వెల్దుర్తి, డిసెంబర్ 12: వానకాలం పంట ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. ఉమ్మడి వెల్దుర్తి మండలంలో మొత్తం 30 గ్రామపంచాయతీలుండగా, వెల్దుర్తి సహకార సంఘం ఆధ్వర్యంలో 22, ఐకేపీ ఆధ్వర్యంలో 5 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ గ్రేడ్ రకానికి రూ.2060, బీ గ్రేడ్ రకానికి రూ.2040 ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించి ధాన్యం కొనుగోళ్లు చేసింది. 27 కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం 5,528 మంది రైతుల నుంచి 6,25,620 బస్తాల్లో రెండు లక్షల యాభై వేల 368 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ధాన్యం విలువ రూ.51 కోట్ల 57 లక్షల 58వేలు కాగా, ఇప్పటి వరకు 70 శాతానికి పైగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కాగా, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రైస్మిల్లులకు తరలించడంతో అక్కడ గుట్టలుగుట్టలుగా ధాన్యం సంచుల రాశులు కనువిందు చేస్తున్నాయి. రైస్మిల్లులలోని ధాన్యాన్ని బియ్యం చేస్తూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు తరలించడానికి బియ్యం బస్తాలను రైస్మిల్లర్లు సిద్ధం చేస్తున్నారు. దీంతో రైస్మిల్లులలో అటు ధాన్యం రాశులు, ఇటు బియ్యం బస్తాల రాశులతో కళకళలాడుతున్నాయి.
కొనుగోళ్లు పూర్తయ్యాయి..
ఉమ్మడి వెల్దుర్తి మండలంలో సంఘం ఆధ్వర్యంలో మొత్తం 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా 5020 మంది రైతుల నుండి 2,26,368 క్వింటాళ్లు (5,67,246 బస్తాలు) ధాన్యం కొనుగో చేశాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆనుసంధానించిన రైస్మిల్లులకు ధాన్యం తరలించడం జరిగింది. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది. కొందరు రైతులు ఆన్లైన్ నమోదు చేసే సమయంలో ఓటీపీలను చెప్పడంలో కొంచెం ఇబ్బందులు తప్ప ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతున్నాయి.
– సిద్ధయ్య, సీఈవో సహకార సంఘం వెల్దుర్తి