకాల వస్తువులపై నిషేధం..
నేటి నుంచి 16రకాల వస్తువులను నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ఇందులో ఇయర్బడ్స్, బుడగలు, క్యాండీ, ప్లాస్టిక్ పుల్లలు, పేపర్ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్లు, చెంచాలు, కత్తులు, ట్రేలు, ప్లాస్టిక్ స్వీట్ బాక్సులు, సిగిరేట్ ప్యాకెట్స్, 100మైక్రాన్లలోపు ఉండే పీవీసీ బ్యానర్లు, ప్లాస్టిక్ బ్యాటిల్స్, అలంకరణ కోసం వాడే థర్మాకోల్ను వినియోగించడాన్ని నిషేధించారు.
అమ్మడమే కాదు…వాడిపారేసినా జరిమానా తప్పదు..
ఇన్నాళ్లు ప్లాస్టిక్ అమ్మేవారికే జరిమానాలు విధిస్తున్న అధికారులు, ఇకపై వాడి పారేసే వారికి సైతం జరిమానాలు విధించనున్నారు. ఇందులో మొదటి సారి సింగిల్యూజ్ ప్లాస్టిక్ వస్తువులను విక్రయించే వారికి రూ.2500 , రెండో ధపా రూ.5000 వరకు జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఇలాంటి వస్తువులను వాడిపారేసే వారికి సైతం రూ.250 నుంచి రూ.500 వరకు జరిమానాలు విధించాలని నిర్ణయించారు.
అవార్డులు సైతం..
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్లో పనిచేసే వారికి అవార్డులను సైతం ఇవ్వనున్నారు. ఈనెల నుంచి ప్రారంభమమ్యే ఈ కార్యక్రమంలో మంచిగా పనిచేసే వారికి ఆగస్టు 1న అవార్డును సైతం ఇవ్వనున్నారు. ప్రతినెలా డిసెంబర్ వరకు అవార్డుల ప్రదాన కార్యక్రమం కొనసాగనున్నది.
ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు ఇలా..
నిషేధంపై విస్తృత ప్రచారం..
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం.పల్చటి ప్లాస్టిక్ను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జూలై 1 నుంచి పల్చటి ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి రానున్నది. మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ నిషేధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దుకాణాల యజమానులు, ప్రజలకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తున్నాం. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ను వాడితే జరిమానాలు విధిస్తాం.
– కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ సదాశివపేట
టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేస్తాం..
మున్సిపాలిటీల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం నిమిత్తం టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. శానిటరీ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్, స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులతో కమిటీలు ఏర్పాటు చేస్తాం. కమిటీలకు వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడంతో పాటు వారంలో రెండు, మూడుసార్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడతాం. అతిక్రమణదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
-శ్రీహరి, మెదక్ మున్సిపల్ కమిషనర్