శివ్వంపేట, జూలై 20: చుట్టూ దట్టమైన అడవి.. పచ్చని చెట్లతో భక్తుల పరవశింపజేస్తూ ఆహ్లాదానికి నిలయంగా మా రింది చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి దేవాలయం. శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల పంచాయతీలో సంగారెడ్డి-గజ్వేల్ ప్రధానరోడ్డు పక్కన వెలిసి భక్తుల కొంగుబంగా రంగా విరాజిల్లుతున్నది. తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. శని, మంగళవారాల్లో భక్తులు వందల సంఖ్యలో తరలివచ్చి స్వామి వారి కి ప్రత్యేక పూజలు చేసి సత్యనారాయణ వ్రతాలు ఆచారిస్తా రు. ఆలయ ఫౌండర్ చైర్మన్ భాస్కరరాయిని ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో స్వామివారికి రోజూ పూజలు జరుగుతాయి.
ఆలయ నిర్మాణంతో కొత్త శోభ
అడవిలో వెలసిన ఆంజనేయస్వామికి 2000 సంవత్సరంలో నూతన ఆలయ నిర్మాణం చేపట్టారు. వాస్తు నియమాలతో ఒకే కొలతలతో చతురస్రాకారంలో నిర్మించారు. దీంతో పాటు పక్కనే సత్యనారాయణస్వామి వ్రత మండపాన్ని నిర్మించడంతో ఈ ప్రాంతానికి కొత్తశోభ సంతరించుకుంది. భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆలయాన్ని 2005లో దేవాదాయశాఖలో కలిపింది.
వ్రత మండపానికి ప్రత్యేకత
భక్తులకు సత్యనారాయణస్వామి పూజా ఫలితం పొంద డం కోసం సత్యనారాయణస్వామి వ్రతంలోని ఒక శ్లోకం ఆధారంగా 24రెక్కలతో ఒక వజ్రపుష్పం అకారంలో సత్యనారాయణస్వామి వ్రత మండపాన్ని నిర్మించారు. ఈ మండపంలో 11అడుగుల సత్యనారాయణస్వామి విగ్రహంతో పాటు విఘ్నేశ్వరుడు, సాయిబాబా, సరస్వతీ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రతి శని, మంగళవారాలతో పాటు మిగతా రోజుల్లో భక్తులు ఆంజనేయస్వామిని దర్శించుకొని సత్యనారాయణస్వామి వ్రతాలు చేస్తారు.
భక్తులకు నిత్యాన్నదానం
చాకరిమెట్ల ఆంజనేయస్వామి వారి దర్శనం చేసుకున్న భక్తులకు ప్రతిరోజు దాతల సహకారంతో దేవాలయ ప్రాంగణంలో సీతమ్మ అన్నదాన సత్రంలో నిత్యన్నదానం చేస్తారు. ప్రతిరోజు అన్నదానం చేయడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ చరిత్ర
ఔషధమొక్కలు కలిగి ఉన్న ఈ అటవీ ప్రాంతానికి చాకరి మెట్ల అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న గుట్ట ప్రాంతంలో సంవత్సరమంతా కొలనులా నీరు పారేది. దీంతో రుషులు తపస్సు చేస్తూ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఆ కొలను నీటితోనే అభిషేకాలు, పూజలు చేశారని చెబుతారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన భాస్కరరాయిని సీతారామశర్మ విగ్రహాన్ని గుర్తించి 41రోజులు రాత్రింబవళ్లు మండలదీక్ష చేసి విగ్రహానికి పూజలు చేసి పునశ్చరణ జరిపి ప్రసిద్ధిలోకి తెచ్చారు. తరువాత శివ్వంపేటకు చెందిన అనంతరామ శర్మ, విశ్వనాథశాస్త్రి అనే బ్రాహ్మణ సోదరులతో సీతారామశర్మ కలిసి నిత్య దూపదీప నైవేద్యాలు సమర్పించి పూజలు చేయ డం ప్రారంభించారు. వేద బ్రాహ్మణుల తపశ్శక్తితో భక్తులకు సహకరించే భగవంతునిగా సహకార ఆంజనేయస్వామి అనే పేరు స్థిరపడిందని భక్తుల నమ్మకం.
భక్తుల కోరికలు తీరేలా నిత్య పూజలు
ఇక్కడ సత్యనారాయణస్వామి వ్రతాలు జరగటం గొప్ప విశేషం. దీని వల్ల దేవస్థానానికి వచ్చి మొక్కుకున్న భక్తులకు ఇష్టకోరికలు తీరేలా నిత్యపూజలు జరుగుతాయి. కాళ్లకల్కు చెందిన దశరథరెడ్డి అనే దాత సహకారంతో సీతారాముల నూతన దేవాలయం నిర్మిస్తున్నామని ఫాల్గుణ మాసంలో ప్రతిష్ఠ చేస్తాము. పక్కనే 111అడుగుల ఆంజనేయస్వామి విగ్రహ ఏర్పాటుకు త్వరలోనే చేపడుతాము.
– ఆంజనేయశర్మ, దేవాలయ ఫౌండర్ ట్రస్టు చైర్మన్
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నాం
చాకరిమెట్ల ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నాం. చు ట్టు పక్కల భక్తులే కాకుండా రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు నీటి సదుపాయం, మధ్యాహ్న సమయంలో నిత్యన్నదానం చేపట్టి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాం.
– సార శ్రీనివాస్, ఆలయ ఈవో