మెదక్, జూలై 3 : సమస్త ప్రాణకోటికి ఊపిరినిచ్చేది మొక్కలు. మెదక్ జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడానికి పజలందరూ అడుగులు కదుపుతున్నారు. ఈ మహోద్యమంలో అందరినీ భాగస్వాములు చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఏడాది మొక్కల ప్రణాళికపై మెదక్ కలెక్టర్ హరీశ్ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు..
సీఎం కేసీఆర్ మొక్కల పెంపకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దానికి తగ్గట్టుగానే మెదక్ జిల్లాలో మొక్కల పెంపకానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశాం. డీఆర్డీవో శాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా 24 లక్షల మొక్కలు నాటేందుకు ముందుకెళ్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నాం.
మెదక్ జిల్లాలో 54 లక్షల మొక్కల పెంపకం..
మెదక్ జిల్లాలో 469 పంచాయతీలోని నర్సరీల్లో 54 లక్షల మొక్కలను పెంచుతున్నాం. ఏడో విడుత హరితహారంలో జిల్లాలో 35 లక్షల లక్ష్యం పెట్టుకున్నాం. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 24 లక్షల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకోగా, మిగతా మొక్కలను ఆయా శాఖలకు కేటాయించాం. జిల్లాలో జాతీయ రహదారులపై రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాం. జాతీయ రహదారులైన మనోహరాబాద్, కాళ్లకల్తో పాటు తూప్రాన్, చేగుంట, రామాయంపేట లాంటి రహదారులను ఎంచుకున్నాం.
అందరినీ భాగస్వాములను చేస్తాం..
గతేడాది పంచాయతీలకు సంబంధించి రోడ్లకు ఇరువైపులా (ఎవెన్యూ ప్లాంటేషన్)గా పూర్తిచేశాం. ఈ ఏడాది పంచాయతీల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. మెదక్ జిల్లాలోని 469 పంచాయతీల్లోనూ సర్పంచులు, క్షేత్ర సహాయకులు, ఏపీవోలు అందరినీ భాగస్వాములను చేస్తాం. డీఆర్డీవో శాఖ ఆధ్వర్యంలో 24 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకున్నాం. వ్యవసాయ శాఖ 25 వేలు, అటవీ శాఖ 4లక్షలు, ఇరిగేషన్ 25 వేలు, విద్యాశాఖ 20 వేలు, పరిశ్రమల శాఖ 30 వేలు, మార్కెటింగ్ శాఖ 5 వేలు, మైనింగ్ శాఖ 30 వేలు, ఎక్సైజ్ శాఖ 30 వేలు, పశువైద్య శాఖ 30 వేలు, పోలీసు శాఖ 10 వేల మొక్కలను నాటించబోతున్నాం. అందరి భాగస్వామ్యంతో ఏడో విడుత హరితహారాన్ని విజయవంతం చేస్తాం.
మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి..
జిల్లాలోని మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెడుతాం. మున్సిపాలిటీల్లో హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. ఇప్పటికే మున్సిపాలిటీల్లో పెద్దఎత్తున హరితహారంలో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలి. మున్సిపాలిటీల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేలా చూస్తాం. గతేడాది నాటిన మొక్కలు ఎండిపోవడంతో వాటి స్థానంలో మొక్కలు నాటుతాం. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి హరితహారంలో అందరినీ భాగస్వాములు చేయాలి.