సిద్దిపేట, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్ తన ఇరవై ఒక్క ఏండ్ల ప్రస్థానంలో మరో ముందడుగు వేసింది. బుధవారం విజయదశమి రోజున టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తూ జాతీయ పార్టీగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. సరిగా మధ్యాహ్నం 1.19 గంటలకు కేసీఆర్ భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీ ప్రకటన చేశారు. పార్టీ కార్యవర్గ సమావేశానికి జిల్లా నుంచి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, పార్టీ జిల్లాల అధ్యక్షులు కొత్త ప్రభాకర్రెడ్డి, పద్మాదేవేందర్రెడ్డి, చింతా ప్రభాకర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు, పార్టీ కార్యవర్గసభ్యులు హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రకటనతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దేశ్కీ నేత కేసీఆర్.. జైబీఆర్ఎస్…జైజై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. ఊరువాడా, పల్లెపట్టణం అంతటా పార్టీ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. స్వీట్లు పంచి, పటాకులు కాల్చి సంబురాల్లో మునిగి తేలారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. ప్రధాన కూడళ్లల్లో సీఎం కేసీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ను ఆహ్వానించారు. సంబురాలతో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలు గులాబీమయమయ్యాయి. ఇన్నాళ్లు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్.. ఇక బీఆర్ఎస్గా జాతీయ స్థాయిలో సత్తాచాటనున్నది. తెలంగాణ మోడల్గా అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కానున్నాయి.
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం
2001 ఏప్రిల్ 14న సిద్దిపేటలో జరిగిన అంబేద్కర్ జయంతి సభలో పాల్గొన్న కేసీఆర్ తెలంగాణ కోసం పోరాటం తప్పదని ప్రకటించారు. ఉద్యమ పార్టీ ఆవిర్భవాన్ని కూడా ఆ రోజే వెల్లడించారు. 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఉద్యమ పార్టీని స్థాపించారు .ఆ రోజు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు తెలంగాణ యావత్తు సమాజం పులికించింది. ఏప్రిల్ 27న ఉదయమే కేసీఆర్కు ఇష్టదైవమైన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ జెండా క్యాసెట్లను వెంకన్న స్వామి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించిన అనంతరం జై తెలంగాణ .. జైజై తెలంగాణ .. అంటూ ఉద్యమ జెండాను భుజానెత్తుకుని సుమారు వెయ్యి వాహనాల్లో భారీ కాన్వాయ్గా హైదరాబాద్కు బయలుదేరారు. సిద్దిపేట నియోజక వర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందిన వందల మంది ఆయనను అనుసరించారు. ఇక్కడి నుంచి బయలుదేరిన కేసీఆర్, హైదరాబాద్ జుబ్లీహిల్స్లోని తన ఇంటికి వెళ్లారు. రాజీవ్ రహదారి పొడవునా కేసీఆర్ కాన్వాయ్తో నిండిపోయింది.ఇంటి దాకా ప్రభుత్వ వాహనంలో ప్రయాణించిన కేసీఆర్, అక్కడి నుంచి తన సొంత వాహనంలో బయలుదేరి హుస్సేన్ సాగర్ సమీపంలోని జలదృశ్యం సభావేదిక వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆయన ఏం చేస్తున్నారన్న ఉత్కంఠ ప్రజల్లో ఉంది. సభలో తన మనసులో మాట బయటపెట్టారు. తెలంగాణ కోసం తన పదవులకు రాజీనామా చేస్తూ మూడు లేఖలు చంద్రబాబుకు పంపించారు. డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ సభ్యత్వం, పార్టీ పదవులకు ఒకేసారి రాజీనామా చేసి ఆ సమయంలో ఒక రికార్డు నెలకొల్పారు. పదవుల కోసం కాదు.. ప్రజల కోసం పోరాటమంటూ తన లక్ష్యాన్ని ప్రకటించారు. పదవులు వదలుకోవడమనేది అప్పటి వరకు ఎవరూ ఊహించని చర్య. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఉద్యమ పార్టీ స్థాపించారు.
