కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై నిత్యం విషం చిమ్ముతూనే ఉంది. బయ్యారం ఉక్కు ప్లాంట్ ఏర్పాటు, నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి ఇప్పుడవి సాధ్యం కావని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటించడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మోసపూరిత వాగ్ధానాలు.. అసమర్థ పాలనతో ప్రజలను నమ్మిస్తూ ఎంతో మంది జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా మోదీ సర్కార్ నిర్ణయం మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ప్రజలు, వివిధ సంఘాలు, పార్టీల నేతలు హెచ్చరిస్తున్నారు.
సంగారెడ్డి, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ)ః తెలంగాణ ప్రజలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి మోసగించింది. సాధ్యం కాని పథకాలు, మోసపూరిత మేనిఫెస్టోతో అధికారంలోకి వచ్చిన బీజేపీ రాష్ట్రం పట్ల వివక్ష కొనసాగిస్తూనే ఉన్నది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో నెలకొల్పుతామన్న స్టీల్ ప్లాంట్ను చేపట్టడం సాధ్యం కాదని స్వయంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించడంపై ప్రజలు, వివిధ కుల సంఘాలు, సొసైటీలు, పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
గత ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో బూటకపు మాటలు చెప్పారని, అది ఇప్పుడు రుజువైందని కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. నమ్మశక్యం కాని వాగ్ధ్దానాలను చేసి జనాలను బురిడీ కొట్టించారని బీజేపీ పాలనను ఛీ కొడుతున్నారు. నిజాం చక్కెర ఫ్యాక్టరీని కూడా పునఃప్రారంభిస్తామని వాగ్దానం చేసిన కేంద్రం, దానిని కూడా అటకెక్కించి, వేలాది మంది రైతుల బతుకుల్లో నిప్పులు పోసిందంటున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ వస్తున్నదని, నిజాం చక్కెర ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభమవుతున్నదని ఎంతో మంది రైతులు, కార్మికులకు ఉపాధి దొరుకుతుందని సంబురపడ్డ జనం ఆశలను కేంద్ర ప్రభుత్వం అడియాశలు చేసిందన్నారు.
వేల మంది జీవితాల్లో వెలుగులు నింపుతాయనుకున్న బీజేపీ పథకాలు, వారి బతుకులను అంధకారంలో నెట్టేసిందని, అసమర్థపాలనతో సామాన్యు ల జీవితాలతో ఆటలాడుకుంటుందని మండిపడుతున్నా రు. కేంద్ర ప్రభు త్వ మోసపూరితమైన మాటల కు ఎవ్వరూ బలికావొద్దని హెచ్చరిస్తున్నా రు. మీ మేనిఫెస్టో నిజమైతే.. మీరు ప్రకటించిన ఫ్యాక్టరీలను ప్రారంభిస్తేనే మీ పార్టీని ప్రజలు నమ్ముతామని చెబుతున్నారు. చెప్పేదొకటి.. చేసేదొకటని.. వారి దంతా మోసమేనని అభిప్రాయపడుతున్నారు.
బీజేపీ నైజం.. పచ్చి మోసం…
సామాన్యుల జీవితాలతో బీజేపీ ఆడుకుంటున్నది. అధికారంలోకి వచ్చేందుకు మోసపూరితమైన వైఖరితో జనాల్ని బురిడీ కొట్టించింది. మీరు చెప్పిన స్టీల్ ప్లాంట్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏమయ్యాయి. మోసంతో నడిచే ప్రభుత్వాలు ఎంతో కాలం నిలబడవు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి నిజాం షుగర్ ఫ్యాక్టరీ రైతుల వ్యథలు తెలవవా? ఇలా తెలంగాణను ఎంతకాలం వంచిస్తారు.?
– వెంకటేశం గౌడ్, టీఆర్ఎస్ నాయకుడు, సంగారెడ్డి
ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పాలి..
బీజేపీ మేనిఫెస్టో మోసపూరితం కాకపోతే.. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పాలి. ఎంతో మంది సామాన్యులను వం చించారు. నిజాం షుగ ర్ ఫ్యాక్టరీని నమ్ముకొని వేలాది మంది రైతులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, మంత్రి కిషన్రెడ్డికి ఈ విషయాలు తెలియవా? ఎట్టి పరిస్థితుల్లో షుగర్ ఫ్యాక్టరీని వినియోగంలోకి తీసుకురావాలి. రైతులకు అండగా ఉండాలి. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వంపై ఆందోళన చేస్తాం.
– చిన్న పాపని కుమార్ గౌడ్,జడ్పీటీసీ గుమ్మడిదల మండలం.