మెదక్, ఫిబ్రవరి 17 : రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేస్తూ అన్నదాతల కండ్లల్లో ఆనందం వెల్లివిరిసేలా చేస్తూ రైతన్నలకు అండగా ఉంటున్న సీఎం కేసీఆర్ మరోసారి తన ప్రభు త్వ ఉదారతను చాటుకున్నారు. ఇప్పటికే రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్న విషయం విదితమే. గతంలో రైతుబీమా కోసం దరఖాస్తు చేస్తే రోజులు గడిచేవి. కానీ, ప్రజల కష్టాలు గుర్తెరిగిన సీఎం కేసీఆర్ రైతుబీమా పథకాన్ని ఒక్కరోజుల్లోనే అందేలా నూతన సంస్కరణలు రూపొందించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్పల్లి గ్రామానికి చెందిన మంగళి దుర్గమ్మ అనే రైతు జనవరి 26, 2022న మృతి చెందింది. ఆమెకు రైతుబీమా పథకంలో అర్హత ఉన్నందున నామినీ ఆమె కొడుకు మంగళి నరేశ్ ఈ నెల 16న రైతుబీమాకు సంబంధించిన డాక్యుమెంట్లను గ్రామ వ్యవసాయ విస్తరణాధికారి ప్రతిభకు అందజేశారు. 16వ తేదీన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయగా, 17న రైతుబీమా సొమ్ము తన ఖాతాలో రూ.5 లక్షలు జమ అయ్యాయి. సీఎం కేసీఆర్ పుట్టిన రోజున రైతుబీమా డబ్బులు తన ఖాతాలో జమ కావడంపై రైతు మంగళి నరేశ్ సంతోషం వ్యక్తం చేశాడు.
అప్పులు కట్టుకుంటా..
మా అమ్మ అప్పులు చేసింది. రైతుబీమా డబ్బుల నుంచి కొంత డబ్బులను అప్పులు కట్టుకుంటా.. మిగతా డబ్బులను నా కూతురు పేరుపైన బ్యాంకులో డిపాజిట్ చేస్తా. రైతు బీమా ద్వారా ఒక్క రోజుల్లో రూ.5 లక్షలు నా ఖాతాలో జమ చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
-మంగళి నరేశ్, పోతంశెట్పల్లి, కొల్చారం మండలం