21 ఏండ్ల ప్రస్థానంలో వరుస విజయాలు
తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ఏకైక లక్ష్యమని ఆనాడు టీడీపీ ప్రాథమిక సభ్యత్వం, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు 2001 ఏప్రిల్ 27న రాజీనామా చేశారు. అదే రోజు ఉదయం కోనాయిపల్లి వెంకన్నస్వామి అశీర్వాదం తీసుకొని టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి తన 21 ఏండ్ల ప్రస్తానంలో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అప్పటి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది. ఇవాళ జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ అదే తరహాలో విజయఢంకా మోగించనున్నది. సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడం… ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేట ..ఈ మట్టి బిడ్డనే కావడంతో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. ఇప్పటికే సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పటిష్టమైన క్యాడర్ ఉంది. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్నిచోట్ల టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులే ఉన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావంలో జిల్లాలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ దాని ప్రభావాన్ని స్పష్టంగా ప్రదర్శించింది. 2001లో పార్టీ ఏర్పాటైన రెండు నెలల వ్యవధిలోనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో టీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలుచుకుని రికార్డును సొంతం చేసుకుంది. అదే ఏడాది ఆగస్టులో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.
జడ్పీ వైస్ చైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. 2001 సెప్టెంబర్ 20న జరిగిన సిద్దిపేట అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల డిపాజిట్లు గల్లంతు చేసి కేసీఆర్ తన సత్తాచాటారు. సుమారు 58 వేల మెజార్టీతో శాసన సభకు ఎన్నికయ్యారు. జిల్లాలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ తెలంగాణ వాదులు టీఆర్ఎస్కు తమ మద్ధతును తెలుపుతూ వస్తున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్ జిల్లాలోని సిద్దిపేట, దొమ్మాట, రామాయంపేట, సంగారెడ్డి స్థానాలను గెలుచుకుంది. సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ లోక్సభ స్థానాలకు పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించిన కేసీఆర్, సిద్దిపేట స్థానానికి రాజీనామా చేశారు. రాజీనామాతో ఖాళీ అయిన సిద్దిపేట స్థానాన్ని తన రాజకీయ వారసునిగా హరీశ్రావును ఎన్నికల్లో నిలిపారు. ఆ ఎన్నికల్లో హరీశ్రావు ఘన విజయం సాధించారు.ఉప ఎన్నికల్లోనూ ఇలా ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాన్ని సొంతం చేసుకుంటూ తిరుగులేని పార్టీగా అవతరించింది.2014, 2018 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. స్థాని క సంస్థల ఎన్నికల్లో సైతం సత్తాచాటింది. జిల్లా పరిషత్, మండల పరిషత్త్,తదితర ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఉమ్మడి జిల్లా లో టీఆర్ఎస్కు ఎదురు లేకుండా పోయింది.
ఉమ్మడిమెదక్జిల్లాలోఉద్యమ ఘట్టాలు..
తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ ఎన్నో ఒడిదొడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడింది.2001లో పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు టీఆర్ఎస్పై అవాకులు, చెవాకులు పేలారు. మూడొద్దులకే పార్టీ మూసుకుపోతుందని ఎన్నో రకాలుగా హేళన చేసే మాటలు మాట్లాడారు. అయినా ఎక్కడా కేసీఆర్ వెనుకడుగు వేయకుండా ఉద్యమ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కృతకృత్యులయ్యారు. 2005లో వరంగల్లో నిర్వహించిన జైత్రయాత్ర సభకు కేసీఆర్ సైకిల్పై బయలుదేరి వెళ్లారు. సిద్దిపేట నుంచి వరంగల్ బహిరంగ సభ వరకు ఆయన వెంట సైకిళ్ల పై వందల మంది కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు. 2006లో తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పడంతో ఆ పార్టీపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. సిద్దిపేటలో శంఖరావం పేరిట బహిరంగ సభ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి లక్షల్లో ప్రజలు హాజరై సభకు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు.అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి ఎమ్మెస్సార్ చేసిన వ్యాఖ్యలకు సవాలుగా కేసీఆర్ కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సభలో ప్రకటించారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కనీవిని ఎరుగని రీతిలో భారీ మెజార్టీతో కేసీఆర్ గెలుపొందారు.
తెలంగాణ కోసం మహాధర్నా పేరిట రాజీవ్ రహదారిని దిగ్బంధం చేశారు. సిద్దిపేట శివారులోని రాజీవ్ రహదారి పై జరిగిన కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. 2008లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించిన తరువాత కాంగ్రెస్ నాయకులకు సవాల్ చేస్తూ సిద్దిపేటలో హరీశ్రావు నాయకత్వంలో నిర్వహించిన ఉద్యోగ గర్జనకు భారీ స్పందన లభించింది. 2009 నవంబర్లో సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ తెలంగాణ వాలె.. జాగో ఆంధ్రా వాలె.. బాగో నినాదమిచ్చారు. ఆ తరువాత నవంబర్ 9 మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములపై ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆందోళనకు దిగారు. హరీశ్రావు, కేటీఆర్, కొత్త ప్రభాకర్రెడ్డి తదితరులంతా పాల్గొని ఆందోళన ఉధృతం చేశారు. హైదరాబాద్ ఫ్రీజోన్ అంటూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఫ్రీజోన్ రద్దుకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో కేసీఆర్ ఆమరణ దీక్షకు నిర్ణయించారు.
సమైక్య రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు
సమైక్య రాష్ట్రంలో మెతుకుసీమ మెదక్ జిల్లా రైతులకు అన్నీ కష్టాలే. సమైక్య ప్రభుత్వాల హయా ంలో సిద్దిపేట డివిజన్లోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో రైతు ఆత్మహత్యలు అధికంగా జరిగేవి. ఆనాటి ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదు. సాగునీటి కోసం ఒక ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన వారికి రాలేదు. కేసీఆర్ తానే స్వయంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేసి నిర్మింపజేశారు. ఫలితంగా రైతాంగానికి పుష్కలంగా సాగు నీరు అందుబాటులోకి వచ్చింది. ఇవాళ రైతులు రికార్డు స్థాయి పంటలు పండిస్తూ జిల్లాను అన్నపూర్ణగా, ధాన్య భాండాగారంగా మారారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ సరఫరా వంటి పథకాలను అమలు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేయూతనిస్తున్నది. ఈ పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయి.
అనతికాలంలోనే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు
14 ఏండ్ల పాటు సుధీర్ఘ ఉద్యమం నడిపించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా, సాధించిన రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. సీఎం కేసీఆర్ సారథ్యంలో అనతి కాలంలోనే తెలంగాణ దేశంలో అగ్రగామి గా ఎదిగింది. రైతుబంధు పథకం ద్వారా కోట్ల రూ పాయలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. రైతుబీమా పథకంతో రైతు కుటుంబాలకు ధీమా ఏర్పడింది. దళితజాతి ప్రగతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారు. తొలి విడతలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వంద యూనిట్లు గ్రౌడి ంగ్ చేశారు. రైతులకు 24గంటలు నిరంతరాయంగా ఉచిత కరెం ట్ సరఫరా, గృహాలు,పారిశ్రామిక అవసరాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నది. దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ. పేదింటి ఆడపిల్లలకు కల్యాణక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్ వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా మారాయి.
టీఆర్ఎస్ ఏర్పాటుకు నాంది ఇక్కడే…
1985 నుంచి టీడీపీ తరపున ఓటమెరుగక సిద్దిపేట నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్.. రాష్ట్ర మంత్రిగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పలు పదవులు నిర్వహించారు. టీడీపీ హయాంలో ప్రారంభించిన జన్మభూమి జన్మభూమి స్ఫూర్తితో తన స్వగ్రామం సిద్దిపేట మండలం చింతమడకలోని సొంతింటిని ప్రభుత్వ పాఠశాల కోసం ఆయన విరాళంగా ఇచ్చారు. దానిని ఆనుకొని ఉన్న 3 మూడెకరాల స్థలాన్ని గ్రామంలోని వెనుకబడిన తరగతుల వారి ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా అందించారు.1999లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్కు అప్పటి సీఎం చంద్రబాబు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు అప్పగించారు. ఓవైపు డిప్యూటీ స్పీకర్గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తప్పుబట్టారు. విద్యుత్ చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాయంపై పిడికిలెత్తారు. ఆయన చొరవకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి మద్ధతు లభించింది.
సిద్దిపేట వేదికగా కేసీఆర్ ఆమరణ దీక్ష
సిద్దిపేట వేదికగా కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగుతానని ప్రకటించడంతో మరోసారి జిల్లా వార్తల్లోకెక్కింది. ఆమరణ దీక్ష బయలుదేరిన కేసీఆర్ను కరీంనగర్ శివారులో పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం తరలించారు. సిద్దిపేట దీక్షా స్థలి వద్ద హరీశ్రావు, పద్మాదేవేందర్రెడ్డి, దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి తదితర నాయకులు దీక్షకు సిద్ధమవడంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఆ దీక్షాస్థలిని అణచివేశారు. హరీశ్రావు దీక్షాస్థలి వేదిక పైనే ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో రాష్ట్రవ్యాప్త సంచలనమైంది. దీంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. కేసీఆర్ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించడం, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యమం బాట పట్టడంతో జిల్లా విద్యార్థి లోకం లేచింది. జిల్లా విద్యార్థి విభాగం నాయకులు విద్యార్థులను చైతన్యపరిచేందుకు విస్తృతంగా విద్యార్థి గర్జన పేరిట సదస్సులు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జాతీయ రహదారిపై భారీ ధర్నా నిర్వహించారు. రైలురోకోలు, తెలంగాణ కోస ం రోడ్లపై వంటావా ర్పు, రోడ్ల దిగ్బంధం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.తెలంగాణ ఉద్యమమే కాకుండా టీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై సైతం పోరాటం చేసింది. 42 రోజుల పాటు జరిగిన సకల జనుల సమ్మెలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. హరీశ్రావు నేతృత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 132 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు.
మన కండ్ల ముందే ప్రాజెక్టు నిర్మాణం…
‘సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు’ అన్న దివంగత ప్రధాని జవహర్లాల్ మాట మరోమారు నిజమైంది. సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో మనం కలలు కన్న ప్రాజెక్టులు కండ్ల ముందే సాకారమయ్యాయి. ఎడారిగా మారిన మెతుకు సీమలో సిరులు పండించేందుకు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్లు పూర్తయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో సిద్దిపేట జిల్లా రిజర్వాయర్ల ఖిల్లాగా మారింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కంటే అత్యధికంగా రిజర్వాయర్లు నిర్మించిది ఈ జిల్లాలోనే. ఎక్కువ మొత్తంలో భూసేకరణ చేసింది కూడా ఇక్కడే. సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు, మల్లన్నసాగర్లో 50 టీఎంసీలు, కొండపోచమ్మసాగర్లో 15 టీఎంసీలు,అన్నపూర్ణ రిజర్వాయర్లో 3.5 టీఎంసీల సామర్ధ్యం కలిగినవి. సీఎం కేసీఆర్ చేసిన గొప్ప భగీరథ ప్రయత్నం ఫలించింది. బీడు వారిన పంట పొలాలను సస్యశ్యామలం చేయడంతో జిల్లాకు పచ్చలహారం తొడిగినైట్లెంది. ఎటుచూసినా పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు పక్కనే ఉన్న ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాలకు ఈ ప్రాజెక్టులతో బహుళ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.