నర్సాపూర్, ఫిబ్రవరి 14 : ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించుకొని సీతారాంపూర్ వాసులు ఆదర్శంగా నిలిచారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని సీతారాంపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు రెండో విడుత చెక్కులను ఆయన అందజేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే కలియతిరుగుతూ లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా సీతారాంపూర్ గ్రామస్తులు డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించుకున్నారని తెలిపారు. ఇండ్ల నిర్మాణం పూర్తైన వెంటనే మంత్రి హరీశ్రావుతో గృహప్రవేశాలు నిర్వహించి, సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొంటానని చెప్పారు. గ్రామానికి 45 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా, 30 ఇండ్ల నిర్మాణం చివరి దశకు చేరుకున్నట్లు తెలిపారు. మొదటి విడుత 52 లక్షలు, రెండో విడుతలో రూ.69 లక్షల చెక్కులను పంపిణీ చేశామని, ఇంకో రూ.2 కోట్లు త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు. పేదల కలను సాకారం చేయడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. గ్రామంలో నిర్మించే అండర్ డ్రైనేజ్ పైపులైన్కు నిధులను త్వరలోనే మంజూరు చేస్తానని హమీనిచ్చారు. గ్రామంలో నూతనంగా నిర్మించే సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ శివకుమార్, సర్పంచ్ పోచమ్మ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అశోక్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మ న్ నయీమొద్దీన్, ఏఎంసీ వైస్ చైర్మన్ హబీబ్ఖాన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, జడ్పీటీసీ బాబ్యానాయక్, టీఆర్ఎస్ యువ నాయకుడు సుదీప్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు
మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు నార్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి సమక్షంలో సోమవారం టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు జోగు మల్లేశ్, ఎల్ర పోచయ్య, జోగు శ్రీశైలంతో పాటు ఇతర కార్యకర్తలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